సీఎంగా తొలిసారి విజయనగరానికి..జగనన్న ‘వసతి దీవెన’ పథకాన్ని ప్రారంభించిన ఏపీ సీఎం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేడు విజయనగరంలో జగనన్న వసతి దీవెన పథకం ప్రారంభించారు. పేద విద్యార్థులకు అండగా మరో విశిష్ట పథకానికి శ్రీకారం చుట్టిన సీఎం జగన్ ఎన్నికల హామీల్లో ఒకటైన 'జగనన్న వసతి దీవెన' పథకాన్ని తన చేతుల మీదుగా విజయనగరం జిల్లాలో ప్రారంభించి ఇచ్చిన హామీ నెరవేర్చే పనిలో పడ్డారు .
సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారిగా విజయనగరం జిల్లాకు వచ్చిన సీఎం జగన్ కు మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. విజయనగరం పోలీస్ ట్రైనింగ్ కళాశాలకు చేరుకున్న సీఎం జగన్ విజయనగరం అయోధ్య మైదానంలో వివిధ ప్రభుత్వ శాఖలు ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించించారు. అనంతరం వేదికపై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళర్పించి జగనన్న వసతి దీవెన పథకాన్ని ప్రారంభించారు.
సీఎం జగన్ విజయనగరం జిల్లా పర్యటన సందర్భంగా విజయనగరం జిల్లా వైసీపీ శ్రేణుల్లో సందడి నెలకొంది. ఇక విజయనగరంలో 'జగనన్న వసతి దీవెన' పథకాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి హర్షం వ్యక్తం చేశారు.
సీఎం జగన్ అందించే సంక్షేమ పథకాలతో ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్తున్నారు. అమ్మఒడి, ఆరోగ్య పథకాలు ప్రజలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని పేర్కొన్నారు. ఇక ప్రతిపక్షాలు జగన్ చేస్తున్న మంచి పనులను, అందిస్తున్న సంక్షేమ పథకాలను సహించలేకపోతున్నారని కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు.