విశాఖ వైపు జగన్ సర్కార్: పరిపాలన రాజధాని కోసం బిగ్ ప్లాన్: రూ.3,500 కోట్లు: కేంద్రం వాటా
విశాఖపట్నం: రాష్ట్రంలో మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిండు అసెంబ్లీలో చేసిన ప్రకటనకు రెండు సంవత్సరాలు నిండుతోంది. ఈ ప్రకటన చేసిన ఏడాదే సచివాలయాన్ని విశాఖపట్నానికి తరలిస్తారనే ప్రచారం జోరుగా సాగినప్పటికీ.. అవాంతరాలు ఎదురయ్యాయి. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ న్యాయస్థానాలను ఆశ్రయించింది. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహిస్తూ వస్తోంది. అమరావతి పరిరక్షణ సమితి చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ స్వయానా సారథ్యాన్ని వహిస్తోంది. కరోనా వైరస్ విస్తృతి, లాక్డౌన్ పరిస్థితులు సచివాలయం తరలింపునకు అడ్డుపడ్దాయి.

రాజధాని తరలింపు జాప్యాన్ని సద్వినియోగం..
కారణాలు ఏమైనప్పటికీ- సాగర నగరాన్ని పరిపాలన రాజధానిగా బదలాయించడంలో జాప్యం చోటు చేసుకుంటూ వస్తోంది. నెలలు గడుస్తున్నప్పటికీ.. విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ కేపిటల్ సిటీగా రూపుదాల్చట్లేదు. ఈ జాప్యాన్ని జగన్ సర్కార్ తనకు అనుకూలంగా మార్చుకుంటోంది.. సద్వినియోగం చేసుకుంటోంది. పరిపాలన రాజధానిగా బదలాయించిన తరువాత ఎదురయ్యే పరిణామాలు, జనాభా పెరుగుదలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను కల్పించడంపై దృష్టి పెట్టింది.

నీటి ఎద్దడి నివారణకు
ఇప్పటికే రోడ్లు, ఫ్లైఓవర్ల నిర్మాణానికి కోట్ల రూపాయలను వ్యయం చేసిన జగన్ సర్కార్.. తాజాగా నీటి ఎద్దడిపై దృష్టి సారించింది. పరిపాలన రాజధానిగా మార్చిన తరువాత ఏర్పడే జనం తాకిడికి అనుగుణంగా అదనపు నీటి వనరులను సమకూర్చడానికి సమాయాత్తమైంది. విశాఖ, విశాఖ గ్రామీణ ప్రాంతాలకు అదనంగా 12 టీఎంసీల నీటిని సరఫరా చేయడానికి అవసరమైన చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన డీపీఆర్ను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఈ డీపీఆర్ను కేంద్ర ప్రభుత్వానికి సైతం అందజేసింది. ఇందులో సగం ఖర్చను భరించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది.

ఏలేరు టు పెద నరవా
ఈ ప్రాజెక్ట్ అంచనా వ్యయం మొత్తం 3,570 కోట్ల రూపాయలు. తూర్పు గోదావరి జిల్లాలోని ఏలేశ్వరం రిజర్వాయర్ నుంచి విశాఖ నగరానికి నీటిని సరఫరా చేయడానికి ఉద్దేశించిన ప్రాజెక్ట్ ఇది. ఏలేరు రిజర్వాయర్ నుంచి పెద నరవా డ్యామ్కు 12 టీఎంసీల నీటిని సరఫరా చేయడం ద్వారా భవిష్యత్తులో విశాఖపట్నంలో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించడానికి వీలు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఏలేరు రిజర్వాయర్ నుంచి సుమారు 126 కిలోమీటర్ల దూరం మేర పైప్లైన్ను నిర్మించి ఈ నీటిని నరవా డ్యామ్కు పంప్ చేయాల్సి ఉంటుంది.
Recommended Video

సగం ఖర్చు భరించాలంటూ..
ఈ ప్రాజెక్ట్ వ్యయం 3,570 కోట్ల రూపాయల్లో సగం ఖర్చును కేంద్ర ప్రభుత్వం భరించితే ఆర్థిక భారం తగ్గుతుందని జగన్ సర్కార్ భావిస్తోంది. ఇలాంటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయడానికి కేంద్రం జల్ జీవన్ మిషన్ను అమలు చేస్తోంది. ఈ మిషన్ కింద సగం ఖర్చును భరించాలంటూ ప్రభుత్వం కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. ఈ ప్రాజెక్ట్ డీపీఆర్ను జల్శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్కు పంపించింది. దీనిపై కేంద్రం నుంచి సానుకూల సంకేతాలు వెలువడుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది. సగం ఖర్చును భరించడానికి ముందుకు రానప్పటికీ.. సొంత ఆర్థిక వనరులతో దాన్ని గడువులోగా పూర్తి చేయాలని జగన్ సర్కార్ భావిస్తోంది. త్వరలో దీనికి సంబంధించిన నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేస్తారని సమాచారం.












Click it and Unblock the Notifications