Ajaz Patel: కోహ్లీసేనకు ఝలక్: కేన్ మామ టీమ్లో కొత్త అస్త్రం: ముంబైలో పుట్టి: రవీంద్ర జడేజా స్టైల్!
క్రైస్ట్చర్చ్: ప్రతిష్ఠాత్మకమైన ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్ (WTC Final)లో విరాట్ కోహ్లీ సారథ్యంలోని భారత క్రికెట్ జట్టును ఢీ కొట్టడానికి న్యూజిలాండ్ సన్నద్ధమైంది. ఈ మ్యాచ్లో ఆడబోయే జట్టును ప్రకటించిందా దేశ క్రికెట్ బోర్డు. మొత్తం 15 మంది జట్టు సభ్యుల పేర్లను వెల్లడించింది. ఇంగ్లాండ్తో ఇంగ్లాండ్ గడ్డపైనే ముగిసిన రెండు టెస్ట్ మ్యాచ్ల సిరీస్లో ఆశించిన స్థాయిలో రాణించిన ప్లేయర్లపై వేటు వేసింది. వారి స్థానంలో కొత్త ముఖాలకు చోటు కల్పించింది. ఇప్పుడు ప్రకటించిన జట్టే- శుక్రవారం నాడు ఇంగ్లాండ్లోని సౌథాంప్టన్లో ఆరంభమయ్యే డబ్ల్యూటీసీ ఫైనల్లో కోహ్లీసేనతో తలపడుతుంది.

యువ కెరటం.. ఇజాజ్ పటేల్
తాజాగా ప్రకటించిన న్యూజిలాండ్ జట్టు కూర్పు ఓ రకంగా కోహ్లీసనకు ఝలక్ ఇచ్చినట్టే కనిపిస్తోంది. కొత్తగా జట్టులోకి ఇజాజ్ పటేల్ను తీసుకుంది. ఇజాజ్ యూనస్ పటేల్.. 32 సంవత్సరాల క్రికెటర్. పుట్టింది ముంబైలో. ఆ తరువాత అతని కుటుంబం న్యూజిలాండ్కు వలస వెళ్లింది. ఇజాజ్ను స్పెషలిస్ట్ స్పిన్నర్గా జట్టులోకి తీసుకుంది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు. లెఫ్ట్ హ్యాండర్. లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. స్లో లెఫ్ట్ ఆర్మ్ ఆర్థొడాక్స్ స్పిన్ బౌలర్. న్యూజిలాండ్ జాతీయ జట్టుతో పాటు అక్లాండ్, అక్లాండ్-ఏ, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్, సెంట్రల్ డిస్ట్రిక్ట్స్-ఏ, న్యూజిలాండ్-ఏ జట్లకు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నాడు.

ఆడింది తొమ్మిది మ్యాచ్లే..
ఇజాజ్ పటేల్ ఇప్పటిదాకా ఆడింది తొమ్మిది టెస్ట్ మ్యాచ్లే. ఇందులో 16 ఇన్నింగుల్లో 26 వికెట్లను పడగొట్టాడు. అతని బెస్ట్ బౌలింగ్ ఫిగర్ మాత్రం కళ్లు చెదిరేలా ఉంటోంది. ఒక ఇన్నింగ్లో 59 పరుగులు ఇచ్చి అయిదు వికెట్లను పడగొట్టాడు. మొత్తం మ్యాచ్లో 123 పరుగులకు ఏడుమందిని పెవిలియన్ బాట పట్టించాడు. రెండు టీ20 మ్యాచ్లల్లో ఆడినప్పటికీ.. టెస్ట్ స్పెషలిస్ట్గానే నిలిచిపోయాడతను. వన్డే ఇంటర్నేషనల్స్లో ఇంకా ఎంట్రీ ఇవ్వలేదు. 2018లో అబుధాబిలో పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్లో టెస్టుల్లోకి అరంగేట్రం చేశాడు.

టీమిండియా ఊహించి ఉండకపోవచ్చు..
న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు- ఇజాజ్ పటేల్ను ఫైనల్ 15లోకి తీసుకుంటుందని బహుశా కోహ్లీసేన ఊహించి ఉండదు. ఇంగ్లాండ్పై రెండు టెస్టుల్లో ఆడిన ఆటగాళ్లనే కొనసాగిస్తుందని భావించి ఉంటుంది. ఎందుకంటే- అదే జట్టుతో ఇంగ్లాండ్ను ఓడించింది గనక. ఇప్పటిదాకా ఇజాజ్ బౌలింగ్ను భారత ఆటగాళ్లెవరూ ఎదుర్కొనలేదు. అలాగే- మనవాళ్ల బ్యాటింగ్ దూకుడు.. దెబ్బ ఎలా ఉంటుందనేది ఇజాజ్కూ తెలియదు. ఈ కొరత- డబ్ల్యూటీసీ ఫైనల్ మ్యాచ్తో తీరుతుందేమో చూడాలి. టీమిండియా ఆటగాళ్ల దూకుడును అడ్డుకోవడానికి ఇజాజ్ పటేల్ స్పిన్ బౌలింగ్ ఉపయోగపడుతుందని బోర్డ్ వ్యాఖ్యానించింది.

టీమిండియాతో ఆడే న్యూజిలాండ్ స్క్వాడ్ ఇదే..
తొలి టెస్ట్ మ్యాచ్లోనే డబుల్ సెంచరీని ఊది అవతల పారేసిన డెవాన్ కాన్వేకు ఈ జట్టులో చోటు దక్కింది. కేన్ విలియమ్సన్ను జట్టు కేప్టెన్గా కొనసాగించింది. కేన్ విలియమ్సన్, టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డెవాన్ కాన్వే, కొలిన్ డీ గ్రాండ్హోమ, మ్యాట్ హెన్రీ, కైలే జెమిసన్, టామ్ లాథమ్, హెన్రీ నికొల్స్, ఇజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్లను జట్టులోకి తీసుకుంది. వారిలో బీజే వాట్లింగ్ రెగ్యులర్ వికెట్ కీపర్ కాగా.. అదనంగా టామ్ బ్లండెల్కు చోటు దక్కింది. ఈ 15 మందిలో తుది జట్టులోకి ఎవరెవర్ని తీసుకుంటారనేది మ్యాచ్కు కొన్ని గంటల ముందే తెలుస్తుంది.












Click it and Unblock the Notifications