విజయనగరంలో సంచైతకు కౌంటర్ రెడీ అవుతోందా ? అశోక్ ముందున్న ప్రత్యామ్నాయం అదేనా !
దశాబ్దాల పాటు విజయనగరం జిల్లా టీడీపీతో పాటు మాన్సాస్ రాజకీయాలను కూడా శాసించిన అశోక్ గజపతిరాజుకు.. అన్నకూతురు సంచైత రూపంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ ప్రభుత్వ వ్యూహాల్లో భాగంగా తెరపైకి వచ్చిన సంచైతను తప్పించడం ఇప్పట్లో సాధ్యం కాదనే అంచనాకు వచ్చిన అశోక్ గజపతిరాజు ఆమెకు కౌంటర్ గా తన కూతురు ఆదితిని రంగంలోకి దించబోతున్నట్లు తెలుస్తో్ంది. దీంతో ఆయనకు బహుముఖ ప్రయోజనాలు ఉన్నాయి.

అశోక్ కు మాన్సాస్ దెబ్బ...
దశాబ్దాలుగా విజయనగరం రాజకీయాలను ఓ రేంజ్ లో శాసించిన పూసపాటి రాజవంశీకుడు అశోక్ గజపతిరాజుకు 2019 ఎన్నికల్లో ఓటమి నుంచి కోలుకునే లోపే మాన్సాస్ ఛైర్మన్ గా ఉద్వాసన రూపంలో మరో భారీ దెబ్బ తగిలింది. వాస్తవానికి ఈ ఎన్నికలతో రాజకీయాలకు స్వస్తి పలకాలని భావించిన రాజుగారితో పాటు ఆయన కూతురు ఆదితిని కూడా ఓటర్లు గతేడాది ఎన్నికల్లో తిరస్కరించారు. అప్పట్లో ఓటమి ఎరుగని యోధుడిగా ఉన్న అశోక్ 2004లో ఓటమి పాలైనప్పుడు అంతా చర్చించుకున్నారు. కానీ ఈసారి రాజుగారి ఓటమి ఎవరికీ పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదు. అదే సమయంలో వైసీపీ ప్రభుత్వం వ్యూహాత్మకంగా ఆయన్ను మాన్సాస్ ఛైర్మన్ గా తప్పించి అన్నకూతురు, బీజేపీ నేత సంచైతను తెరపైకి తెచ్చింది.

సంచైత రాకతో మారిన పరిణామాలు..
అన్నకూతురు సంచైతను తాను దశాబ్దాలుగా ఏలిన మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్ పదవిలో ప్రభుత్వం అర్ధరాత్రి రహస్య జీవోలతో కూర్చోబెట్టడం రాజుగారికి పెద్ద షాక్ గా మారింది. రెండు రోజుల తర్వాత ఈ వ్యవహారంపై స్పందించిన అశోక్.. న్యాయం పోరాటానికి సిద్ధమయ్యారు. అయితే ఓసారి న్యాయపోరాటానికి దిగితే అది ఎంతకాలం పడుతుందో తెలియదు. ఆ లోపు విజయనగరం టీడీపీలో తన పట్టును నిరూపించుకోవడంతో పాటు వారసురాలు ఆదితిని క్రియాశీలకంగా మార్చే పనిలో పడ్డారు రాజు గారు.
ఎందుకంటే సంచైత రాకతో మాన్సాస్ వ్యవహారాలపై సహజంగానే రాజు గారి పట్టు తగ్గింది. అదే సమయంలో మాన్సాస్ ముసుగులో విజయనగరం జిల్లా రాజకీయాలపైనా సంచైతకు పట్టు చిక్కే అవకాశం లభించింది. అదే జరిగితే రాజుగారికి భవిష్యత్తులో చిక్కులు తప్పవు.

రంగంలోకి కూతురు ఆదితి...
గతేడాది ఎన్నికల్ల ఎదురైన ఓటమిని మరిపించాంలన్నా, మాన్సాస్ వ్యవహారాలపై పట్టు సంపాదించాలన్నా ముందు విజయనగరం జిల్లా రాజకీయాల్లో తన వైభవం చాటుకోవడం రాజుగారికి తప్పనిసరిగా మారిపోయింది. దీంతో ఇప్పుడు ఆయన తన రాజకీయ వారసురాలిగా భావిస్తున్న ఆదితిని రంగంలోకి దింపుతున్నారు. ఇప్పటికే గత ఎన్నికల్లో వైసీపీ చేతిలో జిల్లా వ్యాప్తంగా టీడీపీ తుడిచిపెట్టుకుపోయిన తరుణంలో కూతురు ఆదితికి బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనలో రాజుగారు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దిశగా అధినేత చంద్రబాబును ఒప్పించాలని రాజుగారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Recommended Video

ఆదితి రాకతో పరిస్ధితులు మారే అవకాశం..
ప్రస్తుతం వయోభారం వల్ల అశోక్ గజపతిరాజు మునుపటిలా జిల్లా అంతా తిరిగి పార్టీని గాడిలో పెట్టే పరిస్దితి లేదు. జిల్లాలో పార్టీ రాజకీయాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. వైసీపీ క్లీన్ స్వీప్ నేపథ్యంలో ఓవైపు మంత్రి బొత్స కుటుంబం, ఆయన అనుచరగణం జిల్లాలో రాజ్యమేలుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో కూతురు ఆదితిని రంగంలోకి దింపితే జిల్లా టీడీపీని తిరిగి గాడిలో పెట్టడంతో పాటు మాన్సాస్ వ్యవహారాల్లో అన్న కూతురు సంచైత స్పీడుకు బ్రేక్ లు వేయొచ్చనే ఆలోచనలో అశోక్ గజపతిరాజు ఉన్నట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications