అమెరికాలో శివరాత్రి రోజు తెలుగు వెన్నెల
ముందుగా స్వీయ రచనల లో భాగంగా ప్రముఖ ప్రవాస కథకులు నిడదవోలు మాలతి కథ – దాని తీరుతెన్నులు, కథలు రాయడం లో గమనిచాల్సిన వస్తువుల గురించి వివరించి తను రాసిన కొన్ని కథలలోని విషయాలు ప్రస్తావించారు. మహాశివరాత్రి మీద, శివుని గొప్పతనం మీద ధూర్జటి పద్యాలను సాహిత్య వేదిక కార్యవర్గ సభ్యులు కాజ సురేశ్ గారు చదివి వినిపించారు. అలానే మహాశివరాత్రి నాడు ఆంధ్రప్రదేశ్ పల్నాడు లోని కోటప్పకొండ తిరునాళ్ళ ప్రసిద్ధిని, వైభవాన్ని వివరిస్తూ చేకూరి కేసీ తన అనుభవాలను పంచుకున్నారు. తన చిన్నతనం లో శివుడి మీద పాడిన పద్యాలనూ, పాటలను డా.ఆళ్ళ శ్రీనివాస రెడ్డి పాడి వినిపించడం సభికులందరినీ ఆకట్టుకుంది.
హ్యూస్టన్ నుంచి విచ్చేసిన చిట్టెన్ రాజు 'విసాయాసం" అనే హాస్య కథ ను చదివి వినిపించి, వచ్చే నెల మార్చి 10, 11 తేదీల్లో హూస్టన్లో జరుగుతున్నటువంటి మూడవ ప్రపంచ తెలుగు మహాసభలకు డల్లాస్ సాహీతి మిత్రులందరికీ ఆహ్వానం పలికారు. వెండితెర వేదికలో భాగంగా, ఫిబ్రవరి 9వ తేదిన పరమపదించిన ప్రసిద్ధ అలనాటి సంగీత దర్శకులు సుసర్ల దక్షిణామూర్తిని స్మరించుకుంటూ, అయన జీవిత విశేషాలను నసీం షేక్ క్లుప్తంగా పంచుకున్నారు. దక్షిణామూర్తి సంగీతం అందించినటువంటి చిత్రాలలోని ప్రసిద్ధి చెందిన పాటలను ప్రదర్శించి ఆయనకు ఘనమైన నివాళిని అందించారు.
ఇప్పటిదాకా ఒక కవిగా పరిచయస్తులైన కన్నెగంటి చంద్ర 32 సంవత్సరాలుగా రాస్తున్నటువంటి కథలతో తెచ్చిన పుస్తకాన్ని సంపుటి “మూడవ ముద్రణ – కన్నెగంటి చంద్ర కథలు" పుస్తకాన్ని ముఖ్యఅతిథి విన్నకోట రవిశంకర్, తానా అధ్యక్షులు తోటకూర ప్రసాద్, ప్రముఖ రచయిత్రి మాలతీ నిడదవోలు, హ్యూస్టన్ నుంచి వచ్చిన వంగూరి ఫౌండేషన్ వ్యవస్తాపకులు చిట్టెన్ రాజు చేతుల మీదుగా ఆవిష్కరించారు. సాహిత్యవేదిక కార్యవర్గ సభ్యులు మద్దుకూరి చంద్రహాస్ “మూడవ ముద్రణ" పుస్తకం గురించి మాట్లాడుతూ అందులో తనకు నచ్చినటువంటి 'మూడవ ముద్రణ", 'పాప", మొదలైన కథలలో, రచయిత చూపించినటువంటి కథాగమనాన్ని, శైలిని, ఇతర ప్రత్యేకతలను ప్రస్తావించి అభినందించారు. అలానే మరో కార్యవర్గ సభ్యులు మల్లవరపు అనంత్ మూడో ముద్రణ లోని కథలలోని కొన్ని విషయాలు చదివి వినిపించారు.
విన్నకోట రవిశంకర్ గారు “వచన కవిత్వం – పరిణామాలు, పరిశీలన" అనే అంశం మిద ప్రసంగించారు. తెలుగు సాహితీ చరిత్ర లో ఛందస్సుల బందోబస్తును తెంచుకుని ఉద్భవించిన వచన కవిత్వం తీసుకువచ్చిన మార్పు చాల గణనీయమైనదని, దీని ద్వారా కలిగినటువంటి ప్రయోజనాలను, పరిణామాలను వివరించారు. ఈ వచన కవిత్వం రాయడంలో అజంతా, ఇస్మాయిల్, శ్రీశ్రీ, ఆలూరి బైరాగి, ఇంద్రగంటి శ్రీకాంత శర్మ మొదలగు ప్రముఖ కవులు అనుసరించిన శైలిని ఒక్కొకటిగా వివరిస్తూ వివిధ కాలాలకనుగుణంగా వచన కవిత్వం లో వచ్చిన మార్పులను చాలా లోతుగా, సోదాహరణంగా వివరించారు.
చివరగా... ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం సంయుక్త కార్యదర్శి మరియుసాహిత్య వేదిక కార్యనిర్వాహక కమిటీ అద్యక్షులు శ్రీ సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ గారు, టాంటెక్స్ కార్యవర్గ సభ్యులు మల్లవరపు అనంత్, చామకూర బాల్కి, తానా అధ్యక్షులు తోటకూర ప్రసాద్ ముఖ్యఅతిథిని దుశ్శాలువతో సత్కరించారు. ఈ కార్యక్రమానికి టాంటెక్స్ అద్యక్షులు శ్రీమతి గీత దమ్మన గారు, పూర్వాద్యక్షులు ఎన్ఎంఎస్ రెడ్డి, కార్యదర్శి ఊరిమిండి నరసింహ రెడ్డి, కోశాధికారి కృష్ణారెడ్డి ఉప్పలపాటి, ఇతర కార్యనిర్వాహక సభ్యులు చిన్న సత్యం, జ్యోతి వనం, పూర్ణచంద్ర రావు, మహేష్ ఆదిభోట్ల కూడా హాజరు అయ్యారు.