ఎమ్మెల్యేగా కేశినేని నాని, ఎంపీగా చిన్ని..!!
విజయవాడ: వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలను ఎదుర్కొనాల్సి ఉన్న నేపథ్యంలో- రాష్ట్రంలో ఇప్పటి నుంచే అన్ని పార్టీలు దీనికి సన్నద్ధమౌతోన్నాయి. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ, జనసేన పార్టీల నాయకులు ఎవరి పంథాలో వాళ్లు ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటోన్నారు. ఎన్నికల వరకు ప్రజల మధ్యే గడపడానికి ప్రాధాన్యత ఇస్తోన్నారు.
దీనికోసం వేర్వేరు రూపాల్లో తమ కార్యక్రమాలను రూపొందించకుంటోన్నారు. వైఎస్ఆర్సీపీ మా నమ్మకం నువ్వే జగన్.. అనే ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా విస్తృతంగా ఈ కార్యక్రమాన్ని కొనసాగించింది. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు..ఇందులో పాల్గొన్నారు. ఇంటింటికీ స్టిక్కర్లను అతికించారు.

దీనికి వ్యతిరేక ప్రచారాన్ని చేపట్టింది తెలుగుదేశం పార్టీ, జనసేన. విజయవాడలో జగన్ ఫొటో ఉన్న స్టిక్కర్లను అంటించిన ప్రతి ఇంటి వద్దా ఈ రెండు పార్టీల స్టిక్కర్లు వెలిశాయి. సైకో పోవాలి- సైకిల్ రావాలి- మళ్లీ ముఖ్యమంత్రి చంద్రబాబు అవ్వాలి అనే స్లోగన్తో తెలుగుదేశం పార్టీ నాయకులు స్టిక్కర్లను తయారు చేశారు. వాటిని విజయవాడలో ప్రతి ఇంటికీ అంటించారు.
వాటిల్లో విజయవాడ లోక్సభ సభ్యుడు కేశినేని నాని ఫొటో మిస్ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. నానికి బదులుగా ఆయన సోదరుడు కేశినేని శివనాథ్ అలియాస్ చిన్ని ఫొటోను ముద్రించారు. ఈ స్టిక్కర్లల్లో ఒకవైపు స్థానిక శాసన సభ్యుడి ఫొటో, మరోవైపు కేశినేని చిన్ని ఫొటోను పెట్టారు. పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు, అధినేత చంద్రబాబు నాయుడు, రాష్ట్రశాఖ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, నారా లోకేష్ ఫొటోలు ఇందులో ఉన్నాయి.
సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని ఫొటో లేకపోవడం చర్చనీయాంశమైంది అప్పట్లో. తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం ఆయనను దూరం పెట్టిందనడానికి ఇదే సాక్ష్యమనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో నానికి బదులుగా చిన్నికి విజయవాడ లోక్సభ టికెట్ను కేటాయించడం కూడా ఖాయమైందనే విషయాన్ని ఈ స్టిక్కర్ల ద్వారా స్పష్టం చేసినట్టయింది.

సిట్టింగ్ ఎంపీనే అయినప్పటికీ ఆయనకు మూడోసారి టికెట్ ఇవ్వడాన్ని చంద్రబాబు, నారా లోకేష్ అంగీకరించట్లేదు. ఇప్పుడు అదే విషయాన్ని కేశినేని చిన్ని కూడా ధృవీకరించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా విజయవాడ లోక్సభ స్థానం నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని అన్నారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశిస్తే- విజయవాడ నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు.
కాగా- కేశినేని నానికి ఈ సారి అసెంబ్లీ టికెట్ కేటాయించవచ్చనే ప్రచారం ఎన్టీఆర్ జిల్లా రాజకీయాల్లో వినిపిస్తోంది. జిల్లాలోని మైలవరం నియోజకవర్గం నుంచి నానిని అసెంబ్లీ ఎన్నికల బరిలో దింపుతారని చెబుతున్నారు. రెండుసార్లు లోక్సభకు ఎన్నికైన నేపథ్యంలో మూడోసారి అభ్యర్థిని మార్చాలని చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది.
గతంలో మైలవరం స్థానానికి ప్రాతినిథ్యాన్ని వహించిన మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావుకు ఈ దఫా టికెట్ దక్కకపోవచ్చని, పార్టీ జరిపిన అంతర్గత సర్వేల్లో ఆయనకు ఓటమి తప్పదనే విషయం స్పష్టం కావడం వల్ల టీడీపీ అగ్రనాయకత్వం అభ్యర్థిని మార్చాలని నిర్ణయించినట్లు సమాచారం. ఇందులో భాగంగా దేవినేని ఉమా మహేశ్వరరావు స్థానంలో కేశినేని నానిని బరిలో దింపొచ్చని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications