ప్రైవేటు టీచర్లకు జీతాలివ్వని స్కూళ్లపై కఠిన చర్యలు- ఏపీ సర్కార్ ఆదేశాలు..
ఏపీలో కరోనా వ్యాప్తి మొదలయ్యాక స్కూళ్లు మూతపడ్డాయి. ఆ తర్వాత అన్లాక్ ప్రక్రియ మొదలైన తర్వాత ఆన్లైన్ పాఠాలు కొనసాగుతున్నాయి. అయినా మార్చి నెల నుంచి టీచర్లకు జీతాలివ్వకుండా వారి సేవలను వాడుకుంటున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు కూడా ఉన్నాయి. దీంతో టీచర్లు రోడ్డున పడుతున్నారు. దీనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో ప్రభుత్వం స్పందించింది.
ఏపీలో టీచర్లకు జీతాలివ్వకుండా కాలయాపన చేస్తున్న ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విద్యాశాఖ జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చింది. టీచర్లకు జీతాలు ఇవ్వని పాఠశాలల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని డీఈఓలను ఆదేశిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వాడ్రేవు చినవీరభద్రుడు ఉత్తర్వులు జారీచేశారు.

Recommended Video
లాక్ డౌన్ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు వేతనాలు చెల్లించటం లేదని వాటిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం ప్రైవేటు టీచర్లను యాజమాన్యాలు ఆదుకోవాల్సిందేనని స్పష్టం చేసింది.
ఉపాధ్యాయులకు జీతాలు ఇప్పించే బాధ్యతను డీఈవోలే తీసుకోవాలని విద్యాశాఖ అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ఉపాధ్యాయులకు వేతనాలు ఇవ్వని యాజమాన్యాలకు నోటీసులు జారీ చేసి, చట్ట ప్రకారం చర్యలకు సిద్ధం కావాలని తాజాగా జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications