ఇంటర్ లో అడ్మీషన్లు నిలిపివేత, బోర్డు తాజా ఉత్తర్వులు - నెక్స్ట్ ఇక వీటిల్లోనే..!!
ఇంటర్ లో చేరే విద్యార్ధులకు బిగ్ అలర్ట్. ఇంటర్మీడియట్ బోర్డు జూనియర్ ఇంటర్ ప్రవేశాల పైన కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ అడ్మీషన్లకు బ్రేక్ పడింది. అడ్మీషన్ల పైన జారీ చేసిన ఉత్తర్వు లను నిలుపుదల చేస్తూ తాజాగా ఇంటర్మీడియట్ బోర్డు సర్క్యులర్ జారీ చేసింది. ప్రభుత్వం ఈ ఏడాది నుంచి ఇంటర్ విద్యలో తీసుకురానున్న సంస్కరణల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు త్వరలోనే పూర్తి స్పష్టత ఇస్తూ.. కొత్తగా తీసుకొచ్చే మార్పులు... ఇంటర్ విద్యలో సంస్కరణలు.. అడ్మీషన్ల పైన బోర్డు స్పష్టత ఇవ్వనుంది.
ఇంటర్ అడ్మీషన్లకు బ్రేక్ పడింది. ఈ మేరకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తాజాగా ఉత్తర్వు లు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు, గురుకులాల్లో ఈ నెల 8 నుంచి ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరించాలని, జూన్ 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ఇంటర్ విద్య కార్యదర్శి అభిలాష సోమవారం ప్రిన్సిపాళ్లను ఆదేశించారు. 24 గంటల్లోపే వాటిని నిలుపుదల చేస్తూ అభిలాష మంగళవారం మరో ఉత్తర్వు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు వెలువడేదాక ప్రవేశాలు చేపట్టవద్దని అందులో స్పష్టం చేశారు. ఇంటర్ విద్యలో కొన్ని సంస్కరణలు అమలు చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు. తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ప్రభుత్వం చేపట్టబోయే సంస్కరణలపై చర్చ నడుస్తోంది. పలుచోట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాల క్యాంప్సలోనే జూనియర్ కాలేజీలు కూడా ఉన్నాయి. అలాగే కొత్త విద్యాసంవత్సరంలో రాష్ట్రవ్యాప్తంగా మరిన్ని తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ఏర్పాటు కానున్నాయి.

ఇంటర్ విద్యలో సమూల మార్పులు
ప్రభుత్వం తీసుకొస్తున్న సంస్కరణల్లో భాగంగా ఈ పబ్లిక్ స్కూళ్లల్లో నర్సరీ నుంచి 12వ తరగతి వరకు బోధన ఉంటుంది. ఒకే క్యాంప్సలో 12వ తరగతి వరకు ఉన్న చోట్ల ప్రవేశాలు ప్రత్యేకంగా నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పాఠశాల విద్య 12వ తరగతి వరకు ఉండాలని జాతీయ విద్యా విధానంలో పొందుపరిచారు. పది తర్వాత ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ బోర్డు పరీక్షలు ఉండటంతో విద్యార్థులపై ఒత్తిడి తీవ్రంగా ఉంటోందని, దీనిని తగ్గించేందుకు ఫస్టియర్ బోర్డు పరీక్షలు తొలగించాలని విద్యా కమిషన్ సూచించింది. ఇంటర్ బోర్డును పాఠశాల విద్యలో విలీనం చేయాలని, డిగ్రీలో దోస్త్ తరహాలోనే ఇంటర్ లోనూ ఆన్లైన్ ప్రవేశాలు చేపట్టే ప్రతిపాదన కూడా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ఇందులో కొన్ని సంస్కరణలను మరో నెల రోజుల్లో ప్రారంభం కానున్న కొత్త విద్యా సంవత్సరం నుంచే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లు సమాచారం. దీంతో.. త్వరలోనే కొత్త విధానం అమలుతో పాటుగా అడ్మీషన్ల పైన నిర్ణయం వెల్లడించనున్నారు.













Click it and Unblock the Notifications