విశాఖకు పవన్ కల్యాణ్: జనసేన అధినేత పోరుబాట: మోడీ సర్కార్తో తాడోపేడో
విశాఖపట్నం: జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరోసారి పోరుబాట పట్టారు. ఇదివరకు- రాష్ట్రంలో అధ్వాన్నంగా తయారైన రోడ్లను మరమ్మత్తు చేయడానికి ఓ ఉద్యమాన్నే నడిపించిన పవన్ కల్యాన్.. మరోసారి అలాంటి పోరాటానికి శ్రీకారం చుట్టనున్నారు. ఈ సారి ఏకంగా కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ సర్కార్ను ఢీ కొట్టబోతున్నారు. రాష్ట్రానికి తలమానికంగా ఉంటూ వస్తోన్న విశాఖపట్నం ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణను నిరసిస్తూ ఆయన నిరసన ప్రదర్శనలను నిర్వహించనున్నారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా..
విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నిర్వహిస్తోన్న ఆందోళన కార్యక్రమాల్లో పవన్ కల్యాణ్ భాగస్వామ్యి కానున్నారు. ఉక్కు పరిరక్షణ ప్రతినిధులతో కలిసి ఆయన నిరసన ప్రదర్శనల్లో పాల్గొననున్నారు. బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదుర్చుకున్నందు వల్ల విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ విషయంలో పవన్ కల్యాణ్ గానీ, ఆయన సారథ్యాన్ని వహిస్తోన్న జనసేన పార్టీ గానీ జోక్యం చేసుకోవట్లేదంటూ వస్తోన్న విమర్శలు, ఆరోపణల నేపథ్యంలో- ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంటోంది.

ఢిల్లీలో స్థాయిలో గళం..
వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించబోతున్నామంటూ కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించిన తరువాత మొట్టమొదటి సారిగా స్పందించింది పవన్ కల్యాణేనని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. ఈ ప్రకటన వెలువడిన వెంటనే- ఆయన ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించారని స్పష్టం చేస్తోన్నారు. ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రులను సైతం కలిశారని వారు గుర్తు చేస్తున్నారు. విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ అనేది కోట్లాదిమంది తెలుగు ప్రజల మనోభావాలతో ముడిపడి ఉన్న అంశం కావడం వల్ల ఈ నిర్ణయంపై పునరాలోచన చేయాలంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలిసి విజ్ఞప్తి చేశారని అంటున్నారు.

అమిత్ షాతోనూ భేటీ..
ఫిబ్రవరి 9వ తేదీన ఢిల్లీలో- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను కలిసి ఈ విషయంపై పవన్ కల్యాణ్- ఓ వినతిపత్రాన్ని సైతం అందజేశారని జేశారని గుర్తు చేస్తోన్నారు. అప్పటికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గానీ, ప్రతిపక్ష తెలుగుదేశం గానీ స్పందించలేదని అంటున్నారు. పవన్ కల్యాణ్ తన వ్యతిరేకతను తెలియజేసిన తరువాత.. మిగిలిన పార్టీలు రోడ్డెక్కాయని చెబుతున్నారు జనసేన పార్టీ నాయకులు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశాన్ని మొదటి నుంచీ తాము వ్యతిరేకిస్తూనే వస్తున్నామని, ఈ అంశంలో వెనక్కి తగ్గబోమని తేల్చి చెబుతున్నారు.
Recommended Video

31న షెడ్యూల్ ఇదే..
తమ ఉద్యమానికి అండగా నిలవాలంటూ- విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ప్రతినిధుల నుంచి తమకు ఆహ్వానాలు అందాయని, ఈ మేరకు పవన్ కల్యాణ్ ఈ నెల 31వ తేదీన సాగరనగరానికి వెళ్లనున్నారని జనసేన పార్టీ నాయకులు చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రాంగణానికి వెళ్తారని, ఉక్కు పరిరక్షణ సమితి ప్రతినిధులతో కలిసి బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. మధ్యాహ్నం 2 గంటలకు ఈ సభ మొదలవుతుందని, సాయంత్రొం వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పవన్ కల్యాణ్ మలిదశ ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతున్నారని చెప్పారు.












Click it and Unblock the Notifications