జనావాసాల మధ్య ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలను గుర్తించండి .. విశాఖ ఘటనపై అధికారుల సమీక్షలో సీఎం జగన్
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన నేపధ్యంలో నిర్వహించిన సమీక్షలో పలు కీలక ఆదేశాలు ఇచ్చారు. విశాఖలో జనావాసాల మధ్య ఉన్న కెమికల్ ఫ్యాక్టరీలను గుర్తించాలని , ఈ తరహా ఘటనలు భవిష్యత్ లో జరగటానికి వీలు లేదని అందుకు కావలసిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్ . నిన్న ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ దుర్ఘటన అనంతరం తీసుకున్న చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇక వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులతో మాట్లాడిన సీఎం అక్కడి తాజా పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు.
Recommended Video
విశాఖ గ్యాస్ లీక్ ఘటనపై కేంద్రానికి, రాష్ట్రానికి జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీసులు
విశాఖలో తాజా పరిస్థితి సమీక్షించిన సీఎం జగన్ ...
విశాఖపట్నం నుంచి సీఎం తో సమీక్షా సమావేశంలో సీఎస్ నీలం సాహ్ని, కలెక్టర్ వినయ్చంద్, పోలీస్ కమిషనర్ ఆర్ కే మీనా పాల్గొన్నారు. ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్ నివారణకు చేపట్టిన చర్యలపై సీఎంకు కలెక్టర్ వినయ్చంద్ వివరించారు. ఆందోళనకర పరిస్థితులు లేవని , ప్రస్తుతం పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని సీఎస్ నీలం సాహ్ని తెలిపారు. ట్యాంకర్లోని రసాయనంలో 60శాతం పాలిమరైజ్ అయ్యిందని, మిగిలిన 40శాతం కూడా పాలిమరైజ్ అవుతుందని చెప్పిన సీఎస్ నీలం సాహ్ని దీనికి 18 నుంచి 24 గంటల సమయం పడుతుందని నిపుణులు చెప్తున్నారని సీఎం దృష్టికి తీసుకువెళ్ళారు .
వీడియో కాన్ఫరెన్స్ లో వివరాలు చెప్పిన అధికారులు .. తగిన కార్యాచరణ, ప్రణాళికతో రావాలని సీఎం ఆదేశం
అంతే కాదు ఫ్యాక్టరీలోని అన్ని ట్యాంకులు కూడా భద్రంగా ఉన్నాయన్నారు సీఎస్. ఆస్పత్రుల్లో బాధితులు కూడా క్రమంగా కోలుకుంటున్నారని చెప్పారు. ఎల్జీ పాలిమర్స్ ఘటన దర్యాప్తుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ విశాఖకు వస్తోందన్నారు. స్పెషల్ చీఫ్ సెక్రటరీ నీరబ్ ప్రసాద్ ఆధ్వర్యంలో వేసిన ఈ కమిటీ తో ఘటనపై దర్యాప్తు చేసి ఘటనకు కారణాలు , తగిన కార్యాచరణ, ప్రణాళికతో రావాలని సీఎం సీఎస్ నీలం సాహ్నికి సూచించారు. ఇక అంతే కాదు దర్యాప్తులో కాలుష్య నివారణా మండలి క్రియాశీలకంగా వ్యవహరించాలని కూడా తెలిపారు. కాలుష్యకారక అంశాలపై ఫిర్యాదులు, వాటి నివారణకు, పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ను సిద్ధంచేయాలని సీఎం ఆదేశించారు.
విశాఖలో జనావాసాల మధ్య కెమికల్ ఫ్యాక్టరీలు గుర్తించాలని ఆదేశం .. తరలింపు యోచనలో సర్కార్
ఫ్యాక్టరీలో ప్రస్తుతం ఉన్న రసాయనాలను తరలించే అవకాశాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్న సీఎం ఇక ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు ప్రకటించిన కోటి రూపాయల పరిహారాన్ని వెంటనే విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. అన్నిటికంటే ముఖ్యంగా విశాఖపట్నంలో ఇలాంటి విషవాయువులు ఉన్న పరిశ్రమలు ఎన్ని ఉన్నాయో తెలుసుకుని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వాటి తరలింపుపై కూడా విధానపరమైన ఆలోచనలు చేయాలని సీఎం జగన్ మోహన్ రెడ్డి సూచించారు . నిన్న జరిగిన ఘటనను దృష్టిలో పెట్టుకుని భవిష్యత్తులో ప్రజలకు ఇబ్బంది రాకుండా తగిన కార్యాచరణ రూపొందించాలని సీఎం సమీక్షలో అధికారులను ఆదేశించారు .