తెలంగాణ వాయిదాపై ఎన్నారైల అసంతృప్తి
గత మూడేళ్లుగా పలు అఖిల పక్ష సమావేశాలు జరిగాయని, శ్రీకృష్ణ కమిటీ అన్ని పార్టీలతో, పౌర సమూహాలతో సమగ్రమైన సంప్రదింపులు జరిపిందని తెనా అధ్యక్షుడు వెంకట్ మారోజు అన్నారు. కాంగ్రెసు అధిష్టానం కూడా తన పార్టీకి చెందిన ఇరు ప్రాంతాల నాయకులతో సంప్రదింపులు జరిపిందని ఆయన గుర్తు చేశారు. మరింతగా సంప్రదింపులు అవసరం లేదని, సంప్రదింపులు జరగాలని అనడం నాన్చడానికే తప్ప మరోటి కాదని ఆయన అన్నారు.
కాంగ్రెసు పార్టీ 2009 డిసెంబర్ 9వ తేదీన చేసిన ప్రకటనకు కట్టుబడాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని అప్పటి హోం మంత్రి చిదంబరం మీడియాకు చెప్పారని, అదే విషయం పార్లమెంటులోనూ ప్రకటించారని ఆయన గుర్తు చేశారు. గత మూడేళ్లలో తెలంగాణ ప్రాంతంలో వేయి మందికి పైగా ఆత్మబలిదానాలు చేశారని ఆయన చెప్పారు. మృతుల్లో యువకులు, విద్యార్థులే ఎక్కువ మంది ఉన్నట్లు ఆయన తెలిపారు.
ఆంధ్ర ప్రాంతం నుంచి తెలంగాణను విడదీసి కాంగ్రెసు నాయకత్వంలోని యుపిఎ ప్రభుత్వం వెంటనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పూనుకోవాలని ఆయన కోరారు. రాజ్యాంగంలోని 3వ ఆర్టికల్ ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో ప్రవేశపెడితే బిజెపితో పాటు ఇతర పార్టీలు మద్దతు ఇస్తాయని, దాంతో బిల్లు సునాయసంగా ఆమోదం పొందుతుందని ఆయన అన్నారు.
తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులు, మంత్రులు వెంటనే రాజీనామా చేయాలని తెనా కార్యవర్గం డిమాండ్ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం తాము అమెరికాలోని వివిధ నగరాల్లో తాము సభలు నిర్వహిస్తామని వెంకట్ మారోజు చెప్పారు.