విజయవాడ కనకదుర్గ ఫ్లై ఓవర్పై రెండో ట్రయల్రన్- సిటీలో మూడు రోజులు ట్రాఫిక్ మళ్లింపులు..
తాజాగా నిర్మాణం పూర్తి చేసుకున్న విజయవాడ కనకదుర్గ ఫ్లైఓవర్ పై తొలి ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. దీంతో ఇవాళ్టి నుంచి రెండో ట్రయల్ రన్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ వాహనాలు, ట్రక్కులను ఫ్లైఓవర్ పై వేగంగా పరుగులు తీయించడం ద్వారా దీని నాణ్యతను, సామర్ధ్యాన్ని పరీక్షిస్తారు. అసలే మలుపులతో కూడుకున్న ఫ్లైఓవర్ కావడం, పక్కనే కృష్ణానది ఉండటంతో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఈ ట్రయల్ రన్ ద్వారా నిర్ణయిస్తారు.
ట్రయల్ రన్, లోడ్ టెస్టుల్లో భాగంగా నగరంలోని కుమ్మరిపాలెం నుండి ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలను గొల్లపూడి సితార మీదుగా మళ్లించనున్నారు. అలాగే రామవరప్పాడు నుంచి హైదరాబాద్కు వెళ్లే వాహనాలను ఇన్నర్ రింగ్ రోడ్ మీదుగా గొల్లపూడికి మళ్లిస్తారు. నగరంలోకి వచ్చే వాహనాలు మాత్రం కృష్ణలంక పీఎస్ వరకూ అనుమతిస్తారు. ఆటోలు, కార్లు, ఇతర వాహనాలకు సైతం ఆంక్షలు ఉంటాయని అధికారులు ప్రకటించారు.
కనకదుర్గ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి హాజరు కావాలని కేంద్ర మంత్రి గడ్కరీని స్ధానిక ఎంపీ కేశినేని తాజాగా ఢిల్లీలో కలిసి అహ్వానించారు. వచ్చే నెలలో ప్రారంభోత్సవం నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్న తరుణంలో కేంద్రమంత్రి గడ్కరీని కేశినేని నాని ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించడం ఆసక్తికరంగా మారింది. ప్రభుత్వం తరఫున ఎలాగో గడ్కరీకి అధికారిక ఆహ్వానం అందాల్సి ఉంది.