విజయమ్మ ఓడినచోటే.. విశాఖపై వైసీపీ ప్రత్యేక దృష్టి, గంటాపై నిన్నటి టీడీపీ నేత, పది కొత్త ముఖాలు
విశాఖపట్నం: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో టీడీపీ, వైసీపీలు అభ్యర్థులను ప్రకటిస్తున్నాయి. ఎక్కువచోట్ల సిట్టింగ్లు పోటీ చేయనున్నారు. పార్టీలోనే పోటీ ఉన్నచోట వాయిదా వేస్తున్నారు. వాటిపై చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత ఇటీవల రాజంపేట పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజవర్గాల నేతలతో భేటీ అయ్యారు.
చంద్రబాబు ఎంపిక ప్రక్రియ
రాజంపేట అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడును, పీలేరు అభ్యర్థిగా మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి సోదరుడు కిశోర్ కుమార్ రెడ్డిని, రాయచోటి అభ్యర్థిగా రమేశ్ కుమార్ రెడ్డిని, పుంగనూరు అభ్యర్థిగా అనూష రెడ్డిని, రైల్వేకోడూరు అభ్యర్థిగా ఎంపీ శివప్రసాద్ అల్లుడు నరసింహ ప్రసాద్ని ఖరారు చేశారు. తంబళ్లపల్లి అభ్యర్థి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ స్థానంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా శంకర్ యాదవ్ ఉన్నారు. మిగతా అభ్యర్థుల విషయంలో వారంలోపు నిర్ణయం తీసుకోనున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ, వివిధ సర్వేల ఫలితాలు, స్థానిక పరిస్థితులు, రాజకీయ అవసరాలు, సామాజిక సమీకరణల్ని బేరీజు వేసుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నారు. చంద్రబాబు శుక్రవారం కర్నూలు పార్లమెంటు పరిధిలోని నేతలతో భేటీ అయ్యారు.
రాజకీయ బలంతో పాటు అర్థబలం... విశాఖపై వైసీపీ వ్యూహం
మరోవైపు, విశాఖపట్నంపై వైసీపీ దృష్టి సారించింది. ఈ జిల్లాలోని పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల్లో 10 స్థానాల్లో కొత్త వారికి సీటు ఇవ్వనుందని తెలుస్తోంది. 2014 ఎన్నికల్లో విశాఖపట్నం లోకసభ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లోనూ టీడీపీ గెలిచింది. విశాఖ ఎంపీగా పోటీ చేసిన విజయమ్మ ఓడిపోయారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండకూడదని కోరుకుంటోంది. అందుకే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. రాజకీయంగా పట్టు ఉండటంతో పాటు అర్థబలం ఉన్న వారికి అవకాశం ఇవ్వాలని భావిస్తోందట.
పదిహేను మందిలో 10 మందికి వైసీపీ చెక్!
భీమిలి అసెంబ్లీ స్థానం నుంచి మంత్రి గంటా శ్రీనివాస రావు పైన ఇటీవల టీడీపీ నుంచి వైసీపీలో చేరిన ఎంపీ అవంతి శ్రీనివాస్ను బరిలోకి దించే అంశంపై చర్చిస్తోంది. విశాఖపట్నంలో అధికార పార్టీ నుంచి మరికొందరు నేతలు కూడా తమ పార్టీలోకి వస్తారని వైసీపీ భావిస్తోంది. టీడీపీ నుంచి మరో ఎమ్మెల్యే వస్తారని, ఆయన విశాఖ ఈస్ట్ నుంచి పోటీ చేస్తారనే చర్చ సాగుతోందట. విశాఖ ఉత్తరం నుంచి ఇంచార్జ్గా కేకే రాజు ఉన్నారు. విశాఖపట్నం జిల్లాలోని పదిహేను నియోజకవర్గాల్లో 2014లో వైసీపీ తరపున పోటీ చేసిన వారిలో ఇప్పుడు అయిదుగురు మాత్రమే మళ్లీ ఆ పార్టీ అభ్యర్థులుగా కొనసాగనున్నారనే ప్రచారం సాగుతోంది.
ఏ నియోజకవర్గం నుంచి ఎవరంటే?
అనకాపల్లి నుంచి గుడివాడ అమర్నాథ్, మాడుగుల నుంచి ముత్యాల నాయుడు, పాయకరావుపేట నుంచి గొల్ల బాబూరావు, విశాఖ ఈస్ట్ నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్, విశాఖ సౌత్ నుంచి పీవీ రమణమూర్తి, విశాఖ నార్త్ నుంచి కేకే రాజు, విశాఖ వెస్ట్ నుంచి మళ్ల విజయప్రసాద్, గాజువాక నుంచి తిప్పల నాగిరెడ్డి, భీమిలి అవంతి శ్రీనివాస్, చోడవరం కరణం ధర్మశ్రీ, పెందుర్తి నుంచి అదిప్ రాజు, యలమంచిలి నుంచి కన్నబాబు రాజు, నర్సీపట్నం నుంచి పేట్ల ఉమాశంకర్ గణేష్, అరకు నుంచి పాల్గుణ, పాడేరు నుంచి విశ్వేశ్వరరాజులు బరిలో ఉన్నారు. అయితే ఈ జాబితాలో మార్పులు చేర్పులు ఉండవచ్చునని అంటున్నారు. గత ఎన్నికల్లో విశాఖ వెస్ట్ నుంచి దాడి వీరభద్రరావు తనయుడు రత్నాకర్ పోటీ చేశారు. ఇప్పుడు వీరు అనకాపల్లి సీటు కోసం ప్రయత్నిస్తున్నారట. యలమంచిలి నుంచి కన్నబాబురాజుకు నాగేశ్వర రావు, బీ ప్రసాద్ల నుంచి పోటీ ఉందని చెబుతున్నారు.