స్ధానిక ఎన్నికలకు సిద్ధం కండి- తిరుపతినీ సీరియస్గా తీసుకోండి- నేతలతో చంద్రబాబు
ఏపీలో ప్రస్తుతం నెలకొన్న పరిస్ధితుల్లో వైసీపీ ప్రభుత్వాన్ని ఎదుర్కొనేందుకు టీడీపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. స్ధానిక సంస్ధల ఎన్నికలతో పాటు తిరుపతి ఉప ఎన్నికలోనూ సత్తా చూపాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న టీడీపీ మండల కమిటీల నేతలతో చంద్రబాబు ఇవాళ వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడారు.
స్ధానిక సంస్ధలు ఎప్పుడొచ్చినా సిద్ధంగా ఉండాలని, తిరుపతి ఉప ఎన్నికలనూ సీరియస్గా తీసుకోవాలని మండల నేతలకు చంద్రబాబు సూచించారు. రాష్ట్ర సమస్యలపై ఆందోళనలతో పాటు ప్రతీ మండలంలోనూ స్ధానిక సంస్ధల పరిష్కారంపై రాజీలేని పోరాటం చేయాలన్నారు. స్ధానికంగా వైసీపీ అవినీతిని ఎండగట్టాలని, ప్రజలపై దాడులను నిరసించాలని చంద్రబాబు తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏం నష్టపోయాం, టీడీపీ ప్రభుత్వం ఉండి ఉంటే రాష్ట్రం ఎలా ఉండేదన్న అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.

పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేస్తున్న తీరు, అమరావతి నుంచి రాజధాని మార్పును ప్రజల్లోకి తీసుకెళ్లి వైసీపీ ప్రభుత్వ తీరును ఎండగట్టాలని నేతలకు చంద్రబాబు సూచించారు. ప్రతీ స్కీములోనూ ఆంక్షలు, షరతులతో పేదల సంక్షేమానికి గండికొట్టారని, పేదల ఇళ్ల విషయంలోనూ మోసం చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. బలహీన వర్గాలు, ముస్లింపై జరుగుతున్న దాడులను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు మండల కమిటీల నేతలను కోరారు. ప్రతివారం కనీసం రెండుమూడు రోజులు ఆయా నియోజకవర్గాల్లో ప్రజాందోళనలు జరపాలని చంద్రబాబు ఆదేశించారు.












Click it and Unblock the Notifications