ఏపీలో నిన్ను మించిన ఆంబోతు ఎవరు.. భాష జాగ్రత్త.. : లోకేష్కు బొత్స హెచ్చరిక
వైసీపీ ప్రభుత్వాన్ని టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ ఆంబోతుల ప్రభుత్వమని విమర్శిస్తున్నారని,రాష్ట్రంలో ఆయన్ను మించిన ఆంబోతులు ఎవరున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. తామేమీ లోకేష్ తరహాలో రాజకీయాల్లోకి రాలేదని.. ప్రజలు తమను ఎన్నుకుంటే ఎమ్మెల్యేలుగా,మంత్రులుగా కొనసాగుతున్నామని చెప్పారు. ఇకపై లోకేష్ మాట్లాడేటప్పుడు భాషను జాగ్రత్తగా ఉపయోగించాలని హెచ్చరించారు. రాజధాని వివాదంపై అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బొత్స మాట్లాడారు.

అప్పుడలా.. ఇప్పుడిలా :
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు,కొన్ని పత్రికలతో కలిసి రాజధానిపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని బొత్స మండిపడ్డారు. గతేడాది డిసెంబర్ 24న ఓ ప్రముఖ పత్రికలో ప్రచురించిన కథనంలో..
రాజధానికి తాత్కాలిక అంచనా వ్యయం రూ.1లక్షా 9వేల 23కోట్లుగా పేర్కొన్నారని.. ఇప్పుడేమో అన్నీ అమరిన రాజధాని అంటూ అదే పత్రికలో కథనాలు రాస్తున్నారని బొత్స ఆరోపించారు. రూ.3వేల కోట్లతో అమరావతిలో అన్ని పనులు అయిపోతాయని చంద్రబాబు అంటున్నారని.. అలాంటప్పుడు రాజధానికి లక్ష కోట్ల పైచిలుకు వ్యయం అవసరమవుతుందని గతంలో ఎలా మాట్లాడారని ప్రశ్నించారు. అది నోరా.. తాటిమట్టా అంటూ విమర్శించారు. రాజధానిలో అన్ని కార్యాలయాలు ఏర్పాటయ్యాయని చెబుతున్నారని, అవన్నీ తాత్కాలిక కార్యాలయాలే అన్న విషయం మాత్రం ఎందుకు చెప్పడం లేదని నిలదీశారు.

చంద్రబాబు కుట్ర..
గతంలో నివేదికలు ఇచ్చిన శ్రీకృష్ణ కమిటీ,శివరామకృష్ణన్ కమిటీలు అభివృద్ది వికేంద్రీకరణ గురించే చెప్పాయని బొత్స అన్నారు. రాష్ట్రంలో 13 జిల్లాలు సమానంగా అభివృద్ది చెందాలన్న లక్ష్యంతోనే తాము
ముందుకెళ్తున్నామని స్పష్టం చేశారు. కొన్ని పత్రికలు కావాలనే దుష్ప్రచారాలు మొదలుపెట్టాయని.. ప్రజాప్రతినిధులు మీకు తొత్తుల్లా ఉండాలా..? అని ఆ పత్రికలను ఉద్దేశించి ప్రశ్నించారు. చంద్రబాబుతో కలిసి వారు కుట్ర పన్నుతున్నారని, తమ పబ్బం గడుపుకోవడానికే ఇవన్నీ చేస్తున్నారని విమర్శించారు.

ఉత్తరాంధ్ర జనం మనుషులు కారా..?
విజయవాడ నుండి విశాఖపట్నంకు 400కి.మీ దూరమని కొన్ని పత్రికలు ప్రచురించాయన్న బొత్స.. మరి విశాఖ ప్రజలకు కూడా విజయవాడ అంతే దూరం కదా అని వ్యాఖ్యానించారు. అక్కడివారు మనుషులు కాదా అని నిలదీశారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఇంకా వెనుకబడిపోవాలని కోరుకుంటున్నారా అని మండిపడ్డారు. టీడీపీ హయాంలో 1లక్షా 95వేల కోట్ల అప్పు చేసిన చంద్రబాబు.. ఆ డబ్బుతో ఏం చేసినట్టు అని ప్రశ్నించారు.

అన్ని ప్రాంతాల అభివృద్దే లక్ష్యం..
ఆనాడు హుద్హుద్ తుఫాన్ పేరుతో దోచుకున్న నిధుల కోసం టీడీపీ మంత్రులే కొట్టుకున్న మాట నిజం కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు ఇకనైనా వ్యక్తిగత స్వార్థం గురించి ఆలోచించకుండా రాష్ట్ర అభివృద్ది గురించి ఆలోచించాలన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు చంద్రబాబు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే బుధవారం రాత్రి అనుమతి లేకపోయినా పాదయాత్రకు సిద్దమై అరెస్టయ్యారని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ పాదయాత్ర కోసం రూట్ మ్యాప్ సహా అన్ని వివరాలు అందజేసి అనుమతులు పొందామని చెప్పారు. పోలీసులకు రూట్ మ్యాప్ ఇవ్వకుండా పాదయాత్రకు సిద్దమైతే అరెస్టులు చేయరా అని ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వం అద్భుతమైన సంక్షేమ,అభివృద్ది పథకాలు తీసుకొచ్చిందని.. అన్ని ప్రాంతాల అభివృద్దే లక్ష్యంగా తాము ముందుకు సాగుతామని మరోసారి స్పష్టం చేశారు. ఏ ఒక్కరి ఆందోళనకో,బెదిరింపులకో,బ్లాక్మెయిలింగ్లకో,పిచ్చి రాతలకో తాము తలొగ్గమని తేల్చి చెప్పారు.












Click it and Unblock the Notifications