అదే వారి లక్ష్యం.. టీడీపీ నేతలపై కొడాలి నాని ధ్వజం, బుద్దా అరెస్ట్పై భగ్గుమన్న లోకేశ్
గుడివాడ కేసినో వివాదం అగ్గిరాజేసింది. బుద్దా వెంకన్న చేసిన హాట్ కామెంట్స్ అరెస్ట్కు దారితీసింది. తాజాగా దీనిపై మంత్రి కొడాలి నాని స్పందించారు. అల్జీమర్స్ జబ్బుతో బాధపడుతున్న చంద్రబాబు విపక్షనేతగా ఉండడం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం అని తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. టీడీపీతోపాటు మీడియాలో ఓ వర్గం తనపై దృష్టి పెట్టిందని ఆయన ఆరోపించారు. తనను మంత్రి పదవీ నుంచి తప్పించాలన్నదే చంద్రబాబు ప్రయత్నం అని వివరించారు. గుడివాడలో తన 'కే కన్వెన్షన్లో కేసినో జరిగిందని తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొట్టిపారేశారు.

సవాల్ చేస్తే.. అక్కడ కాదు ఇక్కడ అని
అది నిజమని నిరూపిస్తే తాను ఆత్మహత్య చేసుకుంటానని సవాల్ విసిరితే, కే కన్వెన్షన్ సమీపంలో జరిగిందని మాటమార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కే కన్వెన్షన్ సెంటర్ సమీపంలో అని కాకుండా, గుడివాడలో జరిగిందని అంటున్నారని విమర్శించారు. తాను ఆరోగ్యం బాగాలేక ఆసుపత్రిలో ఉంటే తనపై ఇష్టం వచ్చిన విధంగా రాద్ధాంతం చేశారని ఆరోపించారు. కరోనా వచ్చి చికిత్స పొందుతున్న తనను టార్గెట్ చేశారని వివరించారు.

420 బ్యాచ్..
420గాళ్లు, మర్డర్ కేసులో ఉన్నవాళ్లు, సీఐగా ఉన్నప్పుడు ఒళ్లు అమ్ముకునేవాళ్ల వద్ద కూడా డబ్బులు కొట్టేసినవాడు, కాల్ మనీ, సెక్స్ రాకెట్లో ఉన్నవాళ్లు... వీళ్లు నిజనిర్ధారణ కమిటీలో సభ్యులా అంటూ సెటైర్లు వేశారు. వీళ్లను ప్రజలు రాజకీయ సమాధి చేసి రెండున్నరేళ్లు అయిందని, వచ్చే ఎన్నికలు కాదు కదా, సమీప భవిష్యత్తులో టీడీపీ గెలిచేది లేదని స్పష్టం చేశారు. 2024 కాదు 2034 వరకు టైం ఇస్తున్నా... గెలిచి చూపించండి అంటూ సవాల్ విసిరారు. తర్వాత డీజీపీపై పడి ఏడుస్తున్నారు. ఆయన విజయవాడ కమిషనర్గా చేశారు. బుద్ధా వెంకన్న ఎలాంటివాడో, బోండా ఉమ ఎలాంటివాడో ఆయనకు బాగా తెలుసు. బుద్ధా వెంకన్న ఒళ్లు దగ్గరపెట్టుకోవాలి. పిచ్చివాగుడు వాగితే పోలీసు యంత్రాంగం, ప్రభుత్వం చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

నో పోలీస్.. కానీ
ఇటు బుద్ధా వెంకన్న అరెస్ట్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. గుడివాడలో కొడాలి నాని కేసినో నడిపితే నో పోలీస్. అదే గడ్డం గ్యాంగ్ ప్రతిపక్ష నేతని బూతులు తిడితే నో పోలీస్. చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తే నో పోలీస్. టీడీపీ కేంద్ర కార్యాలయాన్ని వైసీపీ మూకలు ధ్వంసం చేస్తే నో పోలీస్" అని మండిపడ్డారు. బూతులేంట్రా సన్నాసి నాని అని బుద్ధా వెంకన్న నిలదీస్తే బిలబిలామంటూ వచ్చిన పోలీసులు అరెస్ట్ చేశారని విమర్శించారు. ఏపీ పోలీసులు ప్రజారక్షణకు ఉన్నారా? లేక నేరాలు చేసే వైసీపీ నేతలకు కాపలా కాస్తున్నారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుద్ధా వెంకన్న అరెస్ట్ ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. కేసినో వ్యవహారంపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడానికి వెళితే కనీసం అనుమతించని డీజీపీ.. ఐపీఎస్ ముసుగులో ఎన్నాళ్లిలా వైసీపీ కోసం పనిచేస్తారని నిలదీశారు. వైసీపీలో చేరితే వాటాల్లేకుండా మీరే కేసినో నడుపుకోవచ్చని ఎద్దేవా చేశారు.












Click it and Unblock the Notifications