విశాఖే రాజధాని- ఎవరూ ఆపలేరు- త్వరలో తరలింపు ప్రకటన -సాయిరెడ్డి వ్యాఖ్యలు.
ఏపీ రాజధాని తరలింపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వైసీపీ సర్కారు కరోనా వైరస్ నేపథ్యంలో తన ప్రయత్నాలను విరమించుకుందన్న ఊహాగానాలు వినిపించాయి. కానీ అలాంటిదేమీ లేదని, కరోనా వైరస్ తగ్గగానే తరలింపుపై ప్రభుత్వం నుంచి ప్రకటన ఉంటుందని ఆ పార్టీ కీలక నేత, ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో చేసిన ప్రకటన సంచలనంగా మారింది.
వైసీపీలోకి గంటా ఎంట్రీపై క్లారిటీ - విశాఖ నేతలకు సాయిరెడ్డి సంకేతం- ఊహాగానాలకు చెక్...
విశాఖ తరలింపు ఖాయమే..
ఏపీ రాజధానిని అమరావతి నుంచి విశాఖ తరలించే అంశంపై ఏపీ ప్రభుత్వం నెల రోజులుగా ఎలాంటి ప్రకటన చేయలేదు. కరోనా వైరస్ రాక ముందు నుంచే ప్రభుత్వం దీనిపై వ్యూహాత్మకంగా మౌనం వహించింది. తెర వెనుక ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ ఎక్కడా అధికారికంగా మంత్రులు కానీ ప్రభుత్వాధికారులు కానీ స్పందించలేదు. అటు కర్నూలుకు విజిలెన్స్ కార్యాలయాల తరలింపుకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పు వచ్చాక రాజధాని తరలింపు వాయిదా పడినట్లే అని అంతా భావించారు. కానీ అలాంటి దేమీ లేదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి విశాఖలో క్లారిటీ ఇచ్చారు
రాజధాని ఎవరూ ఆపలేరు.. త్వరలో ప్రకటన..
గత కొన్ని రోజులుగా విశాఖ జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తూ వైసీపీ నేతలతో సమావేశమవుతున్న విజయసాయిరెడ్డి తాజాగా రాజధాని ప్రసావన వచ్చినప్పుడు స్పందించారు. ఇవాళ భీమిలి నియోజకవర్గంలోని మంగమారిపేట గ్రామంలో పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో కలిసి 700 మత్స్యకార కుటుంబాలకు ఎంపీ.. నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణ, ఎంపీ సుజనా వ్యాఖ్యలపై కౌంటరిచ్చారు. ఈ క్రమంలో రాజధాని ప్రస్తావన తెచ్చిన విజయసాయి పై విధంగా ప్రకటన చేశారు.కరోనా వైరస్ తో పాటు తాజా పరిణామాల నేపథ్యంలో రాజధాని తరలింపు ఉంటుందా అన్న ప్రశ్నకు రాజధాని తరలింపును ఎవరూ ఆపలేరని, త్వరలోనే ప్రభుత్వం నుంచి ప్రకటన ఉంటుందన్నారు. దీంతో రాజధాని తరలింపు అంశం సజీవంగానే ఉందని అర్ధమవుతోంధి.
Recommended Video
స్ధానిక వ్యూహంలో భాగమేనా ?
ఏపీలో ప్రస్తుతం కరోనా వైరస్ ప్రభావం నేపథ్యంలో ప్రభుత్వం అధికారిక కార్యకలాపాలు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. ముఖ్యమంత్రి నుంచి కింది స్ధాయి అధికారులు, సిబ్బంది వరకూ అందరూ కరోనా నియంత్రణ చర్యల్లో భాగస్వాములై ఉన్నారు. ఇలాంటి సమయంలో మే నెలలో రాజధాని తరలింపు సాధ్యమేనా అంటే కచ్చితంగా చెప్పలేని పరిస్ధితి. కానీ విజయసాయి రెడ్డి మాత్రం స్ధానిక ఎన్నికల వ్యూహాల కోసం కరోనాను కూడా పట్టించుకోకుండా విశాఖలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. అదే సమయంలో నేతలతో మాట్లాడుతున్న సందర్భంగా విశాఖ రాజదాని కాకుండా నిలిచిపోతే ఎదురయ్యే ఇబ్బందులను ఆయన దృష్టికి తెచ్చినట్లు తెలుస్తోంది. దీంతో సాయిరెడ్డి తాజా పరిణామాలు రాజధాని తరలింపుపై ఎలాంటి ప్రభావం చూపబోవనే ధీమా ఇవ్వడం కోసమే ఇలాంటి ప్రకటన చేసి ఉండొచ్చని భావిస్తున్నారు.