పీవీపీని దెబ్బ కొట్టిన కేశినేని నాని .. విజయవాడ లోక్ సభ స్థానం టీడీపీదే
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో వైసీపీ ప్రభంజనం సృష్టించింది. 150 అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. అన్ని ప్రాంతాల్లోనూ వైసీపీ స్పష్టమైన మెజార్టీ సాధించింది. అటు లోక్సభ ఎన్నికల్లోనూ వైసీపీ స్పష్టమైన ఆధిక్యం కనబర్చింది. లెక్కింపు ప్రారంభం నుంచి ఆధిక్యంలో కొనసాగిన వైసీపీ చివర వరకు అదే పంథా కొనసాగించింది. వైసీపీ 22 చోట్ల గెలవగా.. టీడీపీ 3 స్థానాలకే పరిమితమైంది.
మరోవైపు తెలుగుదేశం పార్టీకి ఈ ఎన్నికలు చేదు అనుభవాన్ని మిగిల్చాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 25 స్థానాలకు పరిమితమవుతున్న టీడీపీ... కేవలం 3 ఎంపీ స్థానాలకే పరిమితమైంది. గత ఎన్నికల్లో టీడీపీకి 15 సీట్లు రాగా, వైసీపీకి 10 సీట్లొచ్చాయి. ఈ ఎన్నికల్లో కేవలం విజయవాడ, గుంటూరు, శ్రీకాకుళం లోక్సభ స్థానాల్లో టీడీపీ గెలుపొందింది. అత్యధిక స్థానాలు గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పాలని భావించిన చంద్రబాబుకు ఈ ఫలితాలు ఇబ్బందికర పరిస్థితులను తెచ్చి పెట్టాయి.
పార్టీల్లో... ప్రజాశాంతీ పార్టీ వేరయా... కేఏ పాల్కు వచ్చిన ఓట్లు ఎన్నో తెలుసా...?
ఇక తెలుగుదేశం పార్టీ లోక్ సభ ఎన్నికల్లో విజయవాడ స్థానం కోసం బరిలోకి దిగిన కేశినేని నాని పీవీపీ ని ఓడించారు . తన స్థానాన్ని తిరిగి నిలబెట్టుకున్నారు . విజయవాడ లోక్ సభ స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీచేసిన సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని తన ప్రత్యర్థి, వైసీపీ నేత పొట్లూరి వరప్రసాద్ పై విజయం సాధించారు. 8238 ఓట్ల తేడాతో పీవీపీపై కేశినేని నాని విజయం సాధించారు.
సినీ నిర్మాత, ప్రముఖ వ్యాపారవేత్త అయిన పొట్లూరి వరప్రసాద్ ఇటీవలే మహర్షి చిత్రం సాధించిన విజయంతో ఫుల్ జోష్ లో ఉన్నారు . గతకొంతకాలంగా రాజకీయరంగంపై కన్నేసిన ఆయన ఎలాగైనా నెగ్గాలన్న పట్టుదలతో వైసీపీ టికెట్ అందుకున్నారు. కానీ, విజయవాడలో ఎంతో పట్టు ఉన్న కేశినేని ముందు నిలవలేకపోయారు. ఈ ఎన్నికలు వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపితే పీవీపీలో మాత్రం నిరుత్సాహం నింపాయి.