వైసీపీలోకి గాజువాక మాజీ ఎమ్మెల్యే: ఇక మిగిలింది గంటా శ్రీనివాస్ ఒక్కరే: ఆయన వర్గం అంతా.. !
విశాఖపట్నం: గాజువాక మాజీ ఎమ్మెల్యే చింతలపూడి వెంకట్రామయ్య అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన విశాఖపట్నంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వీ విజయసాయి రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా సాయిరెడ్డి.. ఆయనకు పార్టీ కండువాను కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావుకు వెంకట్రామయ్య అత్యంత సన్నిహితుడు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రజారాజ్యం తరఫున గాజువాక నుంచి
వెంకట్రామయ్య రాజకీయ రంగప్రవేశం.. ప్రజారాజ్యం పార్టీ నుంచి ఆరంభమైంది. 2009లో ఆయన ప్రజారాజ్యం పార్టీ తరఫున గాజువాక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి, విజయం సాధించారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాస రావు, ప్రస్తుత పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, చింతలపూడి వెంకట్రామయ్య.. ఈ ముగ్గురిదీ ఒక బ్యాచ్. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తరువాత వారంతా కాంగ్రెస్లో కొనసాగారు. అనంతరం చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో అవంతి శ్రీనివాస్, గంటా శ్రీనివాస్ టీడీపీలో చేరగా.. వెంకట్రామయ్య జనసేన వైపు వెళ్లారు. గత ఏడాది ఎన్నికల సమయంలో అవంతి.. వైసీపీలో చేరిన విషయం తెలిసిందే.
పవన్ కల్యాణ్ కోసం సీటు త్యాగం చేసినా..
సార్వత్రిక ఎన్నికల సందర్భంగా వెంకట్రామయ్య.. తనకు గట్టిపట్టు ఉన్న గాజువాక స్థానాన్ని పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్కు వదులుకోవాల్సి వచ్చింది. ఇష్టం లేకపోయినప్పటికీ.. తాను గెలవలేనని తెలిసినప్పటికీ.. పెందుర్తి నియోజకవర్గం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేశారు వెంకట్రామయ్య. దాని ఫలితమేమిటనేది తెలిసిన విషయమే. ఇక్కడి నుంచి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి అన్నంరెడ్డి అదీప్ రాజ్ చేతిలో ఓటమి పాలయ్యారు. తాను గాజువాక నుంచి పోటీ చేసి ఉంటే గెలిచే వాడినని, ఉద్దేశపూరకంగా తనను పెందుర్తి టికెట్ను కేటాయించారనే ఆగ్రహంతో పార్టీకి గుడ్బై చెప్పారు.
ఇక వైఎస్ఆర్సీపీలోకి..
తాజాగా వైఎస్ఆర్సీపీలో చేరారు. విజయసాయి రెడ్డి సమక్షంలో పార్టీ కండువాను కప్పుకొన్నారు. ఈ సందర్భంగా వెంకట్రామయ్య తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. తన రాజకీయ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినదేమీ లేదని అన్నారు. అది అందరికీ తెలిసిన విషయమేనని అన్నారు. చిరంజీవిపై అభిమానంతో తాను ప్రజారాజ్యంలో చేరానని, ఆ అభిమానంతోనే ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ స్థాపించిన జనసేనతో కలిసి పనిచేశానని అన్నారు. అయినప్పటికీ.. పార్టీలో తనకు కనీస గుర్తింపు లభించట్లేదని చెప్పారు.
Recommended Video
గంటా చేరికపై మౌనం..
విశాఖ నార్త్కు చెందిన టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస రావు కూడా వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశాలు ఉన్నాయా? అంటూ విలేకరులు అడిగిన ప్రశ్నలకు వెంకట్రామయ్య సమాధానం ఇవ్వడానికి నిరాకరించారు. ఆయన చేరిక గురించి తానేమీ వ్యాఖ్యానించదలచుకోలేదని అన్నారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ తనకు మిత్రుడని చెప్పుకొచ్చారు. తనకు పదువులేమీ ఇవ్వకపోయినప్పటికీ.. విశాఖపట్నం అభివృద్ధి కోసం పనిచేస్తానని అన్నారు. విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా బదలాయించడాన్ని తాను స్వాగతిస్తున్నాని చెప్పారు.