108 దేశాల పోటీని దాటుకుని.. ఇస్రో కల వైపు ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని
పేదరికం ప్రతిభకు అడ్డంకి కాదని, ఆకాశమే హద్దుగా కృషి చేస్తే సాధించలేనిది ఏదీ లేదని ఆంధ్రప్రదేశ్కు చెందిన ఒక సాధారణ వడ్రంగి కుటుంబ బిడ్డ నిరూపించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి సారిగా బాలికల కోసం నిర్వహిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష ప్రాజెక్ట్ 'మిషన్ శక్తిశాట్' (Mission ShakthiSAT)కు ఏపీకి చెందిన 10వ తరగతి విద్యార్థిని ఎంపికైంది. దాదాపు 108 దేశాల నుంచి 12 వేల మంది విద్యార్థినులు పోటీపడిన ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో, భారత్ నుంచి ఎంపికైన 20 మందిలో ఏపీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్రభుత్వ పాఠశాల విద్యార్థినిగా కాండ్రకోట జెస్సీ సరికొత్త చరిత్ర సృష్టించింది.
ధవళేశ్వరం నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు..
తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న కందుల జెస్సీది అత్యంత సాధారణ కుటుంబం. తండ్రి వడ్రంగి పని చేస్తుండగా, ఆర్థిక ఇబ్బందుల వల్ల ప్రైవేటు బడి నుంచి సర్కారు బడికి మారింది. అయితే పాఠశాలలోని 'అటల్ టింకరింగ్ ల్యాబ్'లో ఫిజికల్ సైన్స్ టీచర్ మణిమాల ప్రోత్సాహంతో జెస్సీ సైన్స్ పరిశోధనలపై మక్కువ పెంచుకుంది. ఆ ఆసక్తితోనే అంతర్జాతీయ సైంటిస్టులు నిర్వహించిన గ్లోబల్ ప్రొగ్రామ్లో భాగమై, ఉపగ్రహ వ్యవస్థలు, రాకెట్ ప్రోపల్షన్, స్పేస్ టెక్నాలజీ లాంటి సంక్లిష్టమైన అంశాలపై వందలాది ఆన్లైన్ సెషన్లు పూర్తి చేసి తన ప్రతిభను నిరూపించుకుంది.

విదేశీ శాస్త్రవేత్తల ఇంటర్వ్యూను దాటుకుని..
పాఠశాల స్థాయిలో చదివే అంశాల కంటే ఎంతో క్లిష్టంగా ఉన్న అంతరిక్ష శాస్త్ర పాఠాలను పట్టుదలతో నేర్చుకున్న జెస్సీ, ఆ తర్వాత జరిగిన కఠినమైన సెలక్షన్ ప్రాసెస్ నెగ్గింది. అంతర్జాతీయ నిపుణులు, శాస్త్రవేత్తలు ఇంగ్లీష్ లో నిర్వహించిన ఇంటర్వ్యూలోనూ, స్టెమ్ విద్య ప్రాముఖ్యతపై తను రూపొందించిన ప్రత్యేక వీడియోతోనూ అందరినీ ఆకట్టుకుంది. ఇంగ్లీష్ మాట్లాడటంలో ఉపాధ్యాయుల సాయం తీసుకుని, తన ఆత్మవిశ్వాసంతో గ్లోబల్ సైంటిస్టులను సైతం మెప్పించింది.
ఢిల్లీలో శిక్షణ.. శ్రీహరికోట నుంచి శాటిలైట్ ప్రయోగం!
ఎంపికైన ప్రాజెక్ట్లో భాగంగా జెస్సీ ఆగస్టు 23 నుంచి న్యూఢిల్లీలో జరిగే ప్రాక్టికల్ ట్రైనింగ్లో పాల్గొననుంది. అక్కడ శాస్త్రవేత్తలతో కలిసి శాటిలైట్ డిజైనింగ్, పేలోడ్ తయారీ, మిషన్ ఆపరేషన్లలో ప్రత్యక్ష శిక్షణ పొందనుంది. ఈ విద్యార్థినులు సంయుక్తంగా తయారుచేసే 'లూనార్ క్యూబ్శాట్' ఉపగ్రహాన్ని అక్టోబర్ 11న శ్రీహరికోట నుంచి రోదసిలోకి ప్రయోగించనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోదీని కలిసే అవకాశం లభించడంపై జెస్సీ ఆనందం వ్యక్తం చేస్తోంది. భవిష్యత్తులో ఇస్రో (ISRO)లో శాస్త్రవేత్తగా చేరి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తెస్తానని జెస్సీ ధీమాగా చెబుతోంది.
లోకేష్ ప్రశంసల జల్లు
ధవళేశ్వరం బడి పిల్లకు అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం దక్కడంపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆనందం వ్యక్తం చేశారు. ప్రభుత్వ పాఠశాల నుంచి అంతరిక్ష మిషన్ వరకు సాగిన జెస్సీ ప్రయాణం ప్రతీ ఒక్కరికీ స్ఫూర్తిదాయకమని కొనియాడారు. చదువుపై మనం పెడుతున్న పెట్టుబడుల విలువను ఇటువంటి కథనాలే గుర్తుచేస్తాయని, మూన్మిషన్ దిశగా అడుగులు వేస్తున్న జెస్సీకి శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన సోషల్ మీడియాలో ప్రత్యేకంగా ప్రశంసించారు.












Click it and Unblock the Notifications