విశాఖలో వారం రోజులుగా కరోనా కేసుల్లేవ్.. రాజధాని కోసమే దాస్తున్నారని విపక్షం ఆరోపణలు..
ఏపీ కొత్త రాజధానిగా పేరు తెచ్చుకున్న విశాఖపట్నంలో కరోనా కేసులు ఆరంభంలో ఎక్కువగా నమోదైనా ఆ తర్వాత వ్యాప్తి తగ్గింది. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో పాటు పొరుగున ఉన్న ఉత్తరాంధ్ర జిల్లాలు కరోనా ఫ్రీగా ఉండటమే దీనికి కారణమని తెలుస్తోంది. అయితే గత వారం రోజులుగా విశాఖ జిల్లాలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంతో ఒక్కసారిగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే కరోనా బాధితులను ప్రభుత్వం దాస్తోందని ఆరోపిస్తున్న విపక్షాలకు ఇదో ఆయుధంగా మారింది.

విశాఖలో కరోనా తాజా పరిస్ధితి..
విశాఖ జిల్లాలో ప్రభుత్వం విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం ఇప్పటివరకూ 20 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా.. చికిత్స తర్వాత 10 మంది వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 10 మందికి మాత్రమే ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది. గత వారం రోజులుగా అయితే ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు. దీంతో రెడ్ జోన్ల సంఖ్య కూడా ఇక్కడ నామమాత్రంగా ఉంది. ఇదే ఇప్పుడు అనుమానాలకు తావిస్తోంది.

రాజధాని కోసమే నంటూ ప్రచారం..
రాష్ట్ర వ్యాప్తంగా అర్బన్ ప్రాంతాల్లో ప్రతీ రోజూ కనీస సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నా.. విశాఖలో మాత్రం వారం రోజులుగా ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడంపై ప్రజల్లో అనుమానాలు నెలకొన్నాయి. ఇప్పటికే టీడీపీ నేతలు కరోనా కేసులను దాచిపెట్టి ప్రభుత్వం రాజధాని తరలింపుకు రంగం సిద్ధం చేస్తోందని ఆరోపిస్తున్న నేపథ్యంలో కొత్త కరోనా కేసుల సంఖ్య లేకపోవడం అనుమానాలకు కారణమవుతోంది. అయితే అధికారులు మాత్రం దీనిపై నోరు మెదపడం లేదు.

విశాఖలో అంతా అనుమానితులే..
వాస్తవంగా విశాఖ నగరంతో పాటు జిల్లాలోనూ వారం రోజులుగా అక్కడక్కడా అనుమానితుల గుర్తింపు కొనసాగుతోంది. కరోనా లక్షణాలతో కనిపించిన వారిని క్వారంటైన్ కు పంపుతున్నారు. వీరి శాంపిల్స్ ను నిర్ణీత గడువు తర్వాత పరీక్షలకు పంపుతున్నా ఎక్కడా పాజిటివ్ గా నిర్ధారణ కాలేదు. దీంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంటోంది. విశాఖలో అంతర్జాతీయ విమానాశ్రయం మూతపడటం, పొరుగున ఉన్న శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఇప్పటివరకూ ఒక్క కేసు కూడా లేకపోవడం విశాఖపై సానుకూల ప్రభావం చూపుతోందని స్ధానిక అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ విపక్షాలు మాత్రం ఈ వాదనను నమ్మడం లేదు.

ఐదుగురు నర్సులకు కరోనా లక్షణాలు..
ఇటీవల విశాఖలోని స్టేట్ కోవిడ్ - 19 హాస్పిటల్ విమ్స్ లో క్వారెంటైన్ లో ఉన్న కరోనా పాజిటివ్ రోగులకు చికిత్స చేసిన నర్సింగ్ స్టాఫ్ కు కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయి. కరోనా పాజిటివ్ రోగులకి చికిత్స చేసిన సిబ్బందికి 4 రోజుల విధులు ముగిసిన తర్వాత 14 రోజులు హోమ్ క్వారెంటైన్ లో ఉండేలా నిబంధనలు ఉన్నాయి.
కానీ రోగులకు చికిత్స చేసిన స్టాఫ్ కు కేజీహెచ్ లో నిరంతరంగా విధులు అప్పగిస్తున్నారు. వీరిలో ఇప్పుడు ఐదుగురుకి కరోనా అనుమానిత లక్షణాలు ఉండటంతో నర్సింగ్ స్టాఫ్ లో భయాందోళనలునెలకొన్నాయి. వరుస డ్యూటీ లపై నర్సులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నిబంధనల ప్రకారం నర్సింగ్ స్టాఫ్ కి డ్యూటీలు వేయలాని కోరుతున్నా నర్సింగ్ సూపరింటెండెంట్ , కేజీహెచ్ సూపరింటెండెంట్ పట్టించుకోవడం లేదని వీరు ఆరోపిస్తున్నారు.












Click it and Unblock the Notifications