వైఎస్ జగన్.. ఓ ఆధునిక సంఘ సంస్కర్త - పొరుగు రాష్ట్రాల్లో సైతం..!!
అమరావతి: రాష్ట్రంలో వెనుకబడిన సామాజిక వర్గం ఓటుబ్యాంకుపై అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారించింది. ప్రభుత్వంలో బీసీలకు అధికారాన్ని కల్పించడానికి ప్రాధాన్యత ఇస్తోంది. పెద్ద ఎత్తున వారిని భాగస్వామ్యులను చేస్తోంది. ప్రత్యేకంగా సంక్షేమ పథకాలను ప్రకటించే అవకాశాలను కూడా వైసీపీ పరిశీలిస్తోంది. 2024 నాటికి బీసీ ఓటు బ్యాంకును మరింత బలోపేతం చేసుకోవడంపై కసరత్తు మొదలు పెట్టింది. కర్నూలులో నిర్వహించిన రాయలసీమ గర్జన విజయవంతమైన రెండో రోజే దీన్ని చేపట్టింది.
85 వేల మంది..
విజయవాడ ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్ స్టేడియంలో ఏర్పాటైన ఈ జయహో బీసీ మహాసభకు రాష్ట్రంలోని బీసీ సర్పంచులు జడ్పీటీసీలు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఛైర్మన్లు, డైరెక్టర్లు హాజరయ్యారు. ఆలయ కమిటీ ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, మంత్రులు పాల్గొన్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి 85 వేల మందికి పైగా బీసీ ప్రజా ప్రతినిధులు, తమ కుటుంబ సభ్యులతో ఈ సభకు హాజరయ్యారు.

ఆర్ కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు..
ఈ సభలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు, బీసీ ఉద్యమ నాయకుడు ఆర్ కృష్ణయ్య ప్రసంగించారు. వైఎస్ జగన్ బీసీలకు కల్పిస్తోన్న ప్రాధాన్యతను వివరించారు. గతంలో ఎప్పుడూ లేనివిధంగా మంత్రివర్గంలో 11 మంది బీసీలకు చోటు కల్పించారని పేర్కొన్నారు. వెనుకబడిన వర్గాల వారి అభ్యున్నతి కోసం చిత్తశుద్ధితో పని చేస్తోన్న ఏకైక నాయకుడిగా వైఎస్ జగన్ను అభివర్ణించారు. బీసీలకు రాజ్యాధికారాన్ని, ఆత్మగౌరవాన్ని కల్పించిన ఘనత ఆయనకే దక్కుతుందని చెప్పారు.

ఆధునిక సంఘ సంస్కర్త..
తాను గతంలో బీసీల కోసం ఎన్నో ఉద్యమాలు చేశానని, వారికి రావాల్సిన హక్కుల కోసం కేంద్రమంత్రులను కలుసుకున్నానని, అయినా ఎవ్వరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆర్ కృష్ణయ్య అన్నారు. వైఎస్ జగన్లా ఎవరూ ధైర్య సాహసాలతో అడుగు వేయలేకపోయారని చెప్పారు. వైఎస్ జగన్ను ఆర్ కృష్ణయ్య ఓ సంఘ సంస్కర్తగా అభివర్ణించారు. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తోన్నారని పేర్కొన్నారు. చిత్తశుద్ధితో బీసీల అభివృద్ధి కోసం కష్టపడుతున్న నేతకు ప్రతి ఒక్కరూ మద్ధతు ఇవ్వాలని సూచించారు.

ఏపీలో కలపండి..
తాను ఇటీవలే కర్ణాటకలో పర్యటించానని, అక్కడి బీసీలతో సమావేశం అయ్యానని, తమను ఏపీలో కలపాలంటూ కర్ణాటక బీసీలు కోరుతున్నారని ఆర్ కృష్ణయ్య చెప్పారు. ఏపీ తరహాలో అమ్మఒడి, విద్యా దీవెన.. వంటి పథకాలు కర్ణాటకలో అమలు కావట్లేదని, అందువల్లే తమ పిల్లలను వ్యవసాయ పనులకు పంపిస్తున్నామని అక్కడి బీసీలు తన దృష్టికి తీసుకొచ్చారని అన్నారు. బీసీలకు పదవులు ఇస్తోన్న రాష్ట్రం ఏపీ ఒక్కటేనని అందరూ అంగీకరిస్తున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications