జీవీఎల్ అడిగిన ప్రశ్నలకు కేసీఆర్ వద్ద సమాధానం ఉందా?
విశాఖపట్నం: ఊహించినట్టే- ఏపీ రాజకీయాల్లో భారత్ రాష్ట్ర సమితి అడుగు పెట్టింది. బీఆర్ఎస్ రాష్ట్రశాఖ అధ్యక్షుడిగా రిటైర్డ్ ఐఎఎస్ అధికారి, జనసేన పార్టీ మాజీ నాయకుడు తోట చంద్రశేఖర్ నియమితులయ్యారు. మాజీ మంత్రి రావెల కిశోర్ బాబు గులాబీ కండువాను కప్పుకొన్నారు. పార్థసారథి సహా పలువురు నాయకులు బీఆర్ఎస్ చీఫ్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు.

జీవీఎల్ ప్రశ్నల వర్షం..
ఏపీ రాజకీయాల్లో బీఆర్ఎస్ ఎంట్రీ ఇవ్వడాన్ని భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు తప్పుపట్టారు. ఏపీ ప్రజలకు కుక్కలతో పోల్చిన కేసీఆర్- ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని ఓట్లను అడగడానికి వచ్చారంటూ ప్రశ్నించారు. ఆంధ్రా వాళ్లను కేసీఆర్ కుక్కలు అని అన్నారా? లేదా? అని నిలదీశారు. ఆంధ్రా ప్రజలను తరిమి తరిమి కొడతానని హెచ్చరించిన కేసీఆర్ కు ఇప్పుడు ఇక్కడి ఓట్లు కావాల్సి వచ్చిందా అంటూ ప్రశ్నలవర్షాన్ని కురిపించారాయన.

తిట్టరాని తిట్లన్నీ తిట్టి..
ఆంధ్రావాళ్లను కేసీఆర్ చాలా చులకనగా చూశారని, తిట్టరాని తిట్లన్నీ తిట్టారని జీవీఎల్ గుర్తు చేశారు. ఆంధ్రా పాలకులు తెలంగాణకు అవసరమా?, ఆంధ్రా పార్టీలు మనకు అవసరమా? అంటూ రెచ్చగొట్టిన చరిత్ర కేసీఆర్ కు ఉందని పేర్కొన్నారు. ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా అదే భావనలో ఉన్నారని చెప్పారు. తెలంగాణ పార్టీలు ఏపీకి అవసరమా? అని ఆంధ్ర ప్రజలు ప్రశ్నిస్తోన్నారని అన్నారు. దీనికి ఏమి సమాధానం చెబుతావని నిలదీశారు.

తెలంగాణనే సరిగ్గా పాలించట్లేదు..
సొంత రాష్ట్రం తెలంగాణనే సరిగ్గా పరిపాలించలేని తెలంగాణ పార్టీ ఆంధ్ర ప్రజలకు అవసరం జీవీఎల్ స్పష్టం చేశారు. ఇప్పుడు ఏపీలో రాజకీయాలు చేయడానికి ఏ ముఖం పెట్టుకుని వచ్చావంటూ జీవీఎల్ నరసింహా రావు.. కేసీఆర్ ను సూటిగా ప్రశ్నించారు. ఏపీకి రాజధాని లేకుండా హైదరాబాద్ ను కేసీఆర్ లాక్కున్నాడని, నీళ్లు పారకుండా ఏపీ ప్రాజెక్టులకు అడ్డు పడ్డాడని జీవీఎల్ ధ్వజమెత్తారు. తాను అడిగిన ప్రశ్నలకు ఏ ఒక్కదానికైనా కేసీఆర్ వద్ద సమాధానం ఉందా? అని చెప్పారు.

సీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు..
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనులు మొదలు కాకుండా కేసీఆర్ అడ్డు పడ్డాడని జీవీఎల్ విమర్శించారు. ఏపీకి జీవనాడిగా భావించే పోలవరం ప్రాజెక్ట్ ఎత్తును తగ్గించాలంటూ సుప్రీంకోర్టును తెలంగాణ ప్రభుత్వం ఆశ్రయించలేదా?, శ్రీశైలం నుంచి కృష్ణానదీ జలాలను అదనంగా తరలించలేదా? అంటూ జీవీఎల్ పేర్కొన్నారు. గతంలో కృష్ణా ట్రిబ్యునల్ బచావత్ అవార్డ్ ను కూడా న్యాయస్థానాల్లో సవాల్ చేసింది కేసీఆర్ కాదా? అని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications