షాకింగ్: విజయవాడ ఘటనపై దర్యాప్తులో కొత్త విషయాలు: అలారం ఉన్నా.. నో ఎన్ఓసీ: అన్నీ
విజయవాడ: విజయవాడలోని స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఆదివారం తెల్లవారు జామున చోటు చేసుకున్న భారీ అగ్నిప్రమాదం ఉదంతాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిశీలిస్తోంది. ఈ ఘటనలో 11 మంది మరణించడం పట్ల ప్రభుత్వ వర్గాలు, అధికార యంత్రాంగం మొత్తం విస్తు పోతోంది. తక్షణమే విచారణకు ఆదేశించింది. అగ్నిప్రమాదాల నివారణా విభాగం అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగారు. దర్యాప్తును చేపట్టారు. ఈ దర్యాప్తులో కొన్ని కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. షాకింగ్ ట్విస్టులు బహిర్గతం అయ్యాయి.
Recommended Video
ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ సారథ్యంలో..
అగ్నిప్రమాదాల నివారణా విభాగం డైరెక్టర్ జయరాం నాయక్ నేతృత్వంలోని అధికారుల బృందం ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టింది. కోవిడ్ సెంటర్గా స్వర్ణ ప్యాలెస్ హోటల్ను బదలాయించడంలో భద్రతా ప్రమాణాలు పాటించలేదని తేలింది. ప్రైవేటు భవనాల్లో కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం ప్రత్యేకంగా కొన్ని మార్గదర్శకాలను రూపొందించిందని, దీనికి వ్యతిరేకంగా ఈ కోవిడ్ సెంటర్ ఏర్పాటయినట్లు గుర్తించామని జయరాం నాయక్ అన్నారు. నిర్వాహకులు భద్రతా ప్రమాణాలు ఉల్లంఘించారనే విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు.
ఎన్ఓసీ లేదు..
స్వర్ణ ప్యాలెస్ హోటల్ను కోవిడ్-19 సెంటర్గా మార్చే సమయంలో నిర్వాహకులు అగ్నిమాపక విభాగానికి సమాచారం ఇవ్వలేదని పేర్కొన్నారు. నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను తీసుకోలేదని అన్నారు. ఈ హోటల్లో అగ్నిప్రమాదం సంభవించే సమయానికి 30 మంది కరోనా వైరస్ సోకిన పేషెంట్లు చికిత్స పొందుతున్నారని తెలిపారు. ఈ ప్రమాదంలో 11 మంది మరణించినట్లు జయరాం నాయక్ ధృవీకరించారు. మంటలు ఎలా చెలరేగాయనే విషయంపై సమగ్ర దర్యాప్తును చేపట్టామని తెలిపారు. త్వరలోనే హోటల్ యాజమాన్యాన్ని అదుపులోకి తీసుకుని, విచారణ చేస్తామని అన్నారు.
అలారం మోగలేదు..
అగ్ని ప్రమాదం సంభవించిన సమయంలో స్వర్ణ ప్యాలెస్లో అలారం మోగాల్సి ఉందని, అలా జరగలేదని అన్నారు. చోటు చేసుకున్న వెంటనే అలారం మోగేలా నిబంధనలను రూపొందించామని చెప్పారు. అలారం ఉన్నప్పటికీ.. అది మోగలేదని ఆయన చెప్పారు. అలాగే ప్రమాదం సంభవించిన సమయంలో స్వర్ణ ప్యాలెస్ భవనం వెనుక తలుపులు తెరుచుకోలేదని తెలిపారు. ఎటువంటి ఫైర్ సేఫ్టీ లేకుండానే హోటల్లో కోవిడ్ సెంటర్ ను నడుపుతున్నారనే విషయం తమ దృష్టికి వచ్చిందని ఆయన పేర్కొన్నారు. దీనిపై పూర్తి స్థాయి విచారణ జరుపుతామని ఆయన తెలిపారు.
శానిటైజర్లు నిల్వ ఉన్నాయా?
కాగా.. రమేష్ ఆసుపత్రి స్వర్ణ ప్యాలెస్ లో నిర్వహిస్తున్న కరోనా కేంద్రంలో అగ్ని ప్రమాదానికి కారణం శానిటైజర్లు కూడా ఓ కారణమైనట్లు సమాచారం. గ్రౌండ్ ఫ్లోర్లో పెద్ద ఎత్తున శానిటైజర్ బాటిళ్లను నిల్వ ఉంచారని, వాటి వల్ల మంటలు త్వరితరగతిన వ్యాప్తి చెంది ఉండొచ్చని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని ఎవరూ ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. శానిటైజర్ బాటిళ్లు నిల్వ ఉన్నట్లు ఆనవాళ్లు ఉన్నాయా? లేదా? అనేది తేలాల్సి ఉందనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. శానిటైజర్లను నిల్వ ఉంచడంపైనా మార్గదర్శకాల్లో పేర్కొన్నారని చెబుతున్నారు.
11కు చేరిన మరణాలు
విజయవాడలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. కోవిడ్ ఆసుపత్రిగా వినియోగిస్తున్న స్వర్ణ ప్యాలెస్ హోటల్లో ఈ తెల్లవారు జామున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మరణాల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. మొదట నలుగురు మరణించినట్లు నిర్ధారించారు. అనంతరం ఈ సంఖ్య ఏడుకు పెరిగింది. తాజాగా మరో ఇద్దరు మరణించారు. ఆ ఇద్దరు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలను వదిలారు. కొద్దిసేపటి తరువాత మరో ఇద్దరు మృత్యవాత పడ్డారు. దీనితో స్వర్ణ ప్యాలెస్ హోటల్ కోవిడ్ ఆసుపత్రిలో ఇప్పటిదాకా మరణించిన వారి సంఖ్య 11కు చేరుకుంది.