200 లంక గ్రామాలు మునక: జగన్ సర్కార్ ఏం చేస్తోంది?: బ్యాడ్లక్: పోలవరం పూర్తయి ఉంటే: పవన్
అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న వరద పరిస్థితులపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. గోదావరి నదీ పరీవాహక ప్రాంతాల్లో సంభవించిన వరదల్లో నిరాశ్రయులైన వారిని సకాలంలో ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. సహాయ, పునరావాస చర్యలను వేగవంతం చేయట్లేదని, నిరాశ్రయులకు కనీస సౌకర్యాలను కల్పించలేక చేతులు ఎత్తేసిందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఈ పాటికి పూర్తయి ఉంటే ఈ దుస్థితి తలెత్తేది కాదని అన్నారు. ఈ మేరకు కొద్దిసేపటి కిందట ఆయన ఓ వీడియోను విడుదల చేశారు.

200 గ్రామాలు మునక..
గోదావరి నదికి సంభవించిన వరదల వల్ల 200 గ్రామాలు మునిగిపోయాయని పవన్ కల్యాణ్ అన్నారు. గోదావరికి వరదలు రావడం దురదృష్టకరమని చెప్పారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో అధికారులు ముందు జాగ్రత్త చర్యలను చేపట్టలేకపోయారని మండిపడ్డారు. ఫలితంగా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లినట్లు పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో ఏం జరుగుతున్నదో తెలుసుకోవడానికి పార్టీ తరఫున ప్రత్యేక బృందాలను పంపించామని పవన్ కల్యాణ్ తెలిపారు.
కనీస వసతుల్లేని పునరావాస శిబిరాలు..
వరదల వల్ల సర్వం కోల్పోయిన వారిని ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వారికి కల్పించిన పునరావాస శిబిరాల్లో పరిస్థితులను ఎప్పటికప్పుడు సమాచారాన్ని తెప్పించుకుంటున్నానని అన్నారు. 200 లంక గ్రామాలు మునిగిపోయినట్లు తనకు సమాచారం అందిందని తెలిపారు. ఫలితంగా 50 వేల మందికి పైగా ప్రజలు నిరాశ్రయులు అయ్యారని అన్నారు. వారికోసం ప్రభుత్వం పునరావాస శిబిరాలను ఏర్పాటు చేసినప్పటికీ.. కనీస సౌకర్యాలను అందించడంలో విఫలమైందని పవన్ కల్యాణ్ విమర్శించారు.

మానవత్వం లేకుండా
పునరావాస శిబిరాల్లో తలదాచుకుంటోన్న వారికి సరైన వైద్య సదుపాయం దక్కట్లేదని, డాక్టర్లు అందుబాటులో లేరనే ఫిర్యాదులు తనకు అందుతున్నాయని తెలిపారు. పునరావాస శిబిరాల్లో ఉంటోన్న చిన్నపిల్లలకు పాలు దొరక్క అవస్థలు పడుతున్నారని అన్నారు. పునరావాస శిబిరాల్లో అత్యవసర ఆహార వస్తువుల పరిధిలోకి పాలు రావని అధికారులు తమ పార్టీ బృంద సభ్యులకు కరాఖండిగా సమాధానం ఇస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వం కనీసం మానవత్వాన్ని చూపట్లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర వస్తువుల జాబితాలో పాలను కూడా చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

సకాలంలో పోలవరం పూర్తి..
మెరుగైన వైద్య సదుపాయాలను కల్పించాలని, కనీస ఆహార వసతిని ఏర్పాటు చేయాలని అన్నారు. 10 వేల హెక్టార్లలో వరి, 14 వేల హెక్టార్లలో ఉద్యాన పంటల రైతులు నష్టపోయారని వారందరినీ ఆదుకోవాలని తాను ప్రభుత్వాన్ని కోరుతున్నానని అన్నారు. పోలవరం ప్రాజెక్టు సకాలంలో నిర్మాణాన్ని పూర్తి చేసుకుని ఉంటే ఈ దుస్థితి తలెత్తేది కాదని పవన్ కల్యాణ్ అభిప్రాయపడ్డారు. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. భవిష్యత్తులో వరదలు రాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications