ఆ స్టార్ బ్యాట్స్ మెన్ పై బీసీసీఐ యూటర్న్-ఇంగ్లండ్ తో సిరీస్ కు పిలుపు..?
ఇంగ్లండ్ తో స్వదేశంలో జరిగే వన్డే సిరీస్ తో పాటు ఛాంపియన్స్ ట్రోఫీకి టీమిండియా ఎంపిక సెలక్టర్లకు సవాల్ గా మారుతోంది. పేపర్ మీద చూసేందుకు చాలా మంది ఆటగాళ్లు కనిపిస్తున్నా ఫైనల్ గా టీమ్ కాంబినేషన్లకు వచ్చే సరికి లెక్క తేలడం లేదు. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ తో జరిగే మూడో వన్డేలకు ఓ స్టార్ బ్యాట్స్ మెన్ కు గతంలో విశ్రాంతినిచ్చిన బీసీసీఐ.. తాజాగా మనసు మార్చుకుంది. తిరిగి అతను జట్టు ఎంపికకు అందుబాటులో ఉండాలని సూచించింది.
భారత వన్డే జట్టులో మిడిల్ ఆర్డర్ బ్యాట్స్ మెన్ కమ్ వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ ను ఇంగ్లండ్ తో స్వదేశంలో జరిగే మూడు వన్డేలకు దూరంగా ఉంచాలని బీసీసీఐ గతంలో నిర్ణయం తీసుకుంది. కేఎల్ రాహుల్ వ్యక్తిగతంగా కోరడంతో ఈ మేరకు అతన్ని ఇంగ్లండ్ తో వన్డేలకు పరిగణనలోకి తీసుకోకూడదని భావించింది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి జట్టు ఎంపిక కూడా కత్తి మీద సాముగా మారడంతో కేఎల్ రాహుల్ ను ఇంగ్లండ్ తో వన్డేలకు రప్పించక తప్పని పరిస్ధితి సెలక్టర్లకు ఎదురవుతోంది.

ఫిబ్రవరి లో భారత జట్టు ఇంగ్లండ్ తో స్వదేశంలో తొలుత 5 మ్యాచ్ ల టీ20 సిరీస్, ఆ తర్వాత మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడాల్సి ఉంది. ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ ఉంటుంది. అయితే టీ20 సిరీస్ సంగతి ఎలా ఉన్నా వన్డే సిరీస్ కు జట్టు ఎంపిక సెలక్టర్లకు సవాల్ గా మారింది. దీంతో జట్టు ఎంపికలో కాంబినేషన్స్ గురించి ఇప్పటికే సెలక్టర్లు తీవ్రంగా చర్చిస్తున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీని కూడా దృష్టిలో ఉంచుకుని ఇంగ్లండ్ తో వన్డేలకు జట్టును ఎంపిక చేయాల్సిన పరిస్ధితి నెలకొంది.
ఎందుకంటే 2023లో వన్డే వరల్డ్ కప్ తర్వాత భారత జట్టు కేవలం ఆరు వన్డేలు మాత్రమే ఆడింది. దీంతో మ్యాచ్ ప్రాక్టీస్ తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో కీలకమైన ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే ఆటగాళ్లు మ్యాచ్ ప్రాక్టీస్ తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలోనే వికెట్ కీపర్ బ్యాట్స్ మెన్ అయిన కేఎల్ రాహుల్ ను ఇంగ్లండ్ తో సిరీస్ కు దూరం పెట్టే పరిస్దితి లేదని తెలుస్తోంది. దీంతో కేఎల్ రాహుల్ ను సెలక్షన్ కు అందుబాటులో ఉండాలని బీసీసీఐ నుంచి ఆదేశాలు వెళ్లాయి.












Click it and Unblock the Notifications