అవునా.. నిజమా: సీరం చేతికి RCB- ఆ కండిషన్ కు ఓకే అంటేనే
ఈ ఏడాది ఐపీఎల్ ఛాంపియన్ గా ఆవిర్భవించిన జోష్ లో ఉంది.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 18 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం కప్ ను ముద్దాడింది. కొత్త కేప్టెన్ రజత్ పటిదార్ సారథ్యంలో ఐపీఎల్ టైటిల్ గెలుచుకుంది. ఐపీఎల్ 2025 ఫైనల్స్ లో పంజాబ్ కింగ్స్ ను మట్టికరిపించి.. విజయకేతనాన్ని ఎగురవేసింది. ఈ ఊపులో ఉన్న ఆర్సీబీ ఫ్రాంఛైజీలో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటోన్నాయి.
విజయ్ మాల్యాకు చెందిన యునైటెడ్ స్పిరట్స్ కంపెనీతో కలిసి ఆర్సీబీలో భాగస్వామిగా ఉంటోన్న డయాజియా.. ఫ్రాంఛైజీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్న విషయం తెలిసిందే. ఈ జట్టులో ఉన్న తన వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా విక్రయించడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుంది. ఇందులో భాగంగా తన భాగస్వామ్య హక్కుల వాల్యుయేషన్ కూడా పూర్తి చేసింది డయాజియా పీఎల్సీ. దాదాపుగా రెండు బిలియన్ డాలర్లకు వాటాలను విక్రయించాలని నిర్ణయించింది.

ఈ హక్కులను కొనుగోలు చేయడానికి తాజాగా ముందుకొచ్చారు సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అదార్ పూనావాలా. డయాజియా సంస్థతో సంప్రదింపులు ఇప్పటికే మొదలుపెట్టారు. ఇవి తుదిదశకు వచ్చాయి. ఒకట్రెండు రోజుల్లో అధికారికంగా అదార్ పూనావాలా చేతికి ఆర్సీబీ ఫ్రాంఛైజీ వెళ్లే అవకాశాలు ఉన్నట్లు సీఎన్బీసీ వెల్లడించింది. దీనిపై ఓ ఎక్స్ క్లూజివ్ కథనాన్ని ప్రచురించింది.
ఆర్సీబీ నుంచి డయాజియా యాజమాన్యం తప్పుకోవడానికి కారణాలు లేకపోలేదు. ఇది.. అల్కహాల్ బేవరేజెస్ కంపెనీ. లండన్ ప్రధాన కేంద్రంగా ప్రపంచవ్యాప్తంగా తన కార్యకలాపాలను కొనసాగిస్తోంది. భారత్ లో యునైటెడ్ స్పిరిట్స్ తో జాయింట్ వెంచర్ ను నెలకొల్పింది. ఆర్సీబీలోనూ వాటాలను కొనుగోలు చేసింది. ఈ సంస్థ ప్రధాన వ్యాపారం.. మద్యం. అదే ఇక్కడ ఆర్సీబీ నుంచి వైదొలగడానికి కారణమైంది.
డయాజియా వాటాను మాత్రం కాకుండా మొత్తం ఫ్రాంఛైజీ వాటాను కొనుగోలు చేయాలని అదార్ పూనావాలా ప్రయత్నాలు సాగిస్తోన్నట్లు తెలుస్తోంది. దీనికి యునైటెడ్ స్పిరిట్స్ అంగీకరిస్తేనే- ఆర్సీబీ ఫ్రాంఛైజీ పూనావాలా చేతికి వెళ్తుందని చెబుతున్నారు. ఈ లావాదేవీకి సిటీ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ మెయిన్ అడ్వైజర్ గా వ్యవహరిస్తోంది. దీనిపై వ్యాఖ్యానించడానికి అదర్ పూనావాలా నిరాకరించారని సీఎన్బీసీ తెలిపింది.












Click it and Unblock the Notifications