విశాఖలో రాజధాని ఏర్పాటు.. శంకుస్థాపనకు మోడీని ఆహ్వానిస్తాం : మంత్రి బొత్సా
విశాఖలో రాజధాని ఏర్పాటుపై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖలు చేశారు. విశాఖ లో రాజధాని శంకుస్థాపనకు ప్రధాని నరేంద్ర మోడీని ఆహ్వానిస్తామని పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. విశాఖలో రాజధాని శంకుస్థాపనకు ప్రధాని మోడీతో పాటు,అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానిస్తామని ,మన కుటుంబంలో ఏదైనా ఫంక్షన్ జరిగితే అందరినీ ఆహ్వానిస్తాం కదా అంటూ వ్యాఖ్యానించారు.
అన్ని ప్రాంతాల అభివృద్ధి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని,అందుకే ఈ విధమైన నిర్ణయం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ విశాఖలో రాజధాని శంకుస్థాపన జరిగి తీరుతుందన్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.
రాజధాని అమరావతి నిర్మాణాలపై ఈరోజు సీఎం జగన్ మోహన్ రెడ్డి తో సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంత్రి రాజధాని అమరావతి లో పెండింగ్ పనులపై దృష్టి సారించామని పేర్కొన్నారు. చంద్రబాబు తరహాలో గ్రాఫిక్స్ మాదిరిగా కాకుండా, అమరావతి నిజంగా అభివృద్ధి చేసి చూపిస్తామంటూ ఆయన చెప్పుకొచ్చారు.
రైతులకు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని పేర్కొన్నారు. ఏపీలో టీడీపీ ప్రతిపక్ష పాత్రను పోషించడంలో కూడా విఫలమైందని పేర్కొన్న మంత్రి బొత్స సత్యనారాయణ,చంద్రబాబుకు సొంత ప్రయోజనాలే ముఖ్యమని విమర్శలు గుప్పించారు.ప్రతీదానికి న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు అని అధికార పక్ష, ప్రతిపక్ష పాత్రలను తామే పోషించుకుంటూ రాష్ట్రంలో గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు.
చంద్రబాబు తన ఉనికి కోసమే రాజకీయాలు చేస్తున్నారని, ప్రతి విషయాన్ని రాద్ధాంతం చేస్తున్నారని బొత్స విమర్శించారు. వైజాగ్ లో రాజధాని ఏర్పాటు జరిగి తీరుతుందని మంత్రి బొత్స సత్యనారాయణ బల్లగుద్ది మరీ చెప్పారు.