గ్రేవ్ థ్రెట్: రఘురామ బాట పట్టిన చంద్రబాబు: జగన్ సర్కార్పై ప్రధానికి లేఖ: జంగిల్ రాజ్
అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ చర్యలకు పాల్పడటం రాజ్యాంగ ఉల్లంఘన కిందికి వస్తుందని పేర్కొన్నారు. ప్రధానికి రాసిన మూడు పేజీల లేఖలో పలు కీలక అంశాలను చంద్రబాబు ప్రస్తావించారు. నరేంద్ర మోడీ సారథ్యంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపైనా ప్రశంసల వర్షాన్ని కురిపించారు. డైనమిక్ లీడర్షిప్ అంటూ మోడీని అభినందించారు.
Recommended Video

రఘురామ ప్రస్తావించిన అంశాలతో
తన ఫోన్ను ట్యాప్ చేస్తున్నారంటూ వైఎస్ఆర్సీపీ తిరుగుబాటు లోక్సభ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు సొంత పార్టీ ప్రభుత్వంపై ఆరోపణలనుల సంధించిన మరుసటి రోజే.. చంద్రబాబు కూడా అదే అంశాన్ని లేవనెత్తడం, ఏకంగా ప్రధానికి లేఖ రాయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమౌతోంది. రఘురామ చేసిన ఆరోపణల్లోని పలు అంశాలను చంద్రబాబు తన తాజా లేఖలో పొందుపరిచారు. రఘురామ ప్రస్తావించిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 19, 21 ఉల్లంఘన, ప్రాథమిక హక్కుల అణచివేత వంటి చర్యలకు జగన్ ప్రభుత్వం పాల్పడుతోందని చంద్రబాబు పేర్కొన్నారు.

అణచివేత ధోరణి
ఏపీలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ప్రాథమిక హక్కులను కాలరాస్తోందంటూ చంద్రబాబు మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల నాయకులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, పార్టీకి చెందిన కీలక నేతల ఫోన్లను ప్రభుత్వం ట్యాప్ చేస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ వైఖరి చివరికి దేశ భద్రతకే పెను ప్రమాదంగా పరిణమించిందని అన్నారు. వైసీపీ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యవస్థలపై దాడులు పెరిగాయని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలనా ప్రక్రియ పూర్తిగా పట్టాలు తప్పిందని, దీన్ని మళ్లీ గాడిలోకి పెట్టాల్సిన అవసరం ఉందని అన్నారు.

రాజ్యాంగ వ్యవస్థలతో ఆటలు..
రాష్ట్ర ఎన్నికల సంఘం, పబ్లిక్ సర్వీస్ కమిషన్ వంటి రాజ్యాంగబద్ధమైన సంస్థలతో వైసీపీ ప్రభుత్వం ఆటలు ఆడుతోందని చంద్రబాబు ఆరోపించారు. చట్ట విరుద్ధంగా ఫోన్ ట్యాపింగ్కు పాల్పడుతోందని, ఇది ప్రభుత్వ దినచర్యగా మారిందని అన్నారు. ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం-1885, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం-2000 ప్రకారం వైసీపీ ప్రభుత్వ చర్యలు దేశ వ్యతిరేకమైనవని అన్నారు. వాటి వల్ల జాతీయ భద్రతకూ ముప్పు ఉందని ఆరోపించారు. తన స్వార్థ రాజకీయాల కోసం దేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను పణంగా పెడుతోందని విమర్శించారు.

సాఫిస్టికేటెడ్ సాఫ్ట్వేర్..
అత్యాధునికమైన, సాఫిస్టికేటెడ్ పరికరాలతో వైసీపీ ప్రభుత్వం తన రాజకీయ ప్రత్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేస్తోందని చంద్రబాబు అన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం వైసీపీ వంటి అరాచక శక్తుల చేతిలో ఉంటే వ్యవస్థలు నాశనమౌతాయని అన్నారు. వ్యక్తులు, సంస్థల గోప్యతా హక్కును హరించి వేస్తున్నాయని చెప్పారు. అత్యున్నత స్థానాల్లోని వ్యక్తుల బ్లాక్ మెయిలింగ్, బెదిరించడానికి ఈ ఫోన్ ట్యాపింగ్ను ఉపయోగించుకుంటోందని చంద్రబాబు తెలిపారు. అధికారాన్ని నిలుపుకోవడానికి, ప్రజల్లో వ్యక్తమౌతోన్న వ్యతిరేక భావనలను కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నాలు సాగిస్తోందని అన్నారు.

ప్రజా వ్యతిరేక చర్యలకు..
తమ చర్యలకు న్యాయవ్యవస్థ నుంచి అడ్డంకులు ఎదురవుతున్నాయనే ఉద్దేశంతో వైసీపీ ప్రభుత్వం ఉందని, ఆ కారణంతో, న్యాయవ్యవస్థను కూడా టార్గెట్గా చేసుకుందని ఆరోపించారు. ఈ చర్యలను అడ్డుకోకపోతే ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమని అన్నారు. వ్యవస్థల విధ్వంసానికి దారి తీస్తుందని హెచ్చరించారు. ఇటువంటి దుశ్చర్యలు దీర్ఘకాలంలో ప్రజాస్వామ్య విలువల పతనానికి, భావ ప్రకటనా స్వేచ్ఛకు భంగం కలిగిస్తాయని అన్నారు. ఏపీలో ఆటవిక రాజ్యాన్ని నిర్మిస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు. ఫోన్ ట్యాపింగ్ వంటి అక్రమాలు, చట్టవిరుద్ద చర్యలపై కేంద్ర ప్రభుత్వ దర్యాప్తు సంస్థలతో విచారణకు ఆదేశించాలని విజ్ఙప్తి చేశారు.












Click it and Unblock the Notifications