ఆక్సిజన్కు అన్నపూర్ణ: కరోన కాలంలో..దేశాన్ని తల్లిలా ఆదుకుంటోన్న విశాఖ స్టీల్ప్లాంట్
విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ప్లాంట్..తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ముందు అందరి కళ్లూ దీని వైపే. తమ రాజకీయ అవసరాల కోసం రాష్ట్రానికే తలమానికంలా ఉంటూ వచ్చిన విశాఖ ఉక్కు కర్మాగారం పేరును వాడుకున్నాయి అన్ని పార్టీలు. కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోడీ సర్కార్ ప్రతిపాదించిన విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ వ్యవహారంపై రోజుల తరబడి రచ్చ సాగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం కాకుండా ఉండటానికి ఉద్యోగులు, కార్మిక సంఘాల ప్రతినిధులు.. ధర్నాలు, బంద్లను నిర్వహించారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం తనవంతు ప్రయత్నాలు సాగించంది.
తెగనమ్మాలనుకున్నా.. తల్లిలా
అలాంటి విశాఖపట్నం ఉక్కు కర్మాగారం.. ఇఫ్పుడు దేశం మొత్తాన్నీ ఆదుకునే స్థాయికి చేరింది. తెగనమ్మాలనుకున్నప్పటికీ.. తల్లిలా ఆదరిస్తోంది. దేశం మొత్తానికీ ఆక్సిజన్ (Oxygen) సరఫరా చేసే అన్నపూర్ణలా మారింది. కరోనా వైరస్ భయానకంగా వ్యాప్తి చెందుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఆక్సిజన్ కొరత ఏర్పడిన విషయం తెలిసిందే. అన్ని రాష్ట్రాలూ ఈ సమస్యను ఎదుర్కొంటోన్నాయి. ప్రత్యేకించి- కరోనా పాజిటివ్ కేసులు వేల సంఖ్యలో పుట్టుకొస్తోన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తర ప్రదేశ్లల్లో ఆక్సిజన్ కొరత తీవ్రంగా ఉంది. కరోనా బారిన పడిన పేషెంట్లకు అందించడానికి చాలినంత ఆక్సిజన్ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండట్లేదు.
మెడికల్ ఆక్సిజన్ కోసం..
ఈ పరిణామాల మధ్య.. ఆక్సిజన్ ఉత్పత్తిని చేపట్టింది విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ. టన్నుల కొద్దీ మెడికల్ ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తోంది. ఆక్సిజన్ కొరత ఏర్పడిన రాష్ట్రాలకు తరలించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ చర్యలు తీసుకుంది. నవీ ముంబైలోని కలంబోళీ గూడ్స్ యార్డ్ నుంచి ఏడు ఖాళీ ట్యాంకర్లతో కూడిన ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ (Oxygen Express), బయలుదేరింది. ఈ రాత్రికి ఆ ఎక్స్ప్రెస్ విశాఖపట్నానికి చేరుకోవచ్చు. రోల్ ఆన్ రోల్ ఆఫ్ ఆక్సిజన్ ట్యాంకర్లను విశాఖపట్నానికి మోసుకొస్తోందా రైలు. వసై రోడ్, జల్గావ్, నాగ్పూర్, రాయ్పూర్ జంక్షన్ మీదుగా ఈ ఆక్సిజన్ ఎక్స్ప్రెస్ విశాఖపట్నం స్టీల్ప్లాంట్కు చేరుకుంటుంది.
ఇదివరకు కూడా..
విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో లిక్విడ్ మెడికల్ ఆక్సిజన్ (Liquid medical Oxygen)ను నింపుకొని మళ్లీ.. తిరుగుప్రయాణమౌతుంది. ఈ రకం ఆక్సిజన్ తయారీలో విశాఖ స్టీల్ ప్లాంట్ అగ్రగామిగా కొనసాగుతోంది. కరోనా బారిన పడిన పేషెంట్ల ప్రాణాలను కాపాడటంలో కీలకమైన మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిలో గత ఏడాది ఈ స్టీల్ ప్లాంట్ కీలకపాత్ర పోషించింది. గత ఏడాది ఈ స్టీల్ప్లాంట్ నుంచి పలు రాష్ట్రాలకు ఆక్సిజన్ సరఫరా అయింది. అప్పట్లో ఇప్పుడున్నంత డిమాండ్ ఏర్పడలేదు. ఈ సారి మాత్రం దానికి భిన్నమైన పరిస్థితులు దేశంలో నెలకొని ఉన్నాయి. గత ఏడాది గరిష్ఠ సంఖ్యతో పోల్చుకుంటే రెండు రెట్లు అధికంగా కరోనా కేసులు రికార్డవుతున్నాయి.
రోజూ 150 టన్నుల మేర..
విశాఖ స్టీల్ప్లాంట్లో ప్రత్యేకంగా ఇండస్ట్రియల్ ఆక్సిజన్ తయారీ యూనిట్ ఉంది. దీనిలో తయారైన ఆక్సిజన్లో కొంత భాగాన్ని బయటి అవరాల కోసం కేటాయిస్తుంటారు. సొంత అవసరాల కోసం వినియోగించడమే అధికం. కేంద్రం ఆదేశాలతో విశాఖ స్టీల్ ప్లాంట్ తన ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచింది. రోజుకె 150 టన్నుల మేర ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇఫ్పుడున్న అవసరాలను దృష్టిలో ఉంచుకుని దేశంలో మిగిలిన స్టీల్ ప్లాంట్లు కూడా ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది. రానున్న రోజుల్లో ఆక్సిజన్ కొరత లేకుండా ఉండేలా చర్యలు తీసుకుంది.
Recommended Video