పవన్ కళ్యాణ్ను టచ్ చేస్తే రంగంలోకి బీజేపీ: సోము వీర్రాజు వార్నింగ్, జనసేనానికి ఫోన్
విజయవాడ: విశాఖపట్నంలో జనసేన కార్యకర్తలు, నేతల అరెస్టుపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. జనసేన నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేయడాన్ని బీజేపీ ఖండిస్తుందన్నారు. విజయవాడలో జరుగుతున్న బీజేపీ పదాధికారుల సమావేశంలో రాష్ట్ర సహ ఇంఛార్జ్ సునీల్ దేవధర్, జాతీయ కార్యదర్శి సత్యకుమార్, ఎమ్మెల్సీలు, పదాధికారులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, జిల్లా పార్టీ ఇంఛార్జులు, ఇతర నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడారు.

మోడీ గురించి మాట్లాడే అర్హత వారికి లేదంటూ సోము వీర్రాజు
ఒకప్పుడు కమ్యూనిస్టు పార్టీలు విజయవాడ కేంద్రంగా ఉండేవని.. ఇవాళ దేశాన్ని కమ్యూనిస్టు పార్టీలు భ్రష్టు పట్టిస్తున్నాయని సోము వీర్రాజు ధ్వజమెత్తారు. సీపీఐ పార్టీ వాళ్లను వాళ్లే తొలగించుకుంటున్నారని.. వాళ్లు మోడీని తొలగిస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. మోడీని గురించి మాట్లాడే నైతిక అర్హత వారికి లేదన్నారు. రోడ్డుపై డ్యాన్సులు వేసే పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని, ఆ పార్టీతో దేశంలో బీజేపీ ఎక్కడా పొత్తు పెట్టుకోలేదన్నారు.
త్వరలో 175 నియోజకవర్గాల్లో స్థానిక నేతల పాదయాత్రలుంటాయని తెలిపారు.

వైసీపీకి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే తెలుసా?: సోము వీర్రాజు
విశాఖలో అభివృద్ధి వికేంద్రీకరణపై సోము వీర్రాజు మాట్లాడుతూ.. వైసీపీకి అభివృద్ధి వికేంద్రీకరణ అంటే తెలుసా? అని ప్రశ్నించారు. ఒకేసారి మూడు రాష్ట్రాలు ఏర్పాటు చేసి అభివృద్ధి వికేంద్రీకరణ చేసింది బీజేపీ అని అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణపై వైసీపీ, టీడీపీలకు పాఠాలు చెప్పగలిగే పార్టీ రాష్ట్రంలో బీజేపీనేనని అన్నారు. చైనా రాజధాని బీజింగ్ అని.. కానీ, షాంఘైని అభివృద్ధి చేస్తోందని.. అభివృద్ధి అంటే అది అని సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. విశాఖను అభివృద్ధి చేస్తున్నది మోడీ ప్రభుత్వమేనని అన్నారు. ఈ అంశంపై చర్చకు బీజేపీ సిద్ధమన్నారు.
హుధుద్ తుఫాను అనంతరం విశాఖను కేంద్రం ఆదుకుందన్నారు.

బూమ్ బూమ్ మందులు తప్ప.. అభివృద్ధి ఎక్కడ?: సోము
విశాఖ.. స్ట్రాటజికల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అని గమనించినవారు నరేంద్ర మోడీ అని చెప్పారు సోము వీర్రాజు. చంద్రబాబు, జగన్ విశాఖ అభివృద్ధి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారని ప్రశ్నించారు. కండ కావరం, అధికార దాహంతో ర్యాలీలు చేస్తారా? అని నిలదీశారు. బూమ్ బూమ్ మందులు అమ్ముకోవడం తప్ప అభివృద్ధి లేదని సోము వీర్రాజు విమర్శించారు. అభివృద్ధిలో మోడీ హీరో అయితే.. మీరంతా జీరోలు అని అన్నారు. దోచుకోవడమే మీ విజన్ అంటూ వైసీపీ, టీడీపీలపై మండిపడ్డారు.

పవన్ను టచ్ చేస్తే అంటూ సోము వీర్రాజు వార్నింగ్, ఫోన్
విశాఖలో జనసేన నేతలు, కార్యకర్తలుపై సోము వీర్రాజు తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వ చర్యలను బీజేపీ సహించదని అన్నారు. విశాఖలో పవన్ కళ్యాన్ కార్యక్రమం పది రోజుల ముందే ఖరారైందని.. దీనిపై తనకు సమాచారం ఉందని చెప్పారు. పోలీసులు అత్యుత్సాహంగా ప్రవర్తించారని మండిపడ్డారు. ఒక పార్టీ అధ్యక్షుడిని టచ్ చేసి కారులో కింద కూర్చోమనడం సహించరానిదన్నారు. పోలీసులు కూడా ఓవరాక్షన్ మానుకుంటే మంచిదని సూచించారు. మళ్లీ పవన్ కళ్యాణ్ను టచ్ చేస్తే.. బీజేపీ ప్రత్యక్ష రంగంలోకి దిగుతుందని సోము వీర్రాజు హెచ్చరించారు. కాగా, విశాఖ ఘటనపై పవన్ కళ్యాణ్కు సోము వీర్రాజు ఫోన్ చేశారు. పరిస్థితిపై అడిగి తెలుసుకున్నారు. తాను విశాఖకు వస్తానని సోము వీర్రాజు చెప్పగా.. పరిస్థితి ఇప్పుడు బాగానే ఉందని, మీరు రావాల్సిన అవసరం లేదని పవన్ చెప్పారు. అక్కడి పరిస్థితులపై చర్చించినట్లు పవన్కు సోము వీర్రాజు తెలిపారు.












Click it and Unblock the Notifications