పాలమూరు అభివృద్ధికి ఎన్నారైలు
గత నెల 30 నుంచి ఈ నెల 2వ తేదీ వరకు లాస్ ఏంజిల్స్లో జరిగిన ఆటా సమావేశాల్లో తన ఎజెండాను ముందు పెట్టడంలో పాలమూరు ఎన్నారై ఫోరం విజయం సాధించింది. ఈ ఫోరం సమావేశం ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు వంశధార హాల్లో జరిగింది. రాష్ట్రంలోని అత్యంత వెనుకబడిన జిల్లానే కాకుండా దేశఃలోని వెనకబడిన జిల్లాల్లో ఒకటైన పాలమూరులో చారిటబుల్ కార్యకలాపాలు చేపట్టడానికి ఎన్నారై గ్రూప్ల దృష్టిని ఆకర్షించేందుకు ఈ సమావేశం నిర్వహించారు. ఫోరం కో ఆర్డినేటర్లు రవి మేరెడ్డి, విజయ్ చవ్వా, పరమేశ్ భీంరెడ్డి, రామమోహన్ కొండా, భువనేష్ ఈ సమావేశానికి ఏర్పాట్లు చేశారు.
సమావేశంలో పలువురు ప్రముఖ ఎన్నారైలు పాల్గొన్నారు. పాలమూరులో చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలకు తాను శాయశక్తుల సహాయం అందిస్తానని డాక్టర్ సూర్యారెడ్డి హామీ ఇచ్చారు. ఆటా సంయుక్త కార్యదర్శి డాక్టర్ జానుపల్లి లింగయ్య, బాటా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఆటా కోశాధికారి యుగంధర్ రెడ్డి, తానా కార్యదర్శి చంద్రశేఖర రెడ్డి, కృష్ణ, అర్జున్ ద్యాపా, తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అధ్యక్షుడు మధు కె. రెడ్డిలతో పాటు ఇతర ఎన్నారైలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
జిల్లాలోని ప్రజల జీవనప్రమాణాలు పెంచడానికి కార్యక్రమాలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దాంతో పాటు అమెరికాలో ఉన్నత విద్యను అభ్యసించాలని ఆశించే విద్యార్థుల కోసం రిసోర్స్ సెంటర్ను ప్రారంభించాలని, జిల్లాలో విద్యా ప్రమాణాలను పెంచడానికి ఆదర్శ పాఠశాల ప్రాజెక్టును మెరుగుపరచాలని, పేద విద్యార్ధులకు, ప్రతిభగల విద్యార్థులకు సహాయం అందించడానికి పాలమూరు విద్యానిధిని ఏర్పాటు చేయాలని, సామాజిక, జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి పాలమురు ఫౌండేషన్ పేరుతో జిల్లాలోని ప్రముఖులను కూడా కలుపుకుని ఆర్థిక చారిటబుల్ సంస్థను ఏర్పాటు చేయాలని, స్థానిక లాయన్స్ క్లబ్ల తోడ్పాటుతో కంటి వైద్య శిబిరాలను నిర్వహణను కొనసాగించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు.