జగన్ సర్కారుకు టీడీపీ 20 ఏళ్ల పెనాల్టీ- థ్యాంక్స్ చెప్పిన మంత్రి గౌతం రెడ్డి....
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వం పరిశ్రమలను ఆకర్షించడానికి భారీ ఎత్తున రాయితీలు ప్రకటించింది. వీటి ద్వారా భారీగా పరిశ్రమలు ఆకర్షించాలన్న ఉద్దేశం ఎంత వరకూ నెరవేరిందో తెలియదు కానీ అవన్నీ ఇప్పుడు ప్రస్తుత వైసీపీ ప్రభుత్వానికి గుదిబండలుగా మారిపోయాయి. కొత్త పరిశ్రమలను ఆకర్షించడం మాట అటుంచి గత ప్రభుత్వం ప్రకటించినా రాయితీలను చెల్లించేందుకే ఖజానా ఖాళీ అవుతోంది. ఇదే అంశంపై తాజాగా పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి నిర్వేదం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ ప్లాంట్ రాక, దాని వల్ల ప్రభుత్వానికి కలిసిన లాభ నష్టాలపై తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు వాస్తవ పరిస్ధితికి అద్దం పట్టేలా ఉన్నాయి.

కుప్పలుతెప్పలుగా రాయితీలు..
ఏ రాష్ట్రంలో అయినా పరిశ్రమలు రావాలంటే కొన్ని రాయితీలు, తాయిలాలు ప్రకటించడం సాధారణంగా జరిగేదే. కానీ పరిశ్రమలు రావాలంటే రాయితీలు తప్పనిసరి అనే పరిస్ధితి నుంచి మెల్లగా ప్రభుత్వాలు బయటపడుతున్నాయి. ఒకప్పుడు భారీ రాయితీలతో పరిశ్రమలను ఆకర్షించిన రాష్ట్రాలు సైతం ఇప్పుడు రాయితీలు ఇచ్చేందుకు నిరాకరిస్తున్నాయి. రాయితీలతో పరిశ్రమలు తీసుకొచ్చినా వాటి వల్ల వచ్చే ఉద్యోగాలు, రాష్ట్రానికి కలిగే లాభాలు తగ్గిపోవడంతో ఇన్సెటివ్స్ వ్యవహారం ఓ బోగస్గా మారిపోతోంది. ప్రస్తుతం ఏపీలో వైసీపీ సర్కారు సైతం ఇన్సెంటివ్స్తో పరిశ్రమలను రప్పించేందుకు ఏమాత్రం ఆసక్తి చూపడం లేదు.

టీడీపీ హయాంలో కియా రాక...
ఏపీలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో అనంతపురం జిల్లాలో కియా మోటార్స్ పరిశ్రమ ఏర్పాటైంది. ఇందుకోసం అప్పటి సర్కారు భారీ ఎత్తున రాయితీలు, ఇన్సెంటివ్స్ ఆశ చూపింది. దీంతో ఇతర రాష్ట్రాలను కాదని ఏపీలో కియా ప్లాంట్ పెట్టారు. కియా రాకతో అనంతపురం జిల్లాలో కానీ రాష్ట్రంలో కానీ భారీ ఎత్తున ఉద్యోగాలు లభించిన దాఖలాలు లేవు. కానీ కియా మోటార్స్కు ఆశ చూపిన 20 ఏళ్ల ఇన్సెంటివ్స్ ఇప్పుడు రాష్ట్ర ఖజానాకు గుది బండలా మారుతున్నాయి. గతంలో ఇచ్చిన హామీ మేరకు వాటిని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు తప్పనిసరిగా చెల్లించాల్సిందే. రాయితీలు ఇవ్వాల్సిందే. దీంతో ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం కియాను తీసుకురావడం వల్ల మేలు జరిగిందా లేక నష్టం జరుగుతోందా అన్న చర్చ సాగుతోంది.

టీడీపీ 20 ఏళ్ల పెనాల్టీ వేసిందన్న గౌతంరెడ్డి...
ప్రస్తుతం కియా పరిశ్రమకు ప్రభుత్వం నుంచి ఇస్తున్న రాయితీలను చూస్తుంటే కియా వచ్చినందుకు సంతోషించాలో లేక 20 ఏళ్ల జరిమానా వేసినందుకు బాధపడాలో తెలియడం లేదని పరిశ్రమల మంత్రి గౌతం రెడ్డి వ్యాఖ్యానించారు. కియో మోటార్స్ తెచ్చినందుకు టీడీపీకి అభినందనలు అంటూనే 20 ఏళ్ల పాటు పెనాల్టీ కట్టాల్సి వస్తోందని గౌతం రెడ్డి తెలిపారు. దీన్ని బట్టి చూస్తే కియా పరిశ్రమ వల్ల రాష్ట్రానికి జరిగిన మేలేంటనే చర్చ సాగుతోంది. తాజాగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో రాష్ట్రం దేశంలోనే అగ్రస్ధానంలో ఉందని తేలింది. ప్రస్తుత ప్రభుత్వం రాయితీలపై ఆసక్తిగా లేదు. అయినా ఈవోడీబీ ర్యాంకుల్లో మెరుగ్గానే ఉంది. కాబట్టి ఇన్సెంటివ్స్ విధానానికి మంగళం పాడేయడం ఖాయంగా కనిపిస్తోంది.

వైసీపీ అసలు ఉద్దేశం ఇదే..
రాయితీలు, ప్రోత్సాహకాలు ప్రకటిస్తే కానీ రాష్ట్రానికి పరిశ్రమలు రావంటే అవి మాకు అక్కర్లేదనే వాస్తవాన్ని వైసీపీ సర్కారు ఏనాడో కుండబద్దలు కొట్టేసింది. ఇప్పుడు కొత్తగా చెప్పేదేమీ లేదు. రాయితీల ద్వారా పరిశ్రమల స్ధాపన జరుగుతుందేమో కానీ ఆ తర్వాత రాష్ట్రానికి దీర్ఘకాలంలో వచ్చే ప్రయోజనం ఏమీ లేదు. దానికంటే నిజాయితీగా ఉండే పారిశ్రామిక విధానమే పరిశ్రమలకు మంచిదని వైసీపీ సర్కారు భావిస్తోంది. అందుకే పరిశ్రమలకు ప్రోత్సాహకాలు ఇచ్చి తీసుకురావడం కంటే వాటి వల్ల వచ్చే ప్రయోజనాల ఆధారంగానే వాటికి ఆహ్వానం పలుకుతోంది. ఏడాది కాలంలో వచ్చిన పరిశ్రమలతో పాటు భవిష్యత్తులో రాబోయే పరిశ్రమలకు కూడా ఇదే విధానం అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ విధానం ఫలితమిచ్చిందా లేదా అన్నది ఎలాగో వచ్చే ఏడాది ప్రకటించే ఈవోడీబీ ర్యాంకుల్లో స్పష్టమవుతుంది.












Click it and Unblock the Notifications