ఏపీలో కరోనా భయం , నైట్ కర్ఫ్యూపై యోచన .. సీఎం జగన్ చోద్యం చూస్తున్నారన్న అచ్చెన్న
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి . విపరీతంగా పెరుగుతున్న కేసులతో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కరోనా మహమ్మారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజృంభిస్తున్న నేపథ్యంలో విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలని, పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని, రాత్రి కర్ఫ్యూ విధించాలన్న ఆలోచనలో ఉంది ఏపీ సర్కార్. ఈ నేపథ్యంలో అత్యున్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించి కరోనా వ్యాప్తి నియంత్రణకు కఠిన నిర్ణయాలు తీసుకోవాలని అడుగులు వేస్తున్నట్లుగా సమాచారం.

రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోందని, ప్రభుత్వం పట్టించుకోవటం లేదని అచ్చెన్న ఫైర్
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు విపరీతంగా పెరగడంపై తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు జగన్ సర్కార్ పై విరుచుకుపడుతున్నారు . ఏపీలో కరోనా పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేసిన అచ్చెన్నాయుడు, రాష్ట్రంలో కరోనా విలయతాండవం చేస్తోందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం దీనిని సీరియస్ గా తీసుకోవడం లేదని విమర్శించారు. కరోనా కేసులు పెరుగుతుంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు .

కరోనా అదే వస్తుంది.. అదే పోతుంది అన్న చందంగా జగన్ ధోరణి
కరోనా అదే వస్తుంది.. అదే పోతుంది అన్న చందంగా జగన్ ధోరణి ఉందని ఫైర్ అయ్యారు.
రాష్ట్రంలో పరిస్థితి దారుణంగా ఉన్నా, కరోనా కట్టడికి కావలసిన నియంత్రణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. ఆస్పత్రులలో బెడ్ లు లేవని, ఆక్సిజన్ లేదని , కనీసం సరిగా భోజనం కూడా పెట్టలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అచ్చెన్నాయుడు విమర్శించారు. ఇక రాష్ట్రంలో కరోనా వ్యాక్సిన్ కొరత ఉందని పేర్కొన్న అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రధాని నరేంద్ర మోడీకి, కేంద్రానికి లేఖ రాస్తామని వెల్లడించారు.

ఏపీలో కరోనా సెకండ్ వేవ్ పంజా ... కొత్త లక్షణాలతో భారీగా కేసులు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ కల్లోలం సృష్టిస్తోంది. గతంలో కరోనా మహమ్మారి ప్రారంభంలో వెల్లడించిన లక్షణాలతో పాటుగా ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ లో మరికొన్ని కొత్త లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి. కళ్ళు ఎర్రగా మారడం, కీళ్ల నొప్పులు , ఒళ్ళు నొప్పులు, విపరీతమైన తలనొప్పి కూడా కరోనా లక్షణాల్లో ఒకటిగా గుర్తించారు. ఇక ఈ తరహా లక్షణాలతో ఏపీలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. చాలామంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నామని కరోనా జాగ్రత్తలు పాటించకుండా వ్యవహరిస్తున్నారని అలాంటివారికి కరోనా సోకే ప్రమాదముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications