విజయవాడలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్: అర్దరాత్రి తర్వాత అపార్ట్మెంట్లోకి, అలర్ట్
విజయవాడ: కృష్ణా జిల్లాలోని విజయవాడ నగర శివారు ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేసింది. గుంటుపల్లి గ్రామంలోని ఓ అపార్ట్మెంట్లోకి ఐదుగురు సభ్యుల ముఠా ప్రవేశించింది. అర్ధరాత్రి దాటాక 2 గంటల సమయంలో కర్రలు, మారణాయుధాలతో చెడ్డీ గ్యాంగ్ ప్రవేశించడం అపార్ట్మెంట్లోని సీసీ కెమెరాల్లో రికార్డైంది.
ఆ సమయంలో అలికిడి రావడంతో ఫ్లాట్ యజమాని కారిడార్లోని లైట్లు వేయడంతో ఈ దొంగలు అక్కడ్నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు నల్లూరి అపార్ట్మెంట్కు చేరుకుని దొంగలు పగలగొట్టేందుకు ప్రయత్నించిన ఇళ్ల తలుపులను పరిశీలించారు. అనంతరం అపార్ట్మెంట్ వాసులతో మాట్లాడి దర్యాప్తు ప్రారంభించారు.

నగరంలో చెడ్డీ గ్యాంగ్ సంచారంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. కాగా సోమవారం విజయవాడలో కూడా ఇలాంటి దోపిడీ ఒకటి జరిగింది. కొందరు దోపిడీ దొంగలు చెనుమోలు వెంకట్రావు ఫ్లైఓవర్ వద్దగల అపార్ట్ మెంట్లోకి ప్రవేశించి మొదటి అంతస్తులోని ఓ ఇంట్లో తలుపు పగలగొట్టి బంగారంతో పాటు నగదును దోచుకున్నారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.
కాగా, గత కొంతకాల క్రితం హైదరాబాద్, నగర పరిసరాల్లో దొంగతనాలకు యత్నించిన ఈ చెడ్డీ గ్యాంగ్ దోపిడీ దొంగలు ఇప్పుడు ఏపీలోని నగరాల్లోనూ ప్రవేశించినట్లు తెలుస్తోంది. చెడ్డీగ్యాంగ్ అలజడితో పోలీసులు అప్రమత్తమయ్యారు.

విషాదం: బస్సులోంచి తల బయటపెట్టిన యువతి మృతి
కర్నూలు జిల్లా శ్రీశైలం సమీపంలోని నల్లమల ఘాట్ రోడ్డు ఘోర ప్రమాదం విషాదాన్ని నింపింది. బస్సు ప్రయాణలో అజాగ్రత్తే ఓ యువతి ప్రాణం తీసింది. ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ యువతి తల బయటకు పెట్టింది. అదే సమయంలో మలుపు వద్ద ఎదురుగా వస్తున్న లారీ యువతి తలకు బలంగా తగిలింది. దీంతో తీవ్రగాయాలపాలైన యువతి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఒక్కసారిగా జరిగిన ఘటనతో ప్రయాణికులంతా దిగ్భ్రాంతికి గురయ్యారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications