పాకిస్తాన్ చంద్రమండల యాత్ర- ఉట్టికెగరలేదు గానీ..!!
భారత్ కు ధీటుగా అంతరిక్ష ప్రయోగాలపై పాకిస్తాన్ దృష్టి సారించింది. ప్రతిష్ఠాత్మక లూనార్ మిషన్ చేపట్టింది. 2035 నాటికి చంద్రుడిపై అడుగుపెట్టాలని ఆశిస్తోంది. దీనికి అవసరమైన చర్యలు తీసుకుంటోంది. తన మిత్రదేశం చైనా సహకారాన్ని కోరుకుంటోంది పాకిస్తాన్. పూర్తిగా చైనా మద్దతుపై ఆధారపడి ఉందీ మిషన్.
మనకు ఇస్రో మాదిరిగానే పాకిస్తాన్ కూ ఓ అంతరిక్ష ప్రయోగ సంస్థ ఉంది. దాని పేరు స్పేస్ అండ్ అప్పర్ అట్మాస్ఫియర్ రీసెర్చ్ కమిషన్ (SUPARCO). భారత్ నుంచి విడిపోయిన తొలి రోజుల్లోనే దీన్ని నెలకొల్పింది. 1961 సెప్టెంబర్ 16వ తేదీన ఇది ఏర్పాటైంది. నోబెల్ అవార్డు గ్రహీత డాక్టర్ అబ్దుస్ సలాం.. దీన్ని నెలకొల్పారు.

ఈ సంస్థ పేరుకు మాత్రమే ఉంది. మనుగడ అంతంతే. పెద్దగా అంతరిక్ష ప్రయోగాల జోలికి వెళ్లలేదు. దీనికి అవసరమైన బడ్జెట్ కేటాయింపులు కూడా ఉండట్లేదు. ఫలితంగా పాకిస్తాన్ ఎప్పుడూ కూడా సొంతంగా ఎటువంటి అంతరిక్ష ప్రయోగాన్నీ చేపట్టలేదు. అది పూర్తిగా చైనాపైనే ఆధారపడుతుంది. ఆ దేశం అందించే టెక్నాలజీ, ఇతర పరికరాల మీదే కార్యకలాపాలు సాగిస్తోంది.
ఈ క్రమంలో భారత్ కు ధీటుగా ఎదిగే ప్రయత్నాలకు పూనుకుంది సుపార్కో. చంద్రుడిపై అడుగుపెట్టడానికి ప్రయత్నాలు చేపట్టింది. 2035 నాటికి చందమామపై ల్యాండర్ ను పంపించాలని నిర్ణయించుకుంది. అంతకంటే ముందు- తన వ్యోమగామిని 2026 నాటికి చైనా అంతరిక్ష కేంద్రానికి పంపాలని లక్ష్యంగా పెట్టుకుంది.
ఉగ్రవాదం, అప్పుల ఊబిలో కూరుకుపోయిన ఆర్థిక వ్యవస్థ, నిరంతర రాజకీయ అస్థిరత వంటి సమస్యలతో సతమతమౌతోంది పాకిస్తాన్. ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొందక్కడ. ఈ పరిణామాల మధ్య పాకిస్తాన్ ఏకంగా అంతరిక్ష ప్రయోగాలపై కన్నేయడం.. భారీ లూనార్ మిషన్ చేపట్టడం ప్రాధాన్యతను సంతరించుకుంది.
పాకిస్తాన్ మంత్రి ఎహసన్ ఇక్బాల్.. లూనార్ మిషన్ కు అధిక ప్రాధాన్యత ఇస్తోన్నారు. ప్రస్తుతం ఆయన చైనా పర్యటనలో ఉన్నారు. ఆ దేశ రాజధాని బీజింగ్లో ఉన్నతాధికారుల సమావేశానికి హాజరయ్యారు. అక్కడే లూనార్ మిషన్ 2035కు సంబంధించిన వివరాలను వెల్లడించారు.
ఈ మిషన్ వ్యవహారాలన్నింటినీ కూడా సుపార్కోకు అప్పగించినట్లు ఎహసాన్ ఇక్బాల్ తెలిపారు. చైనా అణుశక్తి అథారిటీ, అంతరిక్ష సంస్థ అధిపతి షాన్ జోంగ్ డేతో సహా చైనా ఉన్నతాధికారులతో సమావేశంం అయ్యారు. అంతరిక్ష పరిశోధనల్లో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకుంటోన్నామని తెలిపారు.
ఈ మిషన్ ముఖ్య ఉద్దేశం.. పాకిస్తాన్ అంతరిక్ష, అణు సామర్థ్యాల్లో ఉన్న లోటును భర్తీ చేసుకోవడమేనని, ఆ దిశగానే చైనా అంతరిక్ష పరిశోధన సంస్థతో అత్యున్నత స్థాయి సమావేశాలను నిర్వహించామని ఎహసాన్ ఇక్బాల్ చెప్పారు. 2035 నాటికి చంద్రుడిపైకి ల్యాండర్ ను పంపిస్తామని తేల్చి చెప్పారు.
అలాగే తన మొదటి వ్యోమగామిని కూడా 2026 నాటికి చైనా అంతరిక్ష కేంద్రం ద్వారా అంతరిక్షంలోకి పంపాలని ఆశిస్తోంది. ఉపగ్రహ ప్రయోగాల నుంచి అణు సాంకేతికత వరకు పాకిస్తాన్ కు చైనా.. ఓ డ్రైవింగ్ ఫోర్స్ గా మారినట్టయింది. ఇటీవలే జిచాంగ్ శాటిలైట్ లాంచ్ సెంటర్ నుండి పాకిస్తాన్ రిమోట్-సెన్సింగ్ ఉపగ్రహాన్ని ప్రయోగించారు. దీని నిర్మాణంలో కూడా చైనా వ్యూహాత్మక భాగస్వామి.












Click it and Unblock the Notifications