జూనియర్ టీమిండియాకు షాక్..! పాక్ చేతిలో ఓటమితో బీసీసీఐ అసాధారణ నిర్ణయం..!
తాజాగా దుబాయ్ లో జరిగిన అండర్ 19 ఆసియాకప్ టోర్నీలో వరుస విజయాలతో ఫైనల్ కు దూసుకొచ్చిన యువ టీమ్ ఇండియా.. ఫైనల్లో మాత్రం పాకిస్తాన్ చేతిలో ఏకంగా 191 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. దీంతో ఈ టోర్నీ టైటిల్ పై బీసీసీఐతో పాటు అభిమానులు పెట్టుకున్న ఆశలన్నీ ఆవిరయ్యాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ అసాధారణ నిర్ణయం తీసుకుంది. వచ్చే నెలలో అండర్ 19 వరల్డ్ కప్ ప్రారంభమవుతున్న వేళ బీసీసీఐ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
అండర్ 19 ఆసియా కప్ టోర్నీని భారత్ ఘనంగా ఆరంభించింది. తొలి మ్యాచ్ లోనే యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఏకంగా 171 పరుగులు చేయడంతో మలేషియాను మట్టికరిపించింది. అదే సమయంలో అతనితోపాటు ఓపెనర్ గా దిగుతున్న కెప్టెన్ ఆయుష్ మాత్రే వరుస వైఫల్యాలు ఎదుర్కొన్నాడు. చివరికి ఫైనల్లో ఆయుష్ మాత్రేతో పాటు ఎన్నో ఆశలు పెట్టుకున్న వైభవ్ సూర్యవంశీ కూడా విఫలమయ్యారు. దీంతో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న భారత్ 347 పరుగుల భారీ స్కోరు సమర్పించుకుని, ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ విఫలమై భారీ తేడాతో ఓటమిపాలైంది.

ఈ నేపథ్యంలో బీసీసీఐ జూనియర్ ఇండియా టీమ్ ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో రెగ్యులర్ గా ప్రతీ టోర్నీ తర్వాత టీమ్ మేనేజర్ సమర్పించే రిపోర్ట్ తో పాటు టీమ్ లో ప్రతీ ఆటగాడిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. అలాగే కెప్టెన్ ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ ప్రదర్శనపై ప్రత్యేక రిపోర్ట్ తెప్పించుకుంటోంది. వీటి ఆధారంగా తదుపరి నిర్ణయాలు తీసుకునేందుకు సిద్దమవుతోంది. అలాగే కోచ్ హృషికేష్ కనిత్కర్, కెప్టెన్ ఆయుష్ మాత్రేను పిలిపించి మాట్లాడాలని నిర్ణయించింది.

పాకిస్తాన్ తో జరిగిన అండర్ 19 ఆసియా కప్ ఫైనల్లో స్టార్ ఆటగాళ్లు ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్యవంశీ.. ప్రత్యర్థి ఆటగాళ్లతో వాగ్వాదాలకు దిగడం, వారి ప్రదర్శన అంతంతమాత్రంగా ఉండటం, భారీ స్కోరు ఛేదనలో తడబాటు వంటి అంశాలపై బీసీసీఐ ఫోకస్ పెడుతోంది. వీటి ఆధారంగా వచ్చే నెలలో జరిగే అండర్ 19 వరల్డ్ కప్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications