అమ్మోరి సాక్షిగా - రాజధానిగా అమరావతిపై చంద్రబాబు కీలక వ్యాఖ్యలు ..!!
విజయవాడ: విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో దేవీ శరన్నవ రాత్రుల ఉత్సవాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. విజయదశమిని పురస్కరించుకుని భక్తులు పోటెత్తారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దర్శనం కోసం తెల్లవారు జాము నుంచే భక్తులు బారులు తీరి నిల్చున్నారు. తెలంగాణ, ఒడిశా నుంచీ పెద్ద సంఖ్యలో భక్తులు ఇంద్రకీలాద్రికి వచ్చారు. భక్తిశ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుంటోన్నారు.
మునుగోడు బరిలో గద్దర్ - ఎవరూ ఊహించని పార్టీ నుంచి పోటీ..!!
విజయదశమి సందర్భంగా తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరి అమ్మవారిని దర్శించారు. ప్రత్యేక పూజలు చేశారు. ఈ ఉదయం ఎన్టీఆర్ జిల్లా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి ఆలయానికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా దేవస్థానం పాలక మండలి సభ్యులు, అర్చకులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారికి చీర, కానుకలు సమర్పించారు చంద్రబాబు దంపతులు. ప్రత్యేక పూజలు చేశారు. దర్శనానంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలు, కనకదుర్గమ్మ అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు.
ఆలయం నుంచి బయటికి వచ్చిన తరువాత చంద్రబాబు కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. అమరావతి రాజధాని అంశాన్ని ప్రస్తావించారు. తన ప్రభుత్వ హాయంలో 150 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి ఇంద్రకీలాద్రిని అభివృద్ధి చేశామని అన్నారు. దుర్గమ్మ తల్లి సాక్షిగా నాడు రాజధానిగా అమరావతి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించామని చంద్రబాబు గుర్తు చేశారు. అన్ని పవిత్ర స్థలాల నుంచి నీరు, మట్టి తీసుకువచ్చి, రాష్ట్ర ప్రజలను అందరినీ భాగస్వాములను చేశామని చెప్పారు.
అందరి సహకారంతో అమరావతి నిర్మాణ పనులను ప్రారంభించామని, అప్పట్లో అన్ని రాజకీయ పార్టీలు దీనికి ఆమోదం తెలిపాయని అన్నారు. రాజధాని కావడం వల్లే తాము కూడా ఇక్కడే ఇళ్లు కట్టుకున్నామని వైసీపీ నాయకులు కూడా చెప్పారని పేర్కొన్నారు. రాజధాని అమరావతిపై రోజుకో మాట మాట్లాడడం వైసీపీ నాయకులకు ఎంత మాత్రం మంచిది కాదని, వాళ్లను దుర్గమ్మ తల్లి క్షమించదని చంద్రబాబు హెచ్చరించారు.