పీవీ సింధూకు మరో గుడ్న్యూస్: విశాఖలో భూములు: వచ్చే కేబినెట్లో తీర్మానించే ఛాన్స్?
విశాఖపట్నం: భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధూ విజ్ఙప్తికి సానుకూలంగా స్పందించింది వైఎస్ జగన్ ప్రభుత్వం. పీవీ సింధూ నిర్మించ తలపెట్టిన బ్యాడ్మింటన్ అకాడమీకి భూమిని కేటాయించడానికి అంగీకరించింది. విశాఖలో ఈ అకాడమీ నెలకొల్పడానికి అవసరమైన విశాఖలో భూములను కేటాయించబోతోంది. దీనికి సంబంధించిన ప్రతిపాదలను వచ్చే మంత్రివర్గ సమావేశంలో ఆమోదించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో బ్యాడ్మింటన్ను అభివృద్ధి చేయడానికి అకాడమీని నెలకొల్పదలచుకున్నానని, దీనికి అవసరమైన భూమిని కేటాయించాలంటూ గత ఏడాది సెప్టెంబర్లో పీవీ సింధూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. భూములను కేటాయిస్తామంటూ అప్పట్లో ఆయన హామీ ఇచ్చారు. దీనికి అనుగుణంగా విశాఖలో బ్యాడ్మింటన్ అకాడమీని నెలకొల్పడానికి అవసరమైన భూమిని కేటాయిస్తామని పర్యాటక, క్రీడల శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ వెల్లడించారు.
విశాఖలో ఏ ప్రాంతంలో.. ఎంత భూమినివ కేటాయించాలనేది ఇంకా నిర్ధారించాల్సి ఉందని అన్నారు. క్రీడారంగాన్ని అభివృద్ధి చేయడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని, గ్రామీణ స్థాయిలో మెరికల్లాంటి క్రీడాకారులను తయారు చేస్తామని చెప్పారు. దీనికోసం త్వరలోనే క్రీడా విధానాన్ని ప్రకటిస్తామని అవంతి శ్రీనివాస్ అన్నారు. ఇందులో భాగంగానే పీవీ సింధూ అకాడమికి భూమిని కేటాయిస్తామని తెలిపారు. కరోనా లాక్డౌన్ మూతపడ్డ పర్యాటక కేంద్రాల్లో త్వరలో సందర్శకులకు అనుమతి ఇస్తామని అన్నారు.
ఆగస్టు 15వ తేదీన స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని బోటు విహారానికి అనుమతి ఇస్తామని చెప్పారు. ముందుజాగ్రత్తలను తీసుకున్న వాటికి మాత్రమే అనుమతి ఉంటుందని తెలిపారు. పర్యాటక శాఖ ఆధ్వర్యలో రాష్ట్రంలో హోటళ్లను ఏర్పాటు చేయాలనే ఆలోచన ఉందని, దీనిపై కసరత్తు చేస్తున్నామని అన్నారు. ఆధ్యాత్మిక పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అవంతి శ్రీనివాస్ చెప్పారు.
Recommended Video
సింహాచలం పుణ్యక్షేత్రం ప్రసాద్ పథకానికి ఎంపిక కావడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. కరోనా వైరస్ వల్ల తలెత్తిన సంక్షోభ పరిస్థితులు పర్యాటక రంగంపై తీవ్ర ప్రభావం చూపాయని అవంతి చెప్పారు. కుదురుకోవడానికి కొంత సమయం పట్టొచ్చని అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ.. నిధుల లోటు లేదని, పర్యాటకులకు కల్పించే సౌకర్యాల్లో ఎలాంటి కొరత ఉండబోదని హామీ ఇచ్చారు. పర్యాటక బస్సులను కూడా త్వరలోనే అందుబాటులోకి తెస్తామని అన్నారు.