ఢిల్లీలో వైసీపీ ఎంపీ బాలశౌరికి కీలక పదవి..
వైసీపీ ఎంపీ బాలశౌరికి ఢిల్లీలో కీలక పదవి దక్కింది. ప్రజాపద్దుల సంఘం(పబ్లిక్ అకౌంట్స్ కమిటీ- పీఏసీ)లో బాలశౌరి సభ్యుడిగా నియమితులయ్యారు. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ(పీఏసీ) విభాగం ఒక ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించింది. పీఏసీ ఛైర్మన్గా లోక్సభలో కాంగ్రెస్ పక్ష నేత ఆధిర్ రంజన్ చౌదరి నియమితులయ్యారు.
ఆనవాయితీగా పబ్లిక్ అకౌంట్స్ కమిటీ బాధ్యతలను ప్రతిపక్షాలే నిర్వహిస్తూ వస్తున్నాయి. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ కాంగ్రెస్ లోక్సభా పక్షా నేత అధిర్ రంజన్ చౌదరికి స్పీకర్ ఓం బిర్లా పీఏసీ ఛైర్మన్ బాధ్యతలు అప్పగించారు. గత ఆర్థిక సంవత్సరంలోనూ రంజన్ చౌదరియే పీఏసీ ఛైర్మన్గా కొనసాగడం గమనార్హం. తాజాగా మరోసారి ఆయనకే బాధ్యతలు అప్పగించారు. ప్రభుత్వ రెవెన్యూ,ఖర్చులను ఆడిట్ చేయడం పీఏసీ బాధ్యత. పార్లమెంట్లో ఆయా పార్టీలకు ఉన్న సంఖ్యాబలం ఆధారంగా ఇందులో సభ్యులకు చోటు ఉంటుంది.ప్రస్తుత లోక్సభలో బీజేపీ, కాంగ్రెస్, డీఎంకే తర్వాత వైసీపీకే ఎక్కువ మంది(22) ఎంపీలు ఉన్న సంగతి తెలిసిందే.
కాగా,ఇటీవల హైదరాబాద్లోని టెనెట్ మెడ్ కార్పొ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్ను ఖాళీ చేయించేందుకు వైసీపీ ఎంపీ బాలశౌరి ఒత్తిడి తీసుకొచ్చారనే ఆరోపణలు వినిపించిన సంగతి తెలిసిందే. విపత్కర పరిస్థితుల్లో కరోనాపై పోరుకు సహకరించాల్సిందిపోయి.. ఖాళీ చేయాల్సిందిగా ఒత్తిడి తేవడమేంటని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కినేటా టవర్లో పదేళ్లకు అద్దె ఒప్పందం ఉన్నప్పటికీ ల్యాబ్ను ఖాళీ చేయాలని ఎంపీ దౌర్జన్యం చేశారని ఆరోపిస్తూ.. టెనెట్ మెడ్కార్పొ ప్రైవేట్ లిమిటెడ్ తరపున డాక్టర్ టి.విజేందర్రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.