ఎన్నారైలకు యూఎస్ ప్రతిష్టాత్మక అవార్డు
వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం యువ సైన్స్, ఇంజినీరింగ్ ప్రొఫెసనల్స్కు ఇచ్చే ప్రతిష్టాత్మక అవార్డుకు ఇద్దరు భారతీయ అమెరికన్లు ఎంపికయ్యారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా 102 మంది యువ శాస్త్రవేత్తలకు అత్యున్నత పురస్కారం యూఎస్ ప్రెసిడెన్సియల్ అవార్డును ప్రకటించారు. 102మంది యువ శాస్త్రవేత్తల్లో భారతీయ అమెరికన్లయిన కరుణేష్ గంగూలీ, హర్దీప్ సింగ్లు కూడా ఉన్నారు.
శాన్ఫ్రాన్సిస్కోలోని విఏ మెడికల్ సెంటర్లో యువశాస్త్రవేత్తగా తన పరిశోధనలు కొనసాగిస్తున్నారు కరుణేష్ గంగూలీ. కాగా మరో యువ శాస్త్రవేత్త హర్దీప్ సింగ్ హూస్టన్లోని విఏ మెడికల్ సెంటర్లో పరిశోధనలు చేస్తున్నారు. వీరు అమెరికా అత్యున్నత పురస్కారమైన ప్రెసిడెన్షియల్ అవార్డును పిన్న వయస్సులోనే అందుకోనున్నారు. వచ్చే ఏడాది అమెరికా ప్రభుత్వం ఈ అవార్డులను అందించనుంది.
ప్రస్తుతం యువకులైన ఈ శాస్త్రవేత్తలు, ఇంజినీర్లు ఆకట్టుకునే విజయాలను సాధిస్తున్నారని, వారు భవిష్యత్లో మరిన్ని ఎక్కువ విజయాలను సాధిస్తారనే నమ్మకముందని వైట్ హౌజ్ విడుదల చేసిన ప్రకటనలో ఒబమా తెలిపారు. ప్రపంచంపై అమెరికా తన నాయకత్వాన్నికొనసాగించేందుకు శాస్త్రవేత్తల నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు దోహదం చేస్తున్నాయని ఆయన అన్నారు.
కాగా ప్రెసిడెన్షియల్ అవార్డును 1996లో అప్పటి అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ ఏర్పాటు చేశారు. అధ్యక్ష కార్యనిర్వహక కార్యాలయం, సైన్స్, టెక్నాలజీ పాలసీల సహకారంతో ఈ అవార్డును రూపొందించారు. వివిధ రంగాలలో శాస్త్రవేత్తలు చేస్తున్న నూతన ఆవిష్కరణలు, పరిశోధనల ఆధారంగా వారికి ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది.