విశాఖ ఉక్కు అమ్మకానికి: బడ్జెట్ ప్రతిపాదనల్లో: రేపట్నుంచే పార్లమెంట్: వైసీపీ వైఖరేంటీ?
విశాఖపట్నం: విశాఖపట్నం.. ఈ పేరు వినగానే గుర్తుకు వచ్చేది స్టీల్ ప్లాంట్. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు పేరుతో సుదీర్ఘకాలం పాటు కొనసాగిన ఉద్యమాలు జ్ఞప్తికి వస్తాయి. ఈ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినది ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడే. భారతీయ జనతా పార్టీ నాయకుడిగా ఆయన ఈ ఉద్యమాన్ని అప్పట్లో ముందుండి నడిపించారు. ప్రభుత్వ రంగానికి చెందిన నవరత్న స్టీల్ కంపెనీల్లో ఒకటిగా విశాఖ ఉక్కు కర్మాగారం పేరు తెచ్చుకుంది. ప్రతిష్ఠాత్మక నేపథ్యం ఉన్న ఈ స్టీల్ ప్లాంట్ విక్రయించడానికి కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేపట్టింది.

బడ్జెట్ ప్రతిపాదనల్లో పూర్తి వివరాలు..
దేశవ్యాప్తంగా ఉన్న కొన్ని కీలక ప్రభుత్వరంగ సంస్థల ప్రైవేటీకరణ విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను వచ్చేనెల 1వ తేదీన ప్రవేశపెట్టబోయే సాధారణ బడ్జెట్ ప్రతిపాదనల్లో పొందుపరిచే అవకాశం ఉంది. ప్రైవేటీకరించడానికి రూపొందించిన ప్రైవేటు రంగ సంస్థల జాబితాను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటిస్తారని సమాచారం. ఈ జాబితాలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ను కూడా చేర్చారని అంటున్నారు.

ప్రైవేటుపరం చేయడానికి ఉద్దేశించిన కంపెనీల జాబితాలో..
పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా ఇదివరకే ఎయిరిండియా, జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), భారత్ పెట్రోలియం, సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ), భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్, కంటైనర్ కార్పొరేషన్ వంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ఉన్నాయి. ఎయిరిండియాను విక్రయించడానికి నాలుగైదేళ్లుగా ప్రయత్నిస్తున్నప్పటికీ.. కొనడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపట్లేదు. స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా (సెయిల్)కు చెందిన సేలం, దుర్గాపూర్, భద్రావతి ప్లాంట్లను ఇదివరకే అమ్మకానికి ఉంచింది.

కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు..
తాజాగా రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ (ఆర్ఐఎన్ఎల్)కు చెందిన విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని విక్రయించడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన సాగిన బుధవారం నాటి కేబినెట్ భేటీలోనూ ఈ అంశం చర్చకు వచ్చినట్లు జాతీయ మీడియా వెల్లడించింది. పెట్టుబడుల ఉపసంహరణలో భాగంగా- ఆర్ఐఎన్ఎల్ను ప్రైవేటీకరించవచ్చని, దీనికి సంబంధించిన పూర్తి వివరాలను నిర్మలా సీతారామన్.. తన బడ్జెట్ ప్రతిపాదనల సందర్భంగా వెల్లడిస్తారని పేర్కొంది.

భారీగా ఉత్పాదక సామర్థ్యం..
వైజాగ్ స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇందులో వందశాతం కేంద్ర ప్రభుత్వానికి వాటా ఉంది. ఆర్ఐఎన్ఎల్లో 17 వేలమంది వరకు ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఏటా 6.3 మెట్రిక్ టన్నుల మేర స్టీల్ను ఉత్పత్తి అవుతుంది ఇందులో. ఈ స్టీల్ ప్లాంట్ ఉత్పాదక సామర్థ్యాన్ని 7.3 మెట్రిక్ టన్నులకు పెంచాలనే డిమాండ్ కొంతకాలంగా ఉద్యోగుల నుంచి వినిపిస్తోంది. అదే సమయంలో దీన్ని విక్రయానికి ఉంచాలంటూ కేంద్ర ప్రభుత్వం భావిస్తుండటం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నష్టాల బాటలో
2017-18 ఆర్థిక సంవత్సరంలో 1,369 కోట్ల రూపాయల నష్టాన్ని విశాఖ స్టీల్ ప్లాంట్ చవి చూసింది. అనంతరం అద్భుత ఫలితాలను సాధించగలిగింది. ఆ మరుసటి ఏడాదే అంటే 2018-19 ఆర్థిక సంవత్సరానికి నష్టాలను పూడ్చుకోవడమే కాకుండా.. 97 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించింది. ఆ తరువాత మళ్లీ వరుసగా రెండేళ్ల పాటు నష్టాల్లో మునిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3,910 కోట్ల రూపాయల నష్టాలను నమోదు చేయొచ్చని జాతీయ మీడియా తెలిపింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని డిజిన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్లో భాగంగా- ఆర్ఐఎన్ఎల్ నుంచి పెట్టుబడులను ఉపసంహరించుకోవాలని, ప్రైవేటుపరం చేయాలనే నిర్ణయానికి కేంద్రం వచ్చినట్లు స్పష్టమౌతోంది.

వైసీపీ వైఖరి ఎలా ఉంటుంది?
విశాఖ స్టీల్ ప్లాంట్ను అమ్మకానికి సంబంధించిన ప్రతిపాదనలు గానీ, బిల్లులు గానీ పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో సభ ముందుకు రావడానికి అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. అదే జరిగితే- అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైఖరి ఎలా ఉండబోతోందనేది ఆసక్తి రేపుతోంది. కీలక బిల్లులపై ఎన్డీఏకు మద్దతు ఇస్తూ వస్తోన్న వైసీపీ సభ్యులు.. వైజాగ్ ఉక్కు కర్మాగారం అమ్మకానికి కూడా అనుకూలంగా ఉంటారా? లేదా? అనేది చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications