లండన్లో తెలంగాణ నిరసన సభ
లండన్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) ఎన్నారై విభాగం ఈ నెల 23వ తేదీన ఈస్ట్ లండన్లో నిరసన నిర్వహించింది. యుకె నలుమూలల నుంచి తెరాస కార్యకర్తలు, తెలంగాణవాదులు ఈ నిరసన సభకు పెద్ద యెత్తున తరలి వచ్చారు. ముందుగా తెలంగాణ అమరవీరులకు రెండు నిమిషాల మౌనం పాటించారు. తర్వాత నల్లజెండాల ప్రదర్శన జరిగింది. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.
ఈ నిరసన సభలో తెరాస ఎన్నారై విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలంతో పాటు ఇతరులు ప్రసంగించారు. తెరాస అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు చావు నోట్లో తలపెట్టి సాధించిన తెలంగాణను సీమాంధ్ర నాయకులు, పెట్టుబడిదారులు వెనక్కి తీసుకుని వెళ్లారని వక్తలు విమర్శించారు. ఇందుకు కారణమైన సీమాంధ్ర నాయకత్వ పార్టీలు తెలంగాణ ప్రజలను మోసం చేస్తూనే ఉంటాయని వారన్నారు

సీమాంధ్ర పార్టీలను పొలిమేరలు దాటిస్తేనే తెలంగాణ రాష్ట్రం వస్తుందని వారన్నారు. తెలంగాణ అస్తిత్వం తోటే తెలంగాణ వస్తుందని, అది కూడా కెసిఆర్ నాయకత్వంలోనే సాధ్యమని వారన్నారు. ఈ నెల 28వ తేదీన జరిగే అఖిల పక్ష సమావేశానికి ఒక్కో పార్టీ నుంచి ఎంత మంది వెళ్లినా తెలంగాణకు అనుకూలంగా అభిప్రాయం తెలిపి, వెంటనే తెలంగాణ ప్రక్రియ ప్రారంభించే విధంగా చేయాలని వారు డిమాండ్ చేశారు.
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటించకపోతే రాబోయే రోజుల్లో తెలుగుదేశం, కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను ప్రజలు తెలంగాణలో నామరూపాలు లేకుండా చేస్తారని వారు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో ఎన్నారై తెరాస విభాగం అధ్యక్షుడు అనిల్ కూర్మాచలం, ప్రధాన కార్యదర్శి రాజ్కుమార్ శానబోయిన, సంయుక్త కార్యదర్శులు చందు, అశోక్, కోర్ సభ్యులు అభుజర్ మోహమ్మద్, విష్ణువర్ధన్ రెడ్డి, హరి నవాపేట్, రాజేష్, వెంకట్ రెడ్డి, ప్రశాంత్, శశిధర్, మధు రెడ్డి, సునీల్ పాల్గొన్నారు. తెలంగాణ ఎన్నారై ప్రతినిధులు సుధాకర్, ఉదయ్ కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications