టీడీపీతో జనసేన పొత్తు .. నో ఛాన్స్ బాబు అంటున్న జనసేన
టీడీపీతో జనసేన పొత్తు పెట్టుకుంటుందా? రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి బరిలోకి దిగుతాయా ? టిడిపి అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు స్నేహ హస్తం అందిస్తున్నారా? పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పై ఏ విధంగా స్పందిస్తున్నారు? ఇవి ఇప్పుడు ఏపీ లో ప్రధానంగా చర్చ జరుగుతున్న అంశాలు.

జనసేన కోసం టీడీపీ అధినేత స్నేహహస్తం
టిడిపి మొదటి నుంచీ జనసేనతో స్నేహం కోసం చెయ్యి చాచుతూనే ఉంది. గత ఎన్నికల సమయంలో కూడా టిడిపిని జనసేనాని పవన్ కళ్యాణ్ ఎన్ని మాటలు అన్నా చంద్రబాబు మాత్రం అవసరమనుకుంటే జనసేన పార్టీతో పొత్తు పెట్టుకుంటామని బాహాటంగానే మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ పవన్ కళ్యాణ్ ఎవరితో పొత్తు పెట్టుకునేది లేదు ఒంటరిగానే పోరాటం చేస్తామని తేల్చి చెప్పారు. కమ్యూనిస్టు పార్టీలతో పొత్తు పెట్టుకొని జనసేనాని ఎన్నికల బరి లోకి వెళ్లి కేవలం ఒక స్థానానికి పరిమితమై చావు దెబ్బ తిన్నారు.

గత ఎన్నికల్లో జనసేనతో పొత్తు లేకపోవటం వల్లే టీడీపీ కి నష్టం
అయితే 2014 ఎన్నికల్లో జనసేనతో పొత్తు కారణంగా రాజకీయంగా లబ్దిపొందిన టీడీపీ గత అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం ఒంటరిగా పోటీ చేసి ఓటమిపాలైంది. చాలా స్థానాల్లో 5 వేల లోపు మెజార్టీ తోనే ఓడిపోయిన పరిస్థితి. జనసేనతో పొత్తు పెట్టుకొని ఉంటే టిడిపి చాలా స్థానాల్లో విజయం సాధించి ఉండేది. జనసేన తో పొత్తు లేకపోవడమే టీడీపీకి బాగా నష్టం చేసింది. అయితే 2014 ఎన్నికల కన్నా టీడీపీకి ఈ సారి ఓటు బ్యాంకు పెరిగిన కూడా ఘోర ఓటమి పాలయ్యింది. జనసేనతో పొత్తు లేకపోవటం వల్ల నష్టం జరిగిందని పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. అయితే పార్టీనీ మళ్ళీ పుంజుకునేలా చేయడానికి టీడీపీ అధినేత చంద్రబాబు కొత్త వ్యూహాలు రచిస్తున్నారని సమాచారం.
ఎన్నికల్లో ఓటమికి జనసేనతో పొత్తు లేకపోవడం కూడా ఓ కారణమనే అభిప్రాయం చాలామంది టీడీపీ నేతల్లో ఉంది. ఈ నేపథ్యంలో జనసేనతో మళ్లీ పొత్తు పెట్టుకోవాలని ప్రతిపాదన టీడీపీలో మొదలైందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

స్థానిక సంస్థల ఎన్నికల్లో కలిసి పని చెయ్యాలని టీడీపీ వ్యూహం
వచ్చే అసెంబ్లీ ఎన్నికల వరకు ఇందుకోసం ఆగకుండా, స్థానిక సంస్థల ఎన్నికల్లోనే జనసేనతో పొత్తు పెట్టుకోవాలని టీడీపీ భావిస్తోంది. అందుకోసం చంద్రబాబు ప్రయత్నం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. మొదటి నుంచి చంద్రబాబు జనసేన విషయంలో సానుకూలంగానే ఉన్నారు. కాని పవన్ కళ్యాణ్ మాత్రం టిడిపికి దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. జనసేనతో పొత్తు పెట్టుకోవడం వల్ల రాష్ట్రంలో వైసీపీతో పాటు బీజేపీ దూకుడుకు కళ్లెం వేయొచ్చనే భావనలో టీడీపీ ఉన్నట్లు సమాచారం.
ఇందుకు సంబంధించి ఇప్పటికే ప్రాథమికంగా చర్చలు కూడా జరిగాయని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది. ఇక వచ్చే ఎన్నికల నాటికి పార్టీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని భావిస్తున్న జనసేన ఈ వార్తలపై స్పందించింది.

పొత్తు అవసరం లేదు.. ఒంటరి పోరాటమే చేస్తామని తేల్చేసిన జనసేనాని
జనసేనతో కొన్ని మీడియా సంస్థలకు, తెలుగుదేశం పార్టీకి పొత్తు ఉందే తప్ప, వారి పొత్తుతో మాత్రం జనసేనకు ఎటువంటి సంబంధం లేదు తేల్చి చెబుతోంది. టిడిపితో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా లేమని గత ఎన్నికల మాదిరి ఇప్పుడు కూడా ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని చేసి మా పార్టీ నైతిక విలువలను దెబ్బ కొట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోమని టీడీపీ శ్రేణులకు, ఎల్లో మీడియాకు జనసేనాని పవన్ కళ్యాణ్ గట్టిగానే సమాధానం ఇచ్చారు. టీడీపీతో పొత్తు పెట్టుకోబోమని పవన్ ప్రస్తుతానికి చెబుతున్నా భవిష్యత్తులో రాజకీయ పరిణామాలు ఏవిధంగా ఉండబోతున్నాయో..
వేచి చూడాల్సిందే












Click it and Unblock the Notifications