బోట్ ప్రమాదం: కాబోయే జంట మృతి, ఎన్నారైకి జైలు
న్యూయార్క్: మద్యం సేవించి బోట్ నడిపి ఇద్దరు యువతీయువకుల మరణానికి కారణమైన భారత సంతతికి చెందిన వ్యక్తిని అమెరికా పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో ప్రవేశపెట్టగా.. నిందితుడికి కోర్టు రెండేళ్లపాటు జైలు శిక్ష విధించింది. మృతి చెందిన ఇద్దరు కూడా వారం రోజుల్లో వివాహం చేసుకోవాలని నిర్ణయించున్నారు. ఈలోగా ఈ ఘటన చోటు చేసుకోవడం దురదృష్టకరం.
జోజో జాన్(36) హడ్సన్ నదిలో బోట్ నడిపి నిర్మాణంలో ఉన్న బార్జ్ను ఢీకొట్టాడు. దీంతో బోట్లోని ఇద్దరు యువతీయువకులు తీవ్రగాయాలపాలై మరణించారు. ఈ కేసులో దోషిగా తేలిన జోజోకు కోర్టు రెండేళ్లపాటు జైలు శిక్ష విధించింది. ప్రమాద ఘటన జులై, 2013లో చోటు చేసుకోగా.. కోర్టు గత మంగళవారం తీర్పు వెలువరించింది.
నిందితుడు మద్యం సేవించి బోట్ నడిపినట్లుగా పోలీసులు చెప్పారు. ప్రమాద ఘటనలో నిందితుడి స్నేహితులు పియర్మోంట్కు చెందిన లిండ్సే స్టువర్ట్, పియర్ల్రివర్కు చెందిన మార్క్ లెనన్ మృతి చెందారు. ఇద్దరూ 30ఏళ్ల వయస్సువారే. వీరు వారం రోజుల్ల వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నిందితుడు జోజోకు గాయాలయ్యాయి.
తన స్నేహితులు మరణించినందుకు తనకు చాలా బాధగా ఉందని జోజో జాన్ తెలిపాడు. వారంలో వివాహం చేసుకునే వారిద్దరి మృతి చెందడంతో తన గుండె పగిలిందని ఆవేదనగా చెప్పాడు. బాధితుల కుటుంబసభ్యుల ఎదుట ఏడుస్తూ జోజో జరిగిన విషయాన్ని తెలిపాడు. తన స్నేహితులు మళ్లీ వస్తారంటే తన ప్రాణాల్ని ఇచ్చేందుకు సిద్ధమని ఆవేదనగా చెప్పాడు. ఆ దేవుడు తన ప్రాణాలను తీసుకెళ్లినా బాగుండేదని అన్నాడు. సరైన వెలుతురు లేని కారణంగా ఈ ప్రమాదం చోటు చేసుకుందని జోజో తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించాడు.