భారతీయ విద్యార్థి పరిస్థితి ఆందోళనకరం
మెల్బోర్న్: ఆస్ట్రేలియాలో ఇటీవల దుండగులు జరిగిన దాడిలో తీవ్ర గాయాలపాలైన భారతీయ విద్యార్థి మన్రియాజ్విందర్ సింగ్ (20) పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉందని అతని సోదరుడు యద్విందర్ సింగ్ తెలిపారు. అయితే వైద్య చికిత్సకు స్పందిస్తున్నాడని ఆయన చెప్పారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని ఆయన కోరారు. డిసెంబర్ 29న తన స్నేహితుడితో కలిసి ఫుట్ పాత్పై వెళుతుండగా ఎనిమిది మంది దుండగులు దాడికి పాల్పడ్డారు.
తన స్నేహితుడితో కలిసి మన్రియాజ్విందర్ సింగ్ ఫుట్పాత్పై నిలబడి ఉండగా, 8 మంది దుండగులు వచ్చి దాడి చేశారు. ఇద్దరినీ కూడా తీవ్రంగా కొట్టి వారి వద్ద ఉన్న సెల్ఫోన్లు లాక్కుని వెళ్లారు. ఆ దాడికి సంబంధించి సిసిటివీ ఫుటేజీని పోలీసులు విడుదల చేశారు. దాడికి పాల్పడిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. దుండగులు అఫ్రికావాళ్ల మాదిరిగా ఉన్నారని, ఓ కాకేసియన్ మహిళ కూడా వారిలో ఉందని డిటెక్టివ్ సీనియర్ కానిస్టేబుల్ ఆడం ఫోలే ఇటీవల మీడియాకు తెలిపారు.
విద్యార్థిని దవడలపై గట్టిగా గుద్దారని, దాంతో వెనక్కి పడిపోయి స్పృహ కోల్పోయాడని చెప్పారు. కిందపడిన తర్వాత కూడా వారు అతన్ని వదిలిపెట్టలేదని, తన్నుతూ కొట్టారని, మహిళ కర్ర తీసుకుని దాడి చేసిందని చెప్పారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన మన్రియాజ్విందర్ సింగ్ కోమాలోకి వెళ్లిపోయాడు. మరో స్నేహితునికి గాయాలయ్యాయి. ఆస్ట్రేలియాలో భారత కాన్సులేట్ అధికారి నిర్మల్ చౌదరి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మన్రియాజ్విందర్ సింగ్ను పరామర్శించారు.
బాధితుడి తల్లిదండ్రులు ఆస్ట్రేలియా వచ్చేందుకు వీసా విషయంలో సహాయం చేస్తున్నట్లు చైదరి తెలిపారు. కాగా భారతీయ విద్యార్థిపై జరిగిన దాడి కేసులో దర్యాప్తు చేపట్టిన పోలీసులు, సైడెన్హమ్ (17) అనే ఒక అనుమానితుడిని అరెస్టు చేశారు. ఇది ఇలా ఉండగా మెల్బోర్న్లోని భారత కాన్సులేట్ పోలీసులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికారులు ప్రకటించారు.