జనం బాటలో జగన్: విశాఖ పర్యటన: ఆ బిల్లు ఉపసంహరణ తరువాత తొలిసారిగా
విశాఖపట్నం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనం బాట పట్టనున్నారు. సుదీర్ఘకాలం అనంతరం ఆయన తొలిసారిగా రాయలసీమ జిల్లాల్లో పర్యటించారు. బంగాళాఖాతంలో ఇటీవల సంభవించిన వరుస అల్పపీడనాల వల్ల వరద తాకిడికి గురైన కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాలను సందర్శించారు. ముంపు ప్రాంతాలకు వెళ్లారు. బాధితులను పరామర్శించారు. ఆయా జిల్లాల్లో వైఎస్ జగన్కు అనూహ్యంగా ఘన స్వాగతం లభించింది. ముంపు ప్రాంతాల బాధితులు సైతం జగన్కు నీరాజనం పలికారు. తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు తప్పు పట్టడమే దీనికి నిదర్శనం.

మంత్రులు ఎమ్మెల్యేలు..
దీని తరువాత ఆయన సాగరనగరం విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనున్నారు. ఎల్లుండి ఆయన పర్యటన ఉంటుంది. ఒకరోజు పాటు ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. మరి కొన్నింటికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ పర్యటనలో ఆయన వెంట ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన ఉప ముఖ్యమంత్రులు ధర్మాన కృష్ణదాస్, పుష్ప శ్రీవాణి, బొత్స సత్యనారాయణ, విశాఖపట్నం నగరం, జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ సందర్భంగా బహిరంగ సభను ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి ఇది ఆయన పర్యటనలో షెడ్యూల్ చేయలేదని సమాచారం.

బిల్లు ఉపసంహరణ తరువాత..
మూడు రాజధానులను ఏర్పాటు చేయడానికి ఉద్దేశించిన ఏపీ వికేంద్రీకరణ బిల్లును ఉపసంహరించుకున్న తరువాత వైఎస్ జగన్ తొలిసారిగా విశాఖపట్నానికి బయలుదేరి వెళ్లనుండటం రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. విశాఖపట్నాన్ని పరిపాలన రాజధానిగా బదలాయించాలని ప్రతిపాదించిన బిల్లు అది. దీన్ని వెనక్కి తీసుకోవడాన్ని వ్యతిరేకిస్తూ ఇదివరకు ఉత్తరాంధ్ర ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ సమితి నాయకులు నిరసన ప్రదర్శనలను సైతం నిర్వహించారు. ఈ పరిస్థితుల మధ్య ఆయన విశాఖపట్నానికి వెళ్లనున్నారు.

విశాఖ-భోగాపురం..
గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి ప్రాజెక్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. 2019లో అధికారంలోకి వచ్చిన తొలిరోజుల్లోనే సుమారు 1,285 కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. వాటిల్లో కొన్నింటిని వైఎస్ జగన్ ప్రారంభించే అవకాశం ఉంది. అలాగే- మరి కొన్నింటికి శంకుస్థాపన చేస్తారని తెలుస్తోంది. విశాఖపట్నం-భోగాపురం గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ రహదారి, ఇందులో భాగంగా ప్రత్యేకంగా నిర్మించ తలపెట్టిన కోస్టల్ హైవేకు శంకుస్థాపన చేయొచ్చని చెబుతున్నారు. దీనికి అనుబంధంగా ప్రతిపాదించిన ఇండ్రస్టియల్, ఐటీ పార్కులు ఏర్పాటు నిర్మాణ పనులను కూడా చేపట్టే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

విశాఖలో అభివృద్ధి పనులకు..
కోస్టల్ బ్యాటరీ నుంచి నేరెళ్లవలస వరకు ప్రతిపాదించిన మాస్టర్ ప్లాన్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపనం చేస్తారని అంటున్నారు. ఏపీ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్, గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ సంయుక్తంగా దీన్ని అభివృద్ధి చేయనుంది. బీచ్ ఫ్రంట్ రీడెవలప్మెంట్లో భాగంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన పనులకు వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారని అంటున్నారు. ఈ నెల 21వ తేదీన వైఎస్ జగన్ తన పుట్టినరోజును పురస్కరించుకుని రచ్చబండ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. తొలి రచ్చబండను తణుకులో నిర్వహించనున్నారు. వరుసగా ఆయన ప్రజల మధ్యే ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకున్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications