విద్యా శాఖలోనూ రివర్స్ టెండరింగ్ అంటున్న ఏపీ విద్యా శాఖామంత్రి
పోలవరం నిర్మాణ పనుల రివర్స్ టెండరింగ్ తరహాలో విద్యాశాఖలో కూడా రివర్స్ టెండరింగ్ కు వెళ్లనున్నట్టు ఏపీ విద్యాశాఖామంత్రి తెలిపారు. పోలవరం రివర్స్ టెండరింగ్ ద్వారా ప్రజా ధనం దుర్వినియోగం కాకుండా కాపాడే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుందన్న ఆయన విద్యాశాఖలో కూడా రివర్స్ టెండరింగ్ విధానం తీసుకురానున్నట్టు తెలిపారు.
పోలవరం రివర్స్ టెండరింగ్తో రూ.782 కోట్లు ఆదా.. ప్రాజెక్టు రూ.100 కోట్లు దాటితే జడ్జీ దృష్టికి...
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి విద్యా శాఖలో మార్పులకు శ్రీకారం చుట్టారు . తన పాలనలో విద్యావ్యవస్థ ఆదర్శంగా ఉండేలా చూస్తానని చెప్పిన జగన్ పాఠశాలలు, వాటి మౌలిక సదుపాయాల విషయంలో ఇప్పటికే పలు నిర్ణయాలు తీసుకున్నారు . ఇక ఏపీ సీఎం జగన్ విద్యా శాఖలో పెనుమార్పులకు శ్రీకారం చుట్టనున్నారు అని ఏపీ విద్యాశాఖామంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల నిర్వహణలో చోటు చేసుకునే లోపాల వల్ల ప్రజాధనం పక్కదారి పట్టకుండా ఉండేందుకు జగన్ ప్రభుత్వం చేపట్టిన రివర్స్ టెండరింగ్ విధానాన్ని విద్యాశాఖలోనూ అమలు చేయాలని భావిస్తున్నారని ఏపీ విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
ప్రకాశం జిల్లాలో గ్రామ సచివాలయ ఉద్యోగులుగా ఎంపికైన వారికి నియామకపు పత్రాలు అందజేసే కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు . రివర్స్ టెండరింగ్ తో ఖర్చు తగ్గిస్తామని, విద్యాశాఖను ప్రక్షాళన చేస్తామని, ప్రభుత్వ నిధులు పక్కదారి పట్టకుండా కాపాడుతామని మంత్రి సురేష్ చెబుతున్నారు. గత ప్రభుత్వం ప్రభుత్వ నిధుల్ని దోచుకుందన్న ఆరోపణ చేసిన మంత్రి సురేష్ ఇప్పటివరకూ ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో రివర్స్ టెండరింగ్ మీద ఫోకస్ చేసిన ఏపీ ప్రభుత్వం ఇక నుండి విద్యలోనూ రివర్స్ టెండరింగ్ తో విలువైన ప్రజాధనాన్ని కాపాడుతుందని ఆయన పేర్కొన్నారు. విద్యా శాఖలో కూడా త్వరలో రివర్స్ టెండరింగ్ విధానాన్ని తీసుకొస్తామని మార్కాపురం ప్రెస్క్లబ్లో మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో కూడా ఆయన పేర్కొన్నారు. ఇక అంతే కాదుప్రతి ఏటా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తామని చెప్పారు. ప్రతి పాఠశాలలో నెలలో ఒకటి, మూడు శనివారాల్లో నో బ్యాగ్ డే పాటిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.