నేను మంత్రి కేటీఆర్ పీఏను.. : వెలుగుచూసిన మాజీ క్రికెటర్ మోసాలు..
అతనో మాజీ రంజీ క్రికెటర్.. కానీ ఈజీ మనీ కోసం పెడదారి పట్టాడు. ప్రముఖుల పేర్లతో పలు కంపెనీలకు ఫోన్ కాల్స్ చేసి మోసాలకు పాల్పడుతున్నాడు. ఇందుకోసం తెలంగాణ మంత్రి కేటీఆర్ పేరును కూడా వాడుకున్నాడు. ఇటీవలే ఓ బ్యాంకుకు కూడా టోకరా వేసి లక్షల్లో డబ్బు గుంజాడు. అయితే ఎట్టకేలకు పోలీసుల అతని బాగోతాన్ని బయటపెట్టారు. విశాఖపట్నంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు.
మాజీ రంజీ క్రికెటర్..
ఆంధ్రా రంజీ మాజీ క్రికెటర్ బుడుమూరు నాగరాజు కొంతకాలంగా ఈజీ మనీ కోసం మోసాలకు పాల్పడుతున్నాడు. ఇందులో భాగంగా మంత్రి కేటీఆర్ పీఏని అంటూ పలు సంస్థలకు ఫోన్లు చేసి డబ్బులు డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. ఓ రియల్ ఎస్టేట్ సంస్థకు ఫోన్ చేసి లక్షల్లో డబ్బు డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన సందరు సంస్థ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతని అసలు రంగు బయటపడింది.
అలా మోసాలు..
ఓ నిరుపేద యువకుడు ఐపీఎల్కి సెలెక్ట్ అయ్యాడని.. అతను అందులో ఆడేందుకు సాయం చేయాలని గతంలోనూ ఆ రియల్ ఎస్టేట్ సంస్థకు నాగరాజు ఫోన్ చేశాడు. అతను చెప్పింది నిజమేనని నమ్మి.. రూ.3లక్షలు ఆ సంస్థ అతనికి ట్రాన్స్ఫర్ చేసింది. కోరగానే సాయం చేయడంతో.. ఈసారి కేటీఆర్ పీఏ పేరుతో మరో మోసానికి తెరలేపాడు. కానీ ఆ కంపెనీకి అనుమానం రావడంతో అడ్డంగా బుక్కయ్యాడు.
ఎమ్మెస్కే ప్రసాద్ పేరుతోనూ మోసాలు..
బీసీసీఐ సెలెక్ట్ కమిటీ ఛైర్మన్ ఎమ్మెస్కే ప్రసాద్ పేరుతోనూ నాగరాజు పలు క్రికెట్ అసోసియేషన్లు,ప్రముఖ బ్యాంకుల అధికారులను మోసం చేసినట్టు పోలీసులు గుర్తించారు. వారి వద్ద నుంచి లక్షల్లో డబ్బు కాజేసినట్టు నిర్దారించారు. ఎమ్మెస్కే ప్రసాద్ ఫోన్ నంబర్ను స్పూఫింగ్ చేసి.. అదే నంబర్తో పలువురికి ఫోన్ చేసి ఎమ్మెస్కేలా మాట్లాడేవాడని చెప్పారు.
ఎట్టకేలకు అరెస్ట్..
కొద్ది నెలల క్రితం ఎమ్మెస్కే ప్రసాద్ గుంటూరు వెళ్లగా.. ఓ పోలీస్ ఉన్నతాధికారి ఆయన్ను కలిశారు. మీ ఫోన్ నంబర్తో ఓ వ్యక్తి ఫోన్ చేసి మీలాగే మాట్లాడాడని, సాయం చేయాలని కోరాడని అన్నారు. అతనెవరో తనకు తెలియదని ఎమ్మెస్కే చెప్పాడు. దాంతో సదరు వ్యక్తిని పట్టుకునేందుకు పోలీసులు నిఘా పెట్టారు. ఆ తర్వాత కొద్దిరోజులకు విశాఖలోని ఓ బ్యాంకు అధికారులకు టోకరా వేయడంతో.. వారు ఇచ్చిన వివరాల ఆధారంగా దర్యాప్తు జరిపి.. ఎట్టకేలకు అతన్ని అరెస్ట్ చేశారు. అయితే జైలుకెళ్లి వచ్చినా అతనిలో మార్పు రాలేదు. బయటకొచ్చాక.. కేటీఆర్ పీఏ పేరుతో మళ్లీ మోసాలు మొదలుపెట్టాడు. శుక్రవారం అతన్ని అరెస్ట్ చేసిన పోలీసులు కోర్టు ఆదేశాల మేరకు రిమాండుకు తరలించారు.