25న తెలంగాణ బంద్: యాక్టివ్గా మావోయిస్టులు: జగన్ పేరుతో ప్రకటన
వరంగల్: భీమా కోరేగావ్ కేసులో అరెస్టయిన తెలంగాణకు చెందిన విప్లవకవి వరవర రావును విడుదల చేయించడానికి మావోయిస్టులు రంగంలోకి దిగారు. వరవర రావును విడుదల చేయించేలా తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకుని రానున్నారు. ఇందులో భాగంగా-
ఈ నెల 25వ తేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. ఈ మేరకు మావోయిస్టు తెలంగాణ కమిటీ నేత జగన్ పేరుతో ఓ ప్రకటన విడుదలైంది. తెలంగాణ ఉత్తర ప్రాంతంలో మావోయిస్టుల కదలికలు ఊపందుకుంటున్నట్లు వార్తలు వస్తోన్న నేపథ్యంలో.. ఈ బంద్కు పిలుపునివ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

నానావతి ఆసుపత్రిలో
ఎల్గార్ పరిషత్-భీమా కోరేగావ్ కేసుతో పాటు మావోయిస్టులతో కలిసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయడానికి కుట్ర పన్నారనే కారణంతో జాతీయ దర్యాప్తు సంస్థ అధికారులు 2018 నవంబర్లో వరవర రావును అరెస్టు చేశారు. ముంబైలోని తలోజా జైలుకు తరలించారు. తలోజా జైలులో విచారణ ఖైదీగా ఉన్న వరవర రావు కొద్దిరోజుల కిందట అనారోగ్యానికి గురయ్యారు. అనంతరం కరోనా వైరస్ బారిన కూడా పడ్డారు. ప్రస్తుతం ఆయనకు ముంబైలోని నానావతి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

25న బంద్కు
81 సంవత్సరాల వయస్సున్న వరవర రావును వెంటనే విడుదల చేయాలంటూ బోంబే హైకోర్టులోనూ పిటీషన్ దాఖలైంది. దీనిపై విచారణ కొనసాగుతోంది. అదే సమయంలో మావోయిస్టులు రంగంలోకి దిగారు. వరవర రావు సహా ఈ కేసుతో ప్రమేయం ఉన్నట్లు ఆరోపణలను ఎదుర్కొంటూ జైలు జీవితాన్ని గడుపుతోన్న 12 మంది ప్రజా సంఘాల నేతలను విడుదల చేయాలనే డిమాండ్తో మావోయిస్టులు 25వ తేదీన తెలంగాణ బంద్కు పిలుపునిచ్చారు. వరవర రావును అరెస్టు చేయడం వెనుక ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్ర దాగి ఉందని ఆరోపిస్తున్నారు.

కూంబింగ్ నిలిపివేత కోసం
ఛత్తీస్గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించి ఉన్న అడవుల్లో కూంబింగ్ను వెంటనే నిలిపివేయాలని మావోయిస్టు తెలంగాణ కమిటీ నేత జగన్ డిమాండ్ చేశారు. దీనికోసం నియమించిన గ్రేహౌండ్స్ బలగాలను ఉపసంహరించుకోవాలని అన్నారు. వరవర రావు, ప్రొఫెసర్ సాయిబాబా, ఆనంద్ టెలుతుంబ్డే, సుధా భరద్వాజ్, వెర్నర్ గోంజాల్వేస్, గౌతమ్ నవలేకర్ వంటి 12మంది కవులు, రచయితలు, ప్రజాసంఘాల కార్యకర్తలపై కేంద్ర ప్రభుత్వం అర్బన్ నక్సల్స్ అనే ముద్ర వేసిందని విమర్శించారు. భీమా కోరెగావ్ సంఘటనలో తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు.
Recommended Video

అర్బన్ నక్సల్స్ అనే ముద్ర..
వారందరినీ బేషరతుగా విడిచి పెట్టాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతే అర్బన్ నక్సల్స్ అనే కొత్త ఆరోపణలు పుట్టుకొచ్చాయని మండిపడ్డారు. విప్లవ కవులు, రచయితలు, ప్రజాస్వామిక శక్తులపై అణచివేతకు కేంద్ర ప్రభుత్వం పాల్పడుతోందని విమర్శించారు. కరోనాను కట్టడి చేయలేని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. బూటకపు ప్రచారాలతో ప్రజలను మోసం చేస్తూ, ప్రజాస్వామ్యవాదులను అణచి వేస్తున్నాయని ధ్వజమెత్తారు. వరవర రావును వెంటనే విడుదల చేయించడానికి తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications